20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

కా. చాయారాజ్ అమర్ రహే


విప్లవ కవి సిక్కోలు గొంతు జనసాహితీ వ్యవస్థాపక సభ్యుడు కామ్రేడ్ చాయారాజ్ ఈ రోజు ఉదయం 8.30 గం.ల ప్రాంతంలో శ్రీకాకుళంలో తుదిశ్వాస విడిచారు. ఆయన రచనలు శ్రీకాకుళం (ఉద్యమ కథా కావ్యం), గుమ్మ (కొండ కావ్యం), దర్శని (కావ్యం), నిరీక్షణ (దీర్ఘ కవిత), మట్టి నన్ను మవునంగా ఉండనీయదు (కవితా సంపుటి) బుదడు (కావ్యం). మొన్న 18న ఆయన రచన 'కారువాకి' (నవల) శ్రీకాకుళంలో ఆవిష్కరించారు. ఇవన్నీ ఆయన ఉద్యమాలలో తనను తాను ఆవిష్కరించుకునే క్రమంలో రాసిన కవిత్వం.

బుదడు కావ్యంలో చివరిగా చాయారాజ్ గారన్నట్టు " కవీ! మృత్యువు నీకు బంధువు, నీ కోర్కె ప్రకారం నిన్ను విశ్వ సౌందర్యంలోనికి ఒంపేస్తుంది. ఉషస్సులలో, సంజలలో, ఎండ్లల్లో వెన్నెల్లో ఇంకిపోతావు. అనంతమైపోతావు. ఎందుకూ మిగలవు. ఎవరికీ తగలవు. " మృత్యువు అతనికి ప్రియురాలు. అతడ్ని ధ్వంసం చేస్తుంది. మళ్ళీ మళ్ళీ పునర్ నిర్మిస్తుంది. ఒక అసంతూప్రి స్థితిని సంతృప్తపరిచేందుకు - ప్రేరణ ప్రతీకార చర్యలే జనన మరణ నిజాలు".

నిజమే. చాయారాజ్ మాస్టారుని మృత్యువు కేన్సర్ రూపంలో తనను కబళించినా మనందరిలో తన స్ఫూర్తిని మిగిల్చిన కావ్యాలాపన ద్వారా మనల్ని పునర్నిర్మించే మరో కార్యసంబంధమైన పనిలోకి ఈ మట్టిలోలోపలికి ఇంకిపోతూ ఇగిరిపోతూ అమరులయ్యారు.

జోహార్ కా.చాయారాజ్ జోహార్
మీ ఆశయాలను కొనసాగిస్తాం..