
రాజ్య స్వభావంపై మనకున్న భ్రమలను చెదరగొట్టే వరస సంఘటనల సమాహారం
బషీర్ బాగ్ కాల్పులు..
ముదిగొండ కాల్పులు..
సింగూరు, నందిగ్రాంల అణచివేత..
కాల్దారిలో రైతులపై కాల్పులు..
నిన్నటి సోంపేట కాల్పులు..
ఇలా రోడ్డురోలర్ నమూనాలో జరపతలపెట్టిన అభివృద్ధి పేరుతో రాజ్యం తన రక్కసి స్వభావాన్ని దాపరికం లేకుండా బయటపెడుతున్నా ఇదో గొప్ప ప్రజాస్వామ్య దేశంగా కీర్తిస్తున్న వర్గం తన స్వభావాన్ని ముసుగుతీస్తున్నట్లుగానే గ్రహించాలి.
ప్రజలే నాశనమైన తరువాత ఎవరిని ఉద్ధరిస్తారు?
ఎవరి సంక్షేమం కోసం తాము పనిచేస్తున్నారో నిన్నటి సంఘటనతో తేటతెల్లమైంది.
ఇక్కడ మరో విషయం పోలీసుల స్వభావాన్ని నిన్న మరింతగా వారు తెలియజేసారు. తాము ఓ కీలుబొమ్మలమే తప్ప తాము వచ్చిన వర్గ దృక్పధం కోల్పోయి నిండా చీర లేని ఆడువారిపై కూడా ప్లాస్టిక్ లాఠీలతో చావబాదుతూ చుట్టుముట్టి వారిని దారుణంగా హింసించడాన్ని కళ్ళారా చూసిన తరువాత కూడా ఏమనాలి?
నిన్నటి వరకు శాంతియుతంగానే ర్యాలీలతోను, ధర్నాలతోను, నిరాహార దీక్షలతోను, కోర్టులలో కేసులు వేసి, ప్రభుత్వానికి విన్నపాలను సమర్పించిన ప్రజలు చివరకు అన్ని దారులు మూసుకుపోయి తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదాన్ని అడ్డుకునే క్రమంలో ఉత్త చేతులతో కాళ్ళకు దండాలు పెట్టి అయ్యా అని బతిమాలినా వారిని కనికరించని వారిపై నిరాయుధంగానే ప్రతిఘటిస్తే వారిపై నేరుగా కాల్పులకు ఎగబడ్డ వారిని వెంటేసుకొచ్చిన రాజ్య ప్రతినిధులను ఎవరి ప్రతినిధులుగా గుర్తిద్దాం?
ఈ సంఘటనలతో ఇన్నాళ్ళు నివురుగప్పిన నిప్పులా వున్న ఉద్దానం తన పూర్వ రూపువైపు ఉద్యమాల వనంగా మారితే అది ఎవరి తప్పు?
ఎవరు ఉగ్రవాదో చెప్తారా?
