వాస్తవం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వాస్తవం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, అక్టోబర్ 2016, గురువారం

బెజ్జంగీ = యురీ దాడి


ఒక అసహజ మరణం పొందిన దేహానికి పోస్ట్ మార్టం చేయించడానికి ఎన్ని తిప్పలు పడితే బతిమాలుకుంటే రోజంతా రోదిస్తూ కాళ్ళా వేళ్ళా పడితే గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టరుకు  గంటా రెండు గంటలు పడుతుంది. అలాగే సాయంత్రం 5 తరువాత రూల్స్‌ ఒప్పుకోవని రేపటికి వాయిదా వేస్తారు. అలాంటిది కనీసం శవపంచనామాలు కానీ వీళ్ళు చెప్పే ఏ చట్టపరమైన రూల్స పాటించకుండా అర్థరాత్రి పాతికపైగా శవాలకు గిన్నీస్ రికార్డ్ టైంలో  పోస్ట్ మార్టం చేసేసి ఒక కంటైనర్లో అట్టపెట్టెలలో పడేసి కుళ్ళబెట్టన డీజీపీ ఎంత సౌమ్యంగా మీడియా ముందు ఎన్నెన్ని చిలుకపలుకులు వల్లిస్తున్నాడో. నిన్నొక నాలుగు శవాలు పోగేసి హెలికాప్టర్ లో చక్కెర్లు కొడుతుంటే కాల్పులు జరిపారు ఎదురు కాల్పులలో చనిపోయారు గుర్తు తెలియని వారంటారు. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ద యూనిఫాం ఉద్యోగి ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్నీ ఆడుతన్నాడు. 

నువ్ నిజంగా ఎదురుకాల్పులలో చంపితే హైకోర్టు ఇచ్విన ఉత్తర్వులు పాటించి కెజీహెచ్ కు తీసుకు రావడానికి ఎందుకు భయపడ్డావు దొరా? పోస్ట్ మార్టం వీడియో తీయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఎందుకు పాటించలేకపోయావొ చెప్పగలవా? వాళ్ల మొఖాలపై కత్తి గాట్లు నోటిలోంచి వచ్చిన పచ్చి నెత్తురు ఏ సాక్ష్యం చెప్తున్నాయి? ఇరవై ఏళ్లు నిండని ఆ లేలేత ముఖాలు కళ్ళు పీకిన నీ చేతులను ధైర్యంగా చూపగలవా?  కనీసం అక్కడ కాల్పులు జరిగిన ప్రదేశం ఫోటోలు ఎందుకు చూపలేక గుట్టలు వాగులు ఫోటోలు చూపుతున్నావు దొరా? రాజకీయ నాయకుల అరికాళ్ళు నాకే ఈ అధికారులు ఎన్నెన్ని అసత్యాలు ప్రచారం చేయాలో చేస్తున్నారు.

ఇంతమంది ఆదివాసీలను చంపి కనీసం శవాలపట్ల కూడా మానవత్వం చూపని వారు ఢిల్లీలో గిరిజన కార్నివాల్ జరిపి ఆదివాసీల హక్కులను భూములను హరిస్తే సహించననీ నీతులు వల్లిస్తాడు మన ప్రధాని రూపంలొని అసలు పోలీస్ బాస్. కనీసం అక్కడ చనిపోయిన వాళ్ళలో మూడు వంతులమంది ఆదివాసీ మహిళలు యువకులే కదా? వారి మాట కూడా ఎత్తకుండా చేతులూపి మాటాడే ఇండియన్ ట్రంప్ ఎవరిని బుజ్జగించగలడు.

ఇలా విషప్రయోగము జరిపి మత్తులో వున్నవారిని చంపి వారి పట్ల మాకు వ్యతిరేకత లేదు వారి చర్యలపైనే అని సన్నాయి నొక్కులు నొక్కి రక్తపుటేరులు పారించే వీళ్ళు యురీలో దాడి చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులకు ప్రతిరూపాలు కాదా? దీనిని సర్జికల్ స్ట్రైక్స్ తో పోల్చి గొప్పలు చెప్పడం కాదు. ఇది రాజ్యం ఉగ్రవాద దాడి. కనుకనే ఇంత మంది తెలుగు వారు చనిపోతే ఇరు రాష్ట్రాల అమావాస్య చంద్రులు నోరు మెదపరు. ప్రతిపక్ష నాయకులు ఖండించరు. వీళ్ళంతా ఒకే అతుకుల బొంతలోని చినుగులు కనుక. 

