14, ఆగస్టు 2016, ఆదివారం

ఈ గేం ఆఫ్ డెత్ ఎవరి కళ్ళకు గంతలు కట్టడానికి?

Nayeem dead body

నయీంను ఎన్కౌంటర్ చేసి చంపాక ఇంక సాక్ష్యాలెన్ని కూడబెట్టినా ఎవరిని శిక్షిస్తారు? ప్రధాన నిందితున్ని పట్టుకుని కాల్చి చంపి అనుచరులను అరెస్టులు చూపి భార్యా పిల్లలను నిర్బంధించి కూడబెట్టిన ఆస్తులను విపరీత లెక్కలు వేస్తు చూపుతూ తాను చేసిన నేరాలకు ఎవర్ని బాధ్యులను చేయడానికి ఈ సిట్ డ్రామా? ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకులను, తమకెదురు తిరిగే వారిని ఇందులో ఇరికించి చచ్చాక కూడా నయీం భయపెడుతున్నట్టు ప్రచారం చేస్తు తమ మీడియా అనుచరగణాన్ని ఉసిగొలుపుతూన్న ప్రభుత్వం ఎవరి మీద చర్య తీసుకుంటుంది? ఇవన్నీ కోర్టులలో నిలిచేవేనా? అసలు చంపాల్సి వచ్చిందెందుకో ఇప్పటికీ నోరు మెదపని హోం మంత్రి ఏం జవాబిస్తారు. ఇన్నేళ్ళు ఈ భేతాళున్ని మోసుకు తిరిగి తమ కుర్చీల కాళ్ళను విరిచేయ చూసినప్పుడు ప్రజల గోడు గుర్తొచ్చిందా? పదేళ్ళ క్రితం ఇదే నాయకులంతా మానవ అక్రమ రవాణా కేసుల్లో వున్నవారే కదా? వాటికీ ఏ చర్యాలేదు ఇప్పటికి. అప్పట్నుండి అంటకాగి ప్రజా సంఘాలను ఎదగనీయకుండా రకరకాల పేర్లతో భయపెట్టి, భయపడని వారిని తుదముట్టించేందుకు వాడుకుని ఇప్పుడు ఈ ఐ.పి.ఎస్.లు శ్రీరంగ నీతులు చెప్తారు. ఇదో తురుపు ముక్కగా దొరికింది అధికార పార్టీకి. అధికార గణాన్ని తమ కాలికింద చెప్పులా అణచి వుంచడానికి. ఈ గేం ఆఫ్ డెత్ ఎవరి కళ్ళకు గంతలు కట్టడానికి?

8, ఆగస్టు 2016, సోమవారం

రాజ్యం మరో వికృత రూపం

నయీం ఎన్ కౌంటర్ రాజ్యం వికృత రూపానికి మరో ఉదాహరణ మాత్రమే. వాడుకున్నన్నాళ్ళు వాడుకొని ప్రజా సంఘాల నేతలను దారుణంగా హత్య చేయించి ప్రజలలో భయాందోళనలను సృష్టించిన రాజ్యం తన పెంపుడు పిచ్చి కుక్కను ఇన్నాళ్ళు చంకలో ఎత్తుకు తిరిగి ఈరోజు చంపి తామేదో ఘనకార్యం సాధించినట్లు చెప్తున్నారు. నయీంను మఫ్టీలో తామే కాపలా కాస్తూ ఇన్నాళ్ళు పోషించి వారి ద్వారా తమ రియలెస్టేట్ దందా నడిపి కోట్లు కూడబెట్టుకున్న రాజకీయ నాయకులు పోలీసులు ఇంక అక్కరలేదు అనుకున్న సమయాన ఇలా హత్య చేయడం తామేదో నిజాయితీపరులమన్న ముసుగు వేసుకునేందుకు చేసిన హత్య తప్ప మరేం కాదు. ఇది మీడియాలో ఓ మూడు రోజుల వార్త తప్ప ఇంకేం కాదు. మరల మరో పిచ్చివాడితో మొదలు పెట్టొచ్చు.

హతమైన వారికి వారి కుటుంబాలకు ఇది కాస్తా ఊరట కావచ్చు కానీ రాజ్యం ఇలా చేసే పగటి హత్యలను ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్సును సమర్ధించలేను.