28, అక్టోబర్ 2009, బుధవారం

I never speak Telugu మన విద్యా తాలిబానిజం:

కడప జిల్లా మైదుకూరులోని సైయింట్ జోసెఫ్ పాఠశాలలో పిల్లలు తెలుగులో మాట్లాడితే వారి మెడలో నేరస్థులులా ఐ నెవెర్ స్పీక్ తెలుగు అని రాసివున్న బోర్డులు వేలాడదీయడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. నిజానికి ఇది ఆ యాజమాన్యం తప్పేనా? తల్లిదండ్రులుగా మన బాధ్యత లేదా? ఆ విధంగా చేయడం ఆ టీచర్ చేసిన తప్పే అనుకుందాం. కానీ అమ్మ, నాన్న అనడమే నేరంగా వారి వీపును చీరేసే తల్లిడండ్రులు ఎంతమంది లేరు. అలా అనడాన్ని చిన్నతనంగా భావించే వారు ఎంతమంది లేరు.

హాయిగా ఆట పాటలతో చదువు నేర్చుకోవాల్సిన వయసులో వారిపై మనం మోపుతున్న కేజీల భారం నేరం ఎవరిది? ఎన్ని ఎక్కువ పుస్తకాలు కొనిపిస్తే ఆ కాన్వెంటే బాగుందనుకోని వారెవరైనావున్నారా? ఎంత తీరిక లేకుండా హోం వర్కులిస్తే వారే అత్యంత శ్రద్ధతో చెప్పినవారనుకుంటాం. ఇది పిల్లలపై వేస్తున్న మానసిక వత్తిడి గురించి ఆలోచించేమా ఎప్పుడైనా? ఏదైనా సంఘటన జరిగేటప్పుడు ప్లే కార్డులు పట్టుకొని రోడ్లపై రావడమే కాని వారిలో ఎంతమంది నిజానికి ప్రభుత్వ పాఠశాలలలో తెలుగు మీడియంలో చదివించేవారున్నారు. వార్తా చానళ్ళకునిన్న ఏ మసాలావార్తా లేకపోవడంతో ఇదో పెద్ద చర్చనీయాంశంగా మలుచుకొని కాలంగడిపేసారు.

నిజానికి పిల్లల మన:స్తత్వ శాస్త్ర నిపుణుల ప్రకారం బాల్యంలో ప్రాధమిక స్థాయిలో పాఠ్యాంశాల బోధన వారి మాతృ భాషలో జరిగితే అది వారి విజ్ఞాణ వికాశానికి సృజనాత్మకతను పెంచేందుకు  దోహద పడుతుంది. దీనిని పట్టించుకున్న వారు లేరు. నేడు మన ప్రధాన మంత్రి నుండి చాలా మంది నాయకులు, అత్యున్నత స్థానాలలోవున్న వారంతా నూటికి 90 శాతం మంది గ్రామీణ ప్రాంతంనుండి వచ్చిన వారే. నాడు ప్రభుత్వ ప్రాధమిక  పాఠశాలలో చదువుకున్న వారే? మరి వారికి ఇంగ్లీ షు భాషా ప్రావీణ్యతలేదా? అంతెందుకు ఉత్తరాంధ్రా వెనుకబడిన ప్రాంతానికి చెందిన తెలుగు సాహితీ దిగ్గజాలైన మహాకవి గురజాడ, మహాకవి శ్రీశ్రీ, రోణంకి అప్పలస్వామి, చాసో, పతంజలి మొ.న వారు ప్రాథమిక విద్యాభ్యాసం ఎక్కడ చేసారు? వారు చదవని ఆంగ్ల సాహిత్యంవుందా? భాషనేర్చుకోవాలన్న శ్రద్ధ వుంటే అది కష్టంకాదు. బలవంతంగా రుద్దుతూన్న మనం తాలిబాన్లకు తీసిపోతామా?

పోటీ ప్రపంచం పేరుతో మన ఆత్మన్యూనతా భావాన్ని కప్పిపుచ్చుకునేందుకు పిల్లలపై అధిక భారంతో పాటు మానసిక వత్తిడిని పెంచి వారిని డబ్బు సంపాదించే యంత్రాలుగా మార్చుతున్న మనదే ఈ నేరం. దీనికి తోడు కొత్తగా సక్సెస్ స్కూళ్ళ పేరుతో ఒకటో తరగతినుండే్ ఆంగ్ల మాధ్యమంలో బోధించమని శాసనాలు చేస్తున్న ప్రభుత్వానికి భాగస్వామ్యంలేదా? కార్పొరేట్ విద్యా వ్యాపారులకు అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు తెస్తున్న నాయకమ్మన్యులదే ఈ నేరం కాదా? పాపం పసివాళ్ళు.

22, అక్టోబర్ 2009, గురువారం

'A Seminaar on No to Use of Army & Airforce Against the people'


Naujawan Bharat Sabha invited you to "A Seminar on NO to Use of Army & Air Force Against the People" on 24 అక్టోబర్ ‌న 15:00 ‌కు. కార్యక్రమం: A Seminar on NO to Use of Army & Air Force Against the People What: Protest ప్రారంభ సమయం: 24 అక్టోబర్ ‌న 15:00 ‌కు ముగింపు సమయం: 24 అక్టోబర్ ‌న 18:00 ‌కు స్థలం: Speaker’s Hall, Constitution Club, New Delhi

21, అక్టోబర్ 2009, బుధవారం

ఆపరేషన్ గ్రీన్ హంట్ వెనక చిదంబర రహస్యం

దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించే కార్యక్రమంగా ప్రకటించిన ఆపరేషన్ గ్రీన్ హంట్ కార్యక్రమం ఎవరి గురించి చేపట్టారు? నిజానికి ఈ రోజు నూటా పది కోట్లకు పైగా జనాభా కలిగిన భారత దేశంలో మావోయిస్టు పార్టీ వెనక వున్నజనం ఎంతమంది? ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారుగా నాలుగువేలమంది సాయుధ మావోయిస్టు సభ్యులున్నారని తెలుస్తోంది. మరి వీరి గురించి సుమారు లక్షకు పైగా సైన్యాన్ని తరలించే కార్యక్రమం చేపట్టిన దేశీయ వ్యవహారాల మంత్రి ఇదంతా ఎవరికోసం చేస్తున్నట్లు. శ్రీలంకలో రాజపక్సే ఎల్టీ టీఈ వారిని సైనిక చర్యల ద్వారా అత్యంత పాశవికంగా అణచివేసిన స్ఫూర్తితో ఇక్కడ కూడా అదే పద్ధతిలో మావోలను పూర్తిగా నిర్మూలించే కార్యక్రమాన్ని చేపట్టారు.

అయితే వీరి కార్యక్రమం వలన వేలాది గిరిజన ప్రజానీకం నిర్వాసితులవుతున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో అనేక మంది వూచకోతకు గురయ్యారు. దీనిని ఆపేందుకు సిటిజన్స్ ఇనిశియీతివ్ ఫర్ పీస్ పేరిట నిన్నను ఢిల్లీలోజరిగిన ఒక సమావేశంలో దీశావ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన మేధావులు, మాజీ న్యాయమూర్తులు, పౌరహక్కుల సంఘాల నేతలు దేశంలో అంతర్గత యుద్ధం తగదని ప్రభుత్వానికి హితవు చెప్పారు. దీనికి సమాధానంగా చిదంబరం మావోలు హింసను విడనాడితే మేము చర్చలకు సిద్ధమని ప్రకటించారు. కాని ఆయన ప్రకటనను నమ్మేందుకు ఆయన గురించి తెలిసిన వాళ్ళెవరు నమ్మలెరని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ వ్యాఖ్యానించారు. ఇటివల ఒక విదేశీ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోచిదంబరం మాటలకు చేతలకు మధ్య వున్న వైరుధ్యాన్ని ఆమె వివరించారు. చిదంబరం హార్వర్డ్ లో శిక్షణ పొందిన న్యాయవాది. దేశ చరిత్రలో మొదటిసారి అతిపెద్ద కార్పోరేట్ కుంభకోణం జరిపిన ఎన్రాన్ సంస్థకు ఆయన న్యాయవాదిగా వ్యవహరించారు. సెక్యూరిటీకుంభకోణం లో పాలుపంచుకున్న ఫైయిర్ గ్రోత్ కంపెనీలో వాటాలు కొన్నందుకు పీవీ హయాంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసారు. ఒరిస్సాలో మైనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద మైనింగ్ కార్పోరేట్ సంస్థ వేదాంత గవర్నర్ల బోర్డ్ లో చిదంబరం వున్నారు. ఆర్దిక మంత్రి అయిన మొదటి రోజే ఈ బోర్డ్ కు రాజీనామా చేసారు. ఆయన ఎన్నో పెద్ద పెద్ద కంపెనీల తరపున న్యాయవాదిగా వ్యవహరించి ఆర్ధిక మంత్రి అయిన తర్వాత వాటినుండి వైదొలిగారు. అయితే చిదంబరం స్థానంలో ఆయన సతీమణి నలిని ఆ కేసులను వాదించడం యాదృచ్చిక మాత్రం కాదు.