ప్రజాస్వామ్య వాదులారా విదార్థీ యువజన మేధావుల్లారా ఆలోచించండి. ప్రశ్నించండి.

Condemn the State Terrorism on its own people. 

15, ఆగస్టు 2014, శుక్రవారం

మేరా భారత్ మహాన్...



ఒకసారి మన్నించేయ్ 
ఇప్పుడేదో సాధించలేదని 
ఇంకెప్పుడో సాధించి పెడతామని 
ఆశ పడుతూ ఆశ పెడుతూ 
నీకో చాక్లెట్ ఇచ్చి 
జై కొట్టించి 
ఎండలో నిలబెట్టినందుకు

ఎగిరినంత సేపు లేదాయె గాలి
మూడు రంగులూ మూడు రంగులే ఎప్పటికీ
అవేవీ కలవకుండా ధర్మ చక్రం గిర్రున తిరుగుతూనే వుంటుందిలే

నీ రంగు నీదే నా రంగు నాదే 
వాడక్కడే ఏడుస్తూ ఈడుస్తాడు 
నేనిక్కడే కదలకుండా వల్లెవేస్తుంటాను
నువ్వక్కడికక్కడే నీలో నీవు మరిగిపో

ఎవడి నీళ్ళు వాడివే ఎవడి కంపు వాడిదే
గొంతు తడవనీయడెవడు
బురదనూడ్చేస్తానంటాడొకడు 
కడిగి పారేస్తానంటాడొకడు
వీళ్ళిద్దరి నాలుక కింద తిరుగాడే స్క్రూ వేరొకడిది

హద్దులు చెరిగిపోవాలంటాడొకడు
ఏ హద్దులో చెప్పని టక్కరి వాడు
నువు వదులు చేసాక పెడతాడా బోర్డ్ 
ఇక్కడ అన్నీ అమ్మబడును అని

చివారఖరికి నీ గోచి పాతకు
పిన్నీసు గుచ్చి 
వేలాడదీస్తావు 
చిరిగిన మూడు రంగుల కాగితాన్ని

మేరా భారత్ మహాన్...

13, ఫిబ్రవరి 2013, బుధవారం

రాజ్యం - హిందూ కార్పొరేట్ ఫాసిస్ట్ ముఖం..

వరుస ఉరి శిక్షల అమలుతో రాజ్యం తామింత కాలం దాచుకున్న లౌకిక ప్రజాతంత్ర ముసుగును తొలగిస్తోంది. ఓట్ల కోసం ఎంతకైనా తెగించే ధోరణితో ముందుకు దూసుకు వస్తోంది. తన విదేశీ ముఖాన్ని కప్పిపుచ్చుకోవడానికి కుంభమేళాకు హాజరయ్యేందుకు సిద్దపడుతూంది. ఈ దేశాన్ని ఒక వైపు సామ్రాజ్యవాద అనుకూల శక్తులకు ధారపోస్తూ విదేశీ వ్యాపార సంస్థలకు పూర్తిగా తాకట్టుపెడుతూ మరోవైపు సనాతన హిందూ వేషాన్ని ముసుగుగా చూపిస్తూ తిరిగి అధికారాన్ని చేపట్టాలని చూస్తోంది. ప్రతిపక్షానికి ఏ అవకాశాన్నీ వదలకుండా ఓట్లు దండుకునేందుకు దూకుడుగా వస్తోంది. ఇంతకాలం మైనారిటీ అనుకూల వాదిగా వున్న ముద్ర తొలగిపోయినా తనకెదురులేదన్న దిశగా కదులుతోంది. 

