
కెన్యాలో పుట్టి , లండన్ లో విద్యాభ్యాసం చేసి తన చాతుర్యంతో ఒక దేశ పాలనా వ్యవస్థనే శాసించే స్థాయికి ఎదిగిన నీరా రాడియాను అభినందించకుండా ఉండగలమా?
అసలు ఒక కార్పొరేట్ లాబీయిస్టుగుప్పెట్లోకి మొత్తం దేశ పరిపాలనతోపాటు, ఆర్థిక వ్యవహారాలనే తాకట్టుపెట్టబడ్డాయంటే మనమెంత భద్రంగా వున్నామో తేటతెల్లమైంది..
నిజంగా ఈరోజు దేశ ఇంటలిజెన్స్ వ్యవస్థ ప్రధాని తమిళనాడు పర్యటనకు వెళితే టైగర్స్ వలన ముప్పుందని చెప్పారంట. ముప్పు పూర్తిగా అణగదొక్కబడిన వాళ్ళ వలన లేక కరుణ వలనన్నారో.. ఇలా మన మీడియా ద్వారా చీదించారా?
ప్రైవేటు ఆర్థిక దిగ్గజాలైన అంబానీ, టాటాలు తమ వ్యాపారాల కోసం ఎంత దిగజారి పావులు కదుపుతారో ప్రజలకు అర్థమైంది. మరల ఇందులో తమ పరువు పోతుందని కోర్టులకెక్కడమొకటి.
దేశ సర్వోన్నత న్యాయస్థానంలో కూడా ఈ తీగల ముళ్ళు చుట్టుముట్టాయన్నది మాజీ ప్రధాన న్యాయమూర్తిగారిపై వచ్చిన ఆరోపణలతో అసలు కార్పొరేట్ రంగం ఈ దేశ చతురంగ వ్యవస్థను ఎంతలా దిగజార్చిందో మనకర్థమౌతోంది.
ఈ దేశానికి అంతర్గత భద్రతకు మావోయిస్టుల వలన ముప్పని ఎక్కడ మైకు దొరికితే అక్కడ ఊదర గొట్టే ప్రధానికి ఈ లక్షా డెబ్బై వేలకోట్ల కుంభకోణం ఈ దేశ జవసత్వాలను పీల్చి పిప్పిచేస్తుంటే నోట్లో ఏమడ్డమొచ్చి ఊరకున్నారో?
ఓ పెద్ద రెండు రాష్ట్రాల సం.బడ్జెట్ అంత మొత్తం ఒకరి గుప్పెట్లోకి పోతే అంతర్జాతీయ స్థాయి ఆర్థిక మేధావుల పాలన ఇలా ఏడ్వడానికి వున్న చిదంబర రహస్యమేమిటో?
పార్లమెంటు మొత్తం స్థంభించిపోయి సమస్యలన్నీ గాలికొదిలేయబడి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ సిగ్గుతో తలదించుకొనేట్లుంటే ఇక్కడ మౌనం దాల్చి ఎక్కడో యూరోపియన్ దేశంలో నా పార్లమెంటో అని ఏడ్చిన వాణ్ణి ఇతగాన్నే చూసాం..
అటు ప్రతిపక్షం అధికారంలో వున్నప్పటి నుంచి ఇప్పటి అధికార పక్షం వరకు రాడియా నీడ చాటుకు పోవడాన్ని ఇంత మౌనంగా ఈ దేశ ప్రజలు భరిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో వున్నామో కదా?
ఒట్టిపోయిన ఆవుకు మేపు దండగన్నట్లు, చెవిటోడి ముందు శంఖమూదినట్లు ఎన్నని ఏం లాభం..
నిద్రపోయే వారిని లేపగలం కానీ, నిద్ర నటించే వాళ్ళని లేపడం ఎవరి తరం?
మేధావి వర్గం కార్పొరేట్ మాయలో పడింది.
యువత కెరీరిజం మోజులో కూరుకుపోయింది.
సామాన్యజనం ఏ పూట బత్తెం ఆ పూట దేవులాటలో కొట్టుమిట్టాడుతోంది.
కోట్లు దొబ్బుకుపోయేవాడు చల్లగా జారుకుపోతున్నాడు.
ఏ రోజుకారోజు ధరలు ఆకాశం దాటి దూసుకుపోయినా మన సెల్ మోగితే చాలు.. ఓ వంద ఫ్రీ మెసేజ్ లతో ఆడుకుందాం రా!!
