27, ఏప్రిల్ 2012, శుక్రవారం

తప్పనిసరైన కిడ్నాపులు - రాజ్య స్వభావం..



మల్కనగిరి జిల్లా కలెక్టర్ వినీల్ క్రిష్ణ కిడ్నాప్ నుండి నిన్నటి ఇటాలియన్ యాత్రికులు, కొరాపుట్ గిరిజన ఎం.ఎల్.ఏ హికాక తోపాటు చత్తీస్ ఘడ్ సుక్మా జిల్లా కలెక్టర్ పాల్ కిడ్నాప్ వరకు వరుసగా జరుగుతున్న వాటి గురించి ప్రజలను చాలా అపోహలకు గురిచేస్తోంది రాజ్యం. 

ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో ఆదివాసీ ప్రజలపైనా వారు నివసిస్తున్న ఆదివాసీ ప్రాంతంపైన రాజ్యం పూర్తి స్థాయి సైనిక దాడికి పూనుకొన్న క్రమంలో దూకుడుగా వస్తున్న యుద్ధాన్ని కొంతవరకు నియంత్రించే వ్యూహంలో భాగంగాను, అనేక ఏళ్ళుగా కనీసం ఒక్కమారైనా కోర్టులకు తీసుకురాబడకుండా ఏ నేరమూ చేయని ఆదివాసులను మావోయిస్ట్ సానుభూతిపరుల పేరుతో వందలాది మందిని జైళ్ళలో కుక్కుతూ వారికి న్యాయ సహాయం అందకుండా చేస్తున్న రాజ్య వికృత రూపాన్ని బట్ట బయలు చేసేందుకు ఇదో ప్రతిఘటనా రూపంగా విప్లవ పార్టీ ఎంచుకున్న మార్గం. 

రాజ్యం అబూజ్ మఢ్ ప్రాంతంలోని వనరులను కొల్లగొట్టి విదేశీ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు అనువుగా ఆ ప్రాంతంపై దాడి చేయడానికి అత్యంత కౄరులుగా తమ కెరీర్ లో పేరు పొందిన పోలీసు సైనికాధికారులను అక్కడ నియమిస్తూ దేశ సరిహద్దులలో కావలి కాయాల్సిన సైనికులను తమ సొంత గడ్డపై తమ ప్రజలపైకి ఉసిగొల్పుతూ ఆపరేషన్ విజయ్ పేరుతో పెద్ద ఎత్తున వేసవిదాడులు చేయడానికి పూనుకొంది. ఇదే సందర్భంలో అమెరికన్ అపవిత్ర కలయికకు పుట్టిన దేశం ఇజ్రాయిల్ వారి వద్ద నుండి అత్యంతాధునిక ఆయుధాలను కొనుగోలు చేస్తూ మానవ రహిత విమానాల ద్వారా ఆదివాసీ ప్రాంతాలపై నిఘాత పాటు దాడులకు పూనుకుంటున్నది రాజ్యం.  అలాగే ఆదివాసీ ప్రజలను ఉద్యోగాల పేరుతోను వారి వేలితో వారి కన్నే పొడుచుకునే విధంగా సల్వాజుడుం లాంటి పారా సైనిక బలగాలను తయారు చేస్తూ ఉసికొల్పుతోంది. 

వారి హక్కుల పట్ల మాటాడినా కనీసం ఆలోచించినా సోనీ సొరీ లాంటి ఆదివాసీ టీచర్లను అత్యంత పాశవికంగా చిత్రహింసలకు గురి చేస్తూ వారిని నేరస్తులుగా పరిగణీస్తూ కోర్టుల చుట్టూ తిప్పుతూ జైళ్ళలో వేస్తోంద. ఇలా రాజ్యం బహుముఖంగా తన దాడిని విస్తరిస్తూ ఉద్యమం మనుగడను ప్రశ్నార్థకంగా మార్చ జూసే క్రమంలో కిