19, అక్టోబర్ 2012, శుక్రవారం

గేట్లన్నీ బార్లా తెరచి యింకా సరిహద్దులేల???

ఈరోజు ఓ గంట క్రితం సాక్షి టీవీలో రాజకీయ పార్టీల విరాళాలు వసూళ్ళపై చర్చలో పాల్గొంటూ ప్రొ.హరగోపాల్ ఓ మాటన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టి విదేశీ కంపెనీలకు ఈ దేశ వనరులను దోచుకొనే అవకాశం కల్పించిన ప్రభుత్వం ఇంక పక్క దేశం వాడు వచ్చి ఏదో చేసేస్తాడని నమ్మిస్తూ సరిహద్దులను సైన్యంతో కాపలా కాయడం అవసరమా?? అని అడిగారు..

ఈ ప్రశ్న చాలా ఆలోచించదగ్గదే. విదేశీ కంపెనీలు వేదాంత తదితరమైనవి మన అడవులను, సహజ వనరులను ఎటువంటి జంకూ గొంకూ లేకుండా కొల్లగొడుతూ ఈ దేశ సంపదను ఎత్తుకెళ్ళి పోతుంటే యింకా చైనా వాడో, పాకిస్తాన్ వాడో ఈ దేశంపై దండేత్తుతాడని సైన్యాన్ని మేపుతూ సరిహద్దు రేఖలు గీచుకొని కూచోవడం అవసరమా?? ఎవడికి దొరికింది వాడు దోచుకుపోతుండడానికి చిల్లర దుఖాణాలతో పాటుగా అమ్మజూపుతున్న ప్రభుత్వాలకి ఈ దేశ సరిహద్దులంటూ ఇంత ప్రజా ధనం దుర్వినియోగం అవసరమా?? 

ఎక్కడికక్కడ ప్రజలను నిర్వాశితులును చేస్తూ ప్రశ్నించే వారిపై రక రకాల చట్టాల పేరుతో అరెస్టులు మరికొన్ని చోట్ల జనంపై కాల్పులు జరుపుతు ప్రాణాలు తీస్తున్న రాజ్యం ఈ కుహనా సరిహద్దు రేఖలను చూపి మనల్ని భ్రమలలో వుంచుతున్నాయి. విదేశీ కంపెనీలు, కార్పొరేటు సంస్థలు తమ వ్యాపార లావాదేవీలను నిరభ్యంతరంగా చేసుకోవడానికి తలుపులు బార్లా తెరిచి యిదే అభివృద్దని చెప్తున్న ప్రభుత్వ మోసకారితనాన్ని గ్రహించి నిలదీయాల్సిన సమయమిది.