ఒకవైపు మూడోసారి స్వరాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన హిందూ ఫాసిస్ట్ తానే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకుంటూ వస్తున్న తరుణాన దానిని ఎదుర్కొనేందుకు తద్వార తన యువరాజుకు పట్టం కట్టేందుకే ఈ హత్యాకాండ సాగిస్తోంది. అధికార దాహానికిది పరాకాష్ట. ప్రజలకు వేరే ఆప్షన్ లేకుండా చూసే ప్రయత్నంలో భాగంగానే ఇంత నీచంగా కనీస ప్రజాస్వమ్య రాజనీతిని న్యాయ పరమైన సూత్రాలను కూడా లెక్క చేయకుండా ఉగ్రవాద ముద్రతో ప్రజల నోరు నొక్కుతూ వరుస హత్యలకు పాల్పడుతోంది. దీనిని ఏదో తమ విజయంగా అమాయకంగా సంబరాలు చేసుకుంటే ప్రజలకు తమ నట్టింట్లోకి ఈ గోముఖ వ్యాఘ్రాలు ప్రవేశించి తమ కాళ్ళకింద నేలను,  ప్రాణాలను హరిస్తాయన్న ఎరుక కోల్పోకూడదు. 

ప్రజాస్వామ్య ముసుగుతో నేరుగా సైనిక పాలనే సాగుతున్నది. ముమ్మాటికీ నిజం. ఇది పోలీసు రాజ్యం.  ఒకవైపు మధ్య భారతదేశమంతా సైనిక కవాతు చేస్తూ ఆదివాసీ ప్రజలను అత్యంత కౄరంగా 
హింసిస్తూవారి తరతరాల హక్కులను స్వేచ్చా స్వాతంత్ర్యాలను హరిస్తూ ఖాళీ చేయిస్తూ సహజ వనరులను 
కొల్లగొట్టడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తోంది.  

ప్రశ్నించే వేదిక ఏదైనా అది ఆఖరికి అంతర్జాలమైనా వారి గొంతునొక్కే కఠిన నిర్ణయాలు పాలకులు తీసుకుంటున్నారంటే ఇంక ప్రజలకు ఏ అవకాశముంది??  కావున దీనిని అతి జాగరూకతతో నివారించి మన హక్కులను కాపాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం ద్వారా ఈ దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం మనందరిదీ.

12, సెప్టెంబర్ 2012, బుధవారం

అన్నా హజారే ఎవరి ప్రతినిధి??

గత సంవత్సరమంతా దేశాన్ని ఊపు ఊపిన అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరాట ఉద్యమం ఆహ్వానించదగ్గదే అనిపిస్తూనే ఈయన ఎవరికి ప్రతినిధిగా ఈ ఉద్యమం నడుపుతున్నారో ఈ వేళ నే చదివిన అరుంధతీ రాయ్ గారి వ్యాసం పెట్టుబడిదారీ విధానం - ఓ ప్రేతాత్మ కథ చాలా విషయాలు చెప్పింది.

పెట్టుబడిదారీ దోపిడీకి మానవత్వపు ముసుగు తొడిగిన ఫోర్డ్ మరియు రాక్ ఫెల్లర్ ఫౌండేషన్లు స్పాన్సర్ చేసిన రామన్ మేగసేసే అవార్డు గ్రహీతలు ముగ్గురు ఈ ఉద్యమాన్ని నడిపే వారిలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఈ సంస్థల నేపథ్యం తెలుసుకోవాలంటే ఈ వ్యాసం తప్పక చదవాలి.

అన్నాహజారే, అరవింద్ కేజ్రివాల్, కిరణ్ బేడీల వెనక వున్న మద్దతు గురించి తప్పక తెలుసుకోవాలి. అరవింద్ కేజ్రీవాల్ కి ఉన్న అనేక స్వచ్చంద సంస్థలలో ఒక దానికి ఫోర్డ్ ఫౌండేషన్ ధారాళంగా నిధులు ఇస్తుంది. కిరణ్ బేడీ నడిపే స్వచ్చంద సంస్థకి కోకా కోలా, లేమన్ బ్రదర్స్ నిధులను ఇస్తున్నాయి.

అన్నా హజారే గాంధేయవాదినని చెప్పుకుంటాడు. కానీ అతను ప్రతిపాదిస్తున్న జన్ లోక్ పాల్ బిల్లు గాంధేయ వాదానికి వ్యతిరేకమైనది, ప్రమాదకరమైనది. ఆమధ్య యూరోప్, అమెరికాలను ఒక ఊపు ఊపిన వాల్ స్ట్రీట్ ముట్టడి ఉద్యమానికి భిన్నంగా ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది. ప్రైవేటీకరణ, కార్పొరేట్ శక్తుల, ఆర్థిక సంస్కరణల ప్రభావంతో అతలాకుతలమవుతున్న జనజీవనం గురించి ఒక్క మాట కూడా మాటాడని అన్నా అలాగే కార్పొరేట్ అవినీతి కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించి, రాజకీయ నాయకుల పట్ల ప్రజల ఆగ్రహాన్ని సాకుగా చేసుకుని ప్రభుత్వ అధికారాలు మరింత నీరు గార్చాలని, ప్రైవేటు పెట్టుబడులకు అనుగుణంగా సంస్కరణలను వేగవంతం చేయడానికి తోడ్పడేందుకు ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఇక్కడ మరో విషయం రెండువేల ఎనిమిదిలో అన్నాకు విశిష్ట ప్రజాసేవకు ప్రపంచ బ్యాంకు అవార్డు నివ్వడం యాధృచ్చికం కాదు. అవినీతి వ్యతిరేక ఉద్యమం తమ విధానానికి సరిగ్గా సరిపోయిందని వాషింగ్టన్ నుంచి ప్రపంచ బ్యాంకు ప్రకటన ఇచ్చింది.

యిలా రాజ్యం యొక్క సంక్షేమ పథకాలను నీరుగారుస్తూ ఆర్థిక సంస్కరణల పేరుతో దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న విదేశీ పెట్టుబడి సంస్థల కొమ్ము కాసేందుకు, ఆయా సంస్థలకు అనుకూలంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకు రావడానికి, వున్న ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి సెజ్ లు వంటి సామంత రాజ్యాల ఏర్పాటుకు ఓ సన్నాహక, మద్ధతుకు ముందస్తు ప్రక్రియగా ప్రజల మైండ్ సెట్ ను మార్చే ఉద్యమంగా దీనిని కార్పొరేట్ మీడియా సహకారంతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజల మౌలిక సమస్యల పట్ల ఏమాత్రం సానుభూతిలేని వీరి ఉద్యమం ఓ ఫార్సు. జనం కూడూ గుడ్డ, స్థానం కోల్పోయి ఎక్కడికక్కడ తమ భూమి, వున్న ఊళ్ళను విడిచి వలస బాట పట్టే విధంగా జన జీవనం అతలాకుతలం కాబడుతుంటే, దేశ సంపదను, సహజ వనరులను కొల్లగొట్టేందుకు పెద్ద ఎత్తున ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని గుర్తించకుండా నటిస్తూ తాము ఈ దేశానికి నిజాయితీ పరులుగా ఫోజులిస్తూ ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలకు మద్ధతుగా దీనిని ముందుకు తెచ్చారు.

ఈ సందర్భంగా రాజకీయ అవినీతిని కూడా తప్పక ఖండించాలి. అది అవినీతికి మూల విరాట్టే, కాదనను. కానీ, ఈ దేశ సహజ సంపదను మానవ వనరులను పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్న కార్పొరేట్ రంగాన్ని ప్రశ్నించి నిలువరించే ఉద్యమంగా ఇది ముందుకు రావాల్సిన అవసరముంది. అవకాశ వాద మధ్యతరగతి ప్రజల మనోభావాలను ప్రభావితం చేస్తూ అసలు అవినీతి మూల విరాట్టును వదిలేసి పైపై మెరుగులను ఆశించే ఇట్లాంటి ఉద్యమాల వలన ఏమాత్రం ఉపయోగముండదు. వ్యవస్థ సమూల మార్పునకు గురికాకుండా ఇలాంటి ఆయింట్ మెంటు ఉద్యమాల వలన జరిగే మార్పేమీ వుండదు.