ఈ దేశంలో ఎనభై ఐదు శాతం మంది ప్రజలు నగరాల్లో జీవిస్తే దేశం బాగుపడుతుందని ఆయన ఒకసారి ప్రకటించారు, అంటే దాదాపు డబ్భై కోట్ల మంది దాకా పల్లెలు ఖాళీ చేసి పట్టణాలలో పడాలన్నమాట. దీనిని సాధించేందుకు లక్షలాది మంది సైన్యాన్ని గ్రామాలకు తరలించి ఖాళీ చేయిస్తున్నారు. అత్యంత ఆధునిక ఆయుధాలతోను, ఉపగ్రహ సహకారంతోను మావోయిస్టులను అణచివేసేందుకు లక్షల కోట్ల ప్రభుత్వ ధనాన్ని వినియోగిస్తున్నారు. నిజానికి ఇదే చైతన్యంతో మారుమూల గ్రామాలకు కనీస సౌకర్యాల కల్పనకు ఈ దేశంలో గత అరవై రెండు సం.లుగా ఏలిన ప్రభుత్వాలు కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు., ఆదివాసీ ప్రాంతాలపై ప్రభుత్వ దృష్టి మళ్లడం వెనుక ఆ ప్రాంతంలోని ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు విదేశీ కంపెనీలకు అవకాశంకల్పించేందుకు మాత్రమేనన్నది చిదంబర రహస్యమేమీ కాదు. విదేశి కంపెనీలు ఈ దేశంలో స్వేచ్చగా అడుగు పెట్టేందుకు చిదంబరం వంటి ఆర్ధిక మంత్రి కావలసి వచ్చాడు మన్మోహన్ సింగ్ కు. అలాగే ఇప్పుడు వారి కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అడ్డుపడుతున్న మావోయిస్టులను అణచివేసేందుకు హోం మంత్రి రూపంలో చిదంబరం అవసరమయ్యాడు. చర్చలు జరిపినా, అందుకు మావోయిస్టులు అంగీకరించినా చిదంబరం ఆదివాసీలను తమ ప్రాంతంలో తామూ నివసించేందుకు అనుమతిస్తారా? అంతర్గత యుద్ధం చేయడానికి ఇంతగా ముందుకు వచ్చిన తరువాత చర్చలు అన్నవి ఒక ముసుగు మాత్రమె. తెల్లపంచే, దోవతిలతో, చెరగని చిరునవ్వుతో అడ్డు నామంతో దర్సనమిచ్చే ఈ గోముఖ వ్యాఘ్రం వెనక వున్న శక్తి సామ్రాజ్య వాదమని వారి పెట్టుబడితో, ఆయుధ, సాంకేతిక సహకారాలతో విరుచుకు పడుతున్నది కార్పోరేట్ పెట్టుబడిదారీ వ్యవస్థని అర్థం కాని ముర్ఖులేవరున్నారు.

ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరిట దళారి బూర్జువాలు, అమెరికన్ సామ్రాజ్యవాదులు ఈ దేశ వనరులను కొల్లగొట్టేందుకు వీలుగా వత్తిళ్ళు చేయడమే వీరి ఉద్దేశ్యం. టాటాలు, మిట్టల్స్, రుయాలు, జిందాల్స్, బిర్లాలు, వేదాంత, పోస్కో కంపెనీలు యుపియే నేతలకు ఎన్నికల నిధులు సమకూర్చాయి. వారి దోపిడీని అడ్డుకునే ప్రథాన శత్రువు దేశంలో మావోయిస్టు పార్టీ మాత్రమే. అందుకే వారి అడ్డును పూర్తిగా తొలగించే కార్యక్రమాన్ని చేపట్టే పేరుతొ ఆదివాసీ ప్రాంతాలను అప్రకటిత యుద్ధానికి సిద్ధమయింది. ఈ వినాశకర యుద్ధాన్ని ఆపేందుకు మేధావులు, ప్రజాస్వామిక వాదులు కృషి చేయాలి. నిజానికిది నక్సలిజం పై యుద్ధం పేరుతొ సహజ సంపదను బడా కంపెనీలకు ధారాదత్తం చేసే కుట్రగానే గుర్తించాలి.

11, అక్టోబర్ 2009, ఆదివారం

మరణం - నిస్సహాయతా? - నిరసన ?

నా సాహితీ మిత్రుడు నిత్య అధ్యయనశీలి, విమర్శకుడు, కవి, కథారచయిత అయిన శ్రీ పడాల జోగారావుగారు శ్రీకాకుళం లోని కథానిలయం చెంతనే వున్న తన స్వగృహంలో నిన్న సాయంత్రం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గత కొ౦త కాల౦గా ఆయన కుటుంబ౦లోని నమ్మక ద్రోహానికి వ్యతిరేక౦గా తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తూ౦డేవారు. దానికి తోడు నిత్యము అరకొర జీత౦తో ఆర్ధిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు. దగ్గర్లోని కాళీపట్న౦ రామారావు మాస్టారు, శ్రీకాకుళ సాహితీ అధ్యక్షులు శ్రీ బి.వి.ఏ.రామారావునాయుడు మాస్టారుగారు, మిస్క క్రిష్నయ్య మాస్టారు ఆయనకు చేదోడు వాదోడుగా వుంది సహకరి౦చేవారు. కానీ తాను నమ్మిన విలువలను తూచా తప్పక పాటి౦చే మనిషి కావడ౦తో తాను గురిఅయిన నమ్మక ద్రోహాన్ని మరిచిపోలేని తన౦తో నిత్యము స౦ఘర్శణకు లోనయి నిన్నటికి మరి ఏ విషాదకర మాటల ఈటె తగిలి౦దో గాని బద్దలైన తన గు౦డె గాయానికి పురుగులమ౦దుతో ఆర్పాలనుకోవడ౦ విషాదకర నిర్ణయ౦. మిత్రులందరికి తాను అన్ని రకాల స౦దేహ సమయాలలో తోడుగా వు౦డి గైడ్ చేసిన మనిషి ఇ౦త బాధాకర నిర్ణయంతో మమ్మల్ని ఒంటరి వాళ్ళను చేసిపోయారు.

తాను కథలు రాసినవి తక్కువే అయినా జీవితానుభవాలతో నలుగురికి ఆలోచనాత్మక౦గా వుండేవి, కవితలలో కూడా తాను జీవిత స౦ఘర్శణనే ఆవిష్కరించే వారు. ముఖ్యంగా తన మిత్రులతో పాటు తనను వ్యతిరేకి౦చే వారికైనా విశ్లేషణాత్మక౦గా మ౦చి వివరణలతో సుదీర్ఘమైన వుత్తరాలు రాసి గైడ్ చేసేవారు. తొలినాళ్ళలో ర౦గనాయకమ్మ గారితో కూడా ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా చర్చలు చేసే వారు. అలాగే చేరా గారితోనూ. కథానిలయ౦ కార్యక్రమాలలో అన్నీ పాలుప౦చుకొని తన విలువైన భాగస్వామ్య౦తో ఎ౦తో సహకరి౦చారు. శ్రీకాకుళం లో జరిగే ప్రతి సాహితీ కార్యక్రమాలలో ము౦దు౦డేవారు. అటువ౦టి సాహితీ మిత్రుడిని కోల్పోవడ౦ ఒక్క శ్రీకాకుళ మిత్రులకే కాదు సాహితీ ర౦గానికి కూడా తీరని నష్టమే.

ఆత్మ హత్య ద్వారా తాను తెలియచేసిన నిరసనకు నా స౦ఘీభావాన్ని తెలియచేస్తూనే అది వ్యవస్థ చేసిన మరో క్రూరమైన హత్యగానే భావిస్తున్నాను.

10, అక్టోబర్ 2009, శనివారం

రాజ్యం ఉక్కుపాదంలో దిగబడిన ముల్లు మన బాలగోపాల్


కా.బాలగోపాల్ వంటి మేధావిని సమయంలో కోల్పోవడం మనందరి దురదృష్టం. హక్కుల ఉద్యమ చుక్కాని లేని నావ అయ్యింది. రాజ్య హింస నేడు అనేక కొత్త రూపాలలో ప్రజలపై దాడులు చేస్తుంటే తాను ముందుగానే వాటిని తెలుసుకొని అందరిని జాగురూకులనూ చేసిన మహా దార్శనికుడు. ఆయన నిన్నటివరకు మనమధ్య తిరుగాడిన లివింగ్ లెజెండ్. సమకాలిన మార్క్సిస్టు సిద్ధాంతవేత్తలలో అత్యంత నిబద్ధత కలిగిన వారు. అణగారిన ప్రజల చేతిలో ఎక్కుపెట్టిన విల్లు.
బాలగోపాల్ గారితో నాకు ఎనభై ఏడు నుండి పరిచయం వుంది. డిగ్రీ చదివిన తరువాత అదే వూపులో పౌరహక్కుల సంఘం సభలకు తరచుగా హాజరయ్యేవాడిని. సార్ విశాఖ వస్తారని తెలియగానే వెళ్ళేవాడిని. ఆయన వున్నన్నాళ్ళు కలిసి వుండే వాడిని. వి.ఎస్. కృష్ణా (ఇప్పుడు మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి) గారి ఇంటిలో బసచేసేవారు. కృష్ణ జే.ఎన్.యు.నుండి వచ్చిన కొత్తలో చాలా ఇటరెస్టి౦గ్ గా వుండే వాడు. పుస్తకాలు పై చర్చలు జరిగేవి. రోజుల్లో ఎక్కడ ఎదురుకాల్పులు జరిగినా, వరకట్న హత్యలు జరిగినా, దళితులపై దాడులు జరిగినా సార్ వెంటనే వచ్చేవారు. పౌరహక్కుల సంఘానికి తానె అన్నిఅయి పనిచేసేవారు. ఎంతటి ఇ౦టీరియల్ ప్లేస్ అయినా ధైర్యంగా వెళ్ళే వారు. నిజనిర్ధారణ కమిటి పేరుతొ మిగతా సంఘాలను కూడా కలుపుకొని అక్కడి పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసేవారు. సమస్య ఎక్కడ వుంటే అక్కడ బాలగోపాల్ వస్తారని అంతా ఎదురుచూసేవారు. పోలీసులకు నిద్ర పట్టేది కాదు. దాంతో తనపై రాజమ౦డ్రిలో దాడి చేసి చ౦పబోయారు. దగ్గరలో వున్న ప్రజలు కాపాడడ౦తో తలపై బలమైన గాయంతో బయటపడ్డారు. తరువాత రాజ్యహింస తో పాటు ఉద్యమ హింసను కూడా వ్యతిరేకించాలనే తీర్మానంతో ఆయన సి.ఎల.సిలో చర్చ పెట్టారు. కాని ఒక బలీయమైన రాజ్యంతో పోరాడుతున్న క్రమంలో ఇన్ఫార్మర్ వ్యవస్థను అమలుచేస్తూ ఉద్యమం మనుగడకు ముప్పు వాటిల్లినప్పుడు తప్పని సరై వాళ్ళని మట్టు పెట్టడంను, రాజ్యం అత్య౦త పాశవికంగా దాడులు చేస్తున్నప్పుడు వారి బలగాలను అడ్డుకోవడానికి పోలీసులనుకూడా మందుపాతరలతో చంపక తప్పని స్థితిని హింసగా పేర్కొనడాన్ని మెజారిటి సభ్యులు వ్యతిరేకించడంతో తాను పౌరహక్కుల సంఘం నుండి బయటకు వచ్చి మానవ హక్కుల వేదికను ఏర్పాటు చేసుకున్నారు. అయినా సరే పోలిసులు సాగించిన కట్టుకథల ఎదురుకాల్పుల స౦ఘటనలకు వెంటనే స్పందించేవారు. రాజ్యానికి ఎప్పుడూ లోకువ కాలేదు. పూర్తికాలం హైకోర్టు న్యాయవాదిగా వుంటూ పేదల పక్షాన అనేక కేసులు వాదిస్తూ వారికి న్యాయాన్నిఅతి తక్కువ ఖర్చులూ అందుబాటులోకి తేవడానికి తన శాయశక్తులా కృషి చేసారు. మద్యన విజయనగరం జిల్లాలోని రాష్ట్రంలోనే అతి పెద్ద జూట్ మిల్లుగా పేరుగాంచిన నెల్లిమర్ల కార్మికుల జీతాలపై వారికి అనుకూలంగా తీర్పు తెచ్చారు. అలాగే లాకప్ డెత్లు ఆనాడు విరివిగా జరిగేవి. ఎవరూ పోలీసులకు వ్యతిరేకంగా మాటాడని రోజుల్లో తాను నిజనిర్ధారణ చేసి అనేక కేసులను హైకోర్టు వరకు తీసుకుపోయి అధికారులను వెంటనే సస్పెండ్ చేసి దర్యాప్తు జరిగేట్లు చేయడానికి ఆయనే కారణం. అలాగే మరణించిన ఉద్యమకారుల పార్థీ శరీరాలను అతి దయనీయంగా పోలిసులు పాతేస్తూ, కిరోసిన్ పోసి కాల్చేస్తూ చివరి స౦స్కారానికి కూడా వారి బంధువులకు అవకాసం లేకుండా చేసేవారు. అలాగే పోస్టుమార్ట౦ తంతు కూడా వారికి అనుకూలంగా చేసుకునేవారు. వీటిపై కన్నాభిరాన్ గారితో కలిసి హైకోర్టులో పోరాడి సుప్రీం కోర్టు తీర్పునకు లోబడి పోస్టుమార్టం కూడా నిపుణులైన డాక్టర్ల బృందంతో వీడియో తీస్తూ జరిగేట్టు కృషి చేసారు. గిరిజన ఆదివాసి ప్రా౦తాలలో ప్రతియేడు జరుగుతున్నా విషజ్వరాలపై వారి తరపున అలుపులేని పోరాటం చేసారు. అలాగే ప్రభుత్వం తూర్పు గిరిసీమలలోని బాక్సైటు ఖనిజాన్ని కొల్లగొట్టి ప్రైవేటు కంపెనీలకు అమ్మేదానిపైనా అల్యుమినా ఫ్యాక్టరీ పెడితే కలిగే అనర్దాలపైన తీవ్రమైన పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచారు. అలాగే ద౦డ కారణ్యంలో సల్వాజుడుం పేరుతొ ఆదివాసి తెగలమధ్య పెట్టిన కార్చిచ్చుతో జరుగుతున్నా అమానవీయ హింసకు వ్యతిరేకంగా తను సొంతంగా పర్యటించి వ్యాసాలూ రాసి, సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ వేసి పోరాటం చేస్తున్నారు. రాజ్యం పౌరుల హక్కులను హరి౦చే ప్రతి అంశంను న్యాయస్థాన౦ దృష్టికి తేవడానికి తద్వారా అభాగ్యులకు అ౦డగా నిలవడానికి అహర్నిశలు తన ఆరోగ్యం క్షీణిస్తున్న కృషి చేసిన నిరాడంబర జీవి. ఏనాడు అవార్డుల కోసం ఎదురుచూడని మనిషి. మద్య ఇస్తున్న రామన్ మాగాసేసే అవార్డు గ్రహీతలను చూస్తుంటే నవ్వు వస్తుంది. రాజ్యానికి అనుకూలంగా వున్న వారికి ఇలాంటి సత్కారాలు లభిస్తుంటాయి. అవి రాకపోవడమే బాలగోపాల్ నిబద్ధతకు తార్కాణం. తన చివరి ఉపిరి వరకు పేదల, దళితుల పక్షాన నిలిచి తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన మనిషి మరి లేకపోవడం హక్కుల ఉద్యమానికే కాదు శ్రామిక, కార్మిక ఉద్యమాలకు, విప్లవోద్యమాలకు తాడిత, పీడిత ప్రజలకు తీరని లోటు. ఇది ఇప్పట్లో భర్తీ అయ్యేది కాదు. పూర్తికాలం తనలా జీవితాన్ని అంకితం చేసిన మానవీయ కార్యకర్త, మేధావి ఉద్యమానికి దొరకడం చాలా కష్టం. తాను ప్రొఫెసర్ గానే కొనసాగి, గణితం లోనే పరిశోధనలు సాగించి ఉంటే భారత దేశానికి రంగంలో నోబెల్ తెచ్చేవార౦ట, అంతటి మేధావిని ఇంత తొందరగా కోల్పోవడం మనందరి దురదృష్టం. ఆయన రాజ్యం ఉక్కుపాదంలో దిగబడిన ముల్లు.

5, అక్టోబర్ 2009, సోమవారం

థర్మల్ తో దుర్భిక్షమే..?


కోనసీమ తరువాత కొబ్బరికి పేరుగాంచిన ఉద్దాన వనం అదృశ్యం కానుందా? ఇందుకు శ్రీకాకుళం జిల్లా, సోంపేటను ఆనుకొని వున్న బీల ప్రాంతంలో నిర్మాణం కానున్న థర్మల్ ప్లాంటు కారణం కానుందా? అవుననే అంటున్నారు అక్కడ పరిశోధనలు గావించిన మేధావులు, పర్యావరణ నిపుణులు. ఎందుచేతనంటే దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన రీసెర్చ్ కేంద్రం నేరీ (National Environment Engineering Institute) వారు 5 పవర్ ప్లాంటు ప్రాజెక్టులపై రీసెర్చి చేసి తెలిపిన వాటిలో మన రామగుండం ప్లాంటుకూడా వుంది. అక్కడ నిర్వాసితులలో సుమారు 5 కి.మీ.ల పరిధిలో ఉండే ప్రజలు అత్యధిక శాతం మంది శ్వాస కోశ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారని నిర్ధారించారు. అది 1000 మె.వా.పవర్ ప్లాంటు. ఇక్కడ నిర్మించ తలపెట్టింది 2640 మె.వా.ది. మరి ఇక్కడి పరిస్థితి ఎంత భయానకంగావుండబోతుందో ఊహించుకొని ప్రజలు భయపడుతున్నారు.

అలాగే ప్రాజెక్టు నిర్మాణవలన వందలాదిగ్రామాలు నిర్వాశితులవుతారు. పంట పొలాలు నాశనం కాబడతాయి. ఇక్కడి సాగునీటి ప్రాజెక్టు, నదీజలాలు కలుషితం కాబడతాయి. థర్మల్ వ్యర్థ పదార్థాలతో సముద్ర జలాలు కలుషితం కాబడి అపార మత్స్యసంపద నాశనం అవుతుంది. వేలాదిమత్స్యకార కుటుంబాలు రోడ్ల పాలవుతాయి. సుమారు 10 కి.మీ.ల పరిధిలో భూగర్భజలాలు పూర్తిగా కాలుష్యమయిపోతాయి. వీటికి ఉదా.గాపరవాడలోని థర్మల్ ప్రాజెక్టు చుట్టూ ఉన్న ప్రాంతాలనే ఉదహరిస్తున్నారు.

ప్రాజెక్టు నిర్మాణంనకు ప్రభుత్వం ఇప్పటికే 11 వందల ఎకరాల బీల భూమిని కంపెనీకి అమ్మేసింది. సుమారు 12 వేల కోట్ల వ్యయంతో నిర్మాణమవుతున్న ఈప్రాజెక్టు పర్యావరణ అనుమతులు లేకుండానే్ జనవరిలోపనులు ప్రారంభిస్తామని నాగార్జున కంస్ట్రక్షంస్ ప్రకటించింది. ఇటువంటి పరిశ్రమలు స్థాపించాలంటే ముందుగా ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం నిధులతో greenbelt ఏర్పాటు చేయాలి అంటే సుమారు 3 లక్షల మొక్కలు నాటి వాటిలో బతికున్నవెన్ని అవి ఏదశలో వున్నాయో నివేదించాలి. కానీ నిబంధనలన్నీ గాలికొదిలి ప్రాజెక్టును చేపడుతున్న వైనం ప్రజలను ఉద్యమ బాట పట్టిస్తోంది.

ప్రజలను అన్ని విధాలుగా నిర్వాశితులను చేసే ఈ థర్మల్ ను వ్యతిరేకించే ఉద్యమాన్ని ప్రజాస్వామికవాదులు, మీధావులు, పర్యావరణ ఉద్యమకారులు మద్దతు తెలిపి వారి జీవన పోరాటానికి చేయూతనివ్వాలని కోరుకుంటున్నా.

(ఆంధ్రజ్యోతి దినపత్రిక 05-10-2009 లోని వార్త అధారంగా)

2, అక్టోబర్ 2009, శుక్రవారం

గాంధీ - దాగిన మరో కోణం


మోహం దాస్ కరం చంద్ గాంధీ, జాతిపితగా, మహాత్మాగా మనకందరికీ తెలిసిన కోణం. కానీ అందరికీ సుపరిచితమైన ఆ ఆహార్యం వెనుక దాగిన నగ్న సత్యాలు అనేకం.

నిజానికి గాంధీ ఏనాడూ ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని తీసుకు వచ్చే ప్రయత్నం చేయలేదు, ప్రజల ఆగ్రహం పతాక స్థాయికి చేరి బ్రిటిష్ పాలకులు ఇరకాటంలో పడ్డ నాడు ఆ పోరాట రూపాన్ని వదులుకునేందుకు కూడా వెనకాడలేదు. ఇందుకు చౌరీ చౌరా సంఘటన జరిగినంతనే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేసారు. అలాగే బొంబయి రేవు కార్మికులు సమ్మెకు మధ్ధతుగా మన సైనిక దళాలు కూడా సమ్మె చేసేందుకు వెనుకాడని పరిస్థితి వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుండి భద్రంగా తప్పుకునేందుకు అర్ధరాత్రి స్వాతంత్ర్య ప్రకటన చేయించాడు. ఇలా ఈ దేశం అర్ధ వలస, అర్థ భూస్వామ్య వ్యవస్థగా మారడానికి సహకరించి సామ్రాజ్యవాదుల ఏజెంటుగా నమ్మిన బంటు పాత్రను అత్యంత నమ్మకంగా పోషించాడు.

అసలు కాంగ్ర్రెసు పార్టీ ఆవిర్భావమే బ్రిటిష్ పాలకులకు అణుగుణంగా జరిగింది. కాంగ్రెసు పార్టీ వ్యవస్థాపకుడు ఎలెం ఓక్టాలియా హ్యూం ఒక బ్రిటిష్ ఉన్నతాధికారి. పార్టీ ఆవిర్భావ పరిస్థితి నాటి (1885) భయంకర కరువు పరిస్థితులు లోలోపల రగులుకొంటూ పైన నివురుగప్పిన నిప్పులావున్న భారతీయుల అసంతృప్తి, ద్వేషమూగ్రహించిన హ్యూం అప్పటి వైస్రాయి డఫరిం దగ్గరకెళ్ళి పరిస్థితిని వివరించాడు. ఆ సూచన ఇలా వుంది:

“ భారత దేశంలో బద్దలవటానికి సిద్ధంగావున్న సాయుధ విప్లవాన్ని అడ్డగించడానికి ఒకే ఒక మార్గం వుంది. ప్రజలముందు చట్టబద్దమైన ఉద్యమాన్ని ఉంచుదాం. ఆఉద్యమంలో ప్రజలు పాల్గొని చట్టబద్దంగా తమ అసంతృప్తిని ప్రకటిస్తారు. దాన్ని బట్టి ప్రజలనాడి ప్రభుత్వానికి అర్థమవుతూ వుంటుంది. ఇలాంటి ఉద్యమాన్ని ప్రారంచించడం వల్ల బ్రిటీషు ప్రభుత్వానికి సహకరించే ఉన్నతవర్గాల భారతీయులు నాయకత్వ స్థానాన్ని అలంకరించి ప్రజల్ని విప్లవ మార్గం నుంచి తప్పించి చట్టబద్ధమైన ఉద్యమంవైపు లాగుతారు. అప్పుడు ఆ ఉద్యమం పైన బ్రిటీషు ప్రభుత్వం గట్టిపట్టును కలిగివుంటుంది.’ (యశ్ పాల్ రాసిన రామరాజ్యం – పేజీ 69).

దోపిడీవర్గాలకి దురాలోచనే కాక ఎంతటి దూరాలోచనా! జాతీయోద్యమాన్ని కాంగ్రెసు పార్టీ, గాంధీ ఇలానే నడిపించారు.

అయినప్పటికీ 1905 లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ఉవ్వెత్తునసాగటం, మధ్యతరగతి యువకులు బ్రిటీషు ముష్కరుల పైన దాడులు చేయటం జరిగింది. పత్రికలలో వ్యాసాలు రాసినదానికే బాల గంగాధర తిలక్ కు 6 సం.ల కఠిన కారాగార శిక్ష విధించిన బ్రిటీషు పాలకులకు వ్యతిరేకంగా బొంబాయి కార్మికులు హర్తాళ్ళ్, బంద్ లు నిర్వహించి రాజకీయాల్లోకార్మికులు క్రియాశీలక పాత్ర నిర్వహించే కాలం వచ్చిందనే హెచ్చరిక చేసారు. ఈ అసంతృప్తిని పక్కదారి పట్టించగల సమర్ధవంతమైన నాయకత్వం, బ్రిటీషు పాలకులకి దేశీయ భూస్వామ్య దళారీ బూర్జువాలకీ అవసరమయింది.

దక్షిణాఫ్రికాలో బ్రిటీషు పాలకులకి వ్యతిరేకంగాపోరాడిన ‘ జూలూ ‘ జాతి రైతుకూలీల పోరాటంలోనూ, బోయర్ యుధ్ధకాలంలోనూ, మొదటి ప్రపంచ యుద్ధం లోనూ బ్రిటీషువారికి తోడ్పడంలో ప్రాణాపాయ స్థితిని తెచ్చుకోడానికి కూడా వెనుకాడనిప్రభుభక్తిని గాంధీ ప్రదర్శించాడు.(భారదేశంలోని ఇంగ్లీషు వారందరికీ – గాంధీ బహిరంగ లేఖ అధారం). తమకు కావలసిన వాడు ఇతడే అని గుర్తించారు.

ఉదా: బీహార్ లోని చంపారం లో నీలిమందు రైతుల పోరాటాన్ని సంస్కరణవాద ఊబిలోకి లాగటం, రౌలత్ చట్టానికి, జలియన్వాలా బాగ్ దురంతాలకు వ్యతిరేకంగా సాగిన ప్రజల ఆందోళన హద్దులు దాటుతోందని నిలిపివేయటం జరిగింది.

సామ్రాజ్యవాదుల ఎడల భారత ప్రజల అసంత్రుప్తి తీవ్రత ఎంతలా వుందంటే ఏ కొద్దొ రాయితీలు పొందే ఉద్యమానికి పిలుపునిచ్చినా లక్షలాదిగా తరలి వచ్చే వారు. ప్రజా పోరాట జ్వాలను చల్లార్చటానికి ఆఉద్యమాన్ని అడ్డుకట్ట వేయడానికి గాంధీ ‘ శాంతి ‘ మంత్రం జపించి వారి పునాదులను కాపాడే వాడు. అందుకే వారికి మహాత్ముడయ్యాడు.

1931 లో గాంధీ స్వభావాన్నిగూర్చి స్టాలిన్ చెప్పిన మాటలు “ భారతదేశం, ఇండోచైనా, ఇండోనేషియా, ఆఫ్రికాఖండంలోని దేశాల్లోని విప్లవ పోరాటాలని కసాయి బూర్జువా పరిపాలకులు రక్తపుటేరుల్లోముంచారు. కౄరమైన హింసావిధానం ద్వారా అక్కడి ఉద్యమాల్ని అణచడానికి ప్రయత్నించారు. వాళ్ళ ప్రయత్నాలు రెండు రకాలుగా జరిగాయి. ఒకటి – తుపాకీ ద్వారా విప్లవోద్యమాన్ని అణచడము , రెండవది – గాంధీ లాంటి వ్యక్తి ద్వారా విప్లవోద్యమాన్ని పక్కదారి పట్టించడమూ!”

అలాగే వైస్రాయి ఇర్విన్ రైలు పేలిపోయే విధంగా విప్లవకారులు బాంబులు పెడితే అవి పేలినా వైస్రాయి క్షేమంగా బయటపడ్డందుకు చాలా సంతోషించాడు. ఈచర్యను ఖండిస్తూ కాగ్రెసు సభలలో తక్కువ మెజారిటీతో తీర్మానాలు చేయించుకుని ప్రభుభక్తిని చాటుకున్నడు.. విప్లవ కారులను నిందిస్తూ ‘ కల్ట్ ఆఫ్ ది బాంబ్ “ అనేవ్యాసం రాసాడు. దీనికి జావాబుగా వారు ‘ ఫిలాసఫీ ఆఫ్ బాంబ్ “ రాసి అందులో గాంధీ స్వభావాన్ని ఇలా పేర్కొన్నారు:

“ కాంగ్రెసు ప్రజలలోస్వాతంత్ర్య ఇచ్చను కలిగించిందని మేమూ ఒప్పుకుంటాం. అయితే అంతటితో కాంగ్రెసు బాధ్యత తీరిపోలేదు. దేశానికి కాంగ్రెసు చేయవలసినది ఎంతో వుంది. కానీ ఆసంస్థ మీద దళారీరాజకీయాలను అభిమానించే నాయకుల ప్రాబల్యం ఎక్కువైంది. కాంగ్రెసు చెప్పే అహింస విదేశీ పాలకులతో రాజీ బేరాలకు దిగడానికి ఒక సాకుగా తయారయ్యింది.”

గాంధీ-నెహ్రూల నాయకత్వం భగత్ సింగు తదితరుల ఉరిశిక్ష రద్దుకు సీరియస్ గా ప్రయత్నించనిది దళారీ రాజకీయాల కారణంగానే. కరాచీలో నెహ్రూ అధ్యక్షతన జరగనున్న కాంగ్రెసు సమావే్సానికి (మార్చి 25 1931 న) ఏ అడ్డంకీ రాకుండా వుండేందుకు భగత్ సింగు, రాజగురు, సుఖదేవ్ ల ఉరిని 23 రాత్రి 7.30 ని.లకి ( చట్టానికి వ్యతిరేకంగా రాత్రి ఉరితీయరాదు) అమలుచేయించాడు.

ఈదేశప్రజలలో మత మౌఢ్యాన్ని పెంచడానికి తాను అనుసరించిన సనాతన ధర్మం, మత మార్పిడుల పట్ల వ్యతిరేకత తోడ్పడ్డాయి.

హి వాజ్ ఏక్టెడ్ ఏజ్ ఏన్ ఇన్విజిబిల్ ప్రొటెక్టర్ టు ది బ్రిటిష్ రాజ్ ఎండ్ ఇండియన్ బూర్జువాజీ.

(ఈ వ్యాసం రాయడానికి ‘ నా నెత్తురు వృధాకాదు ‘ పుస్తకంలోని వ్యాసాలను ఆధారం చేసుకున్నాను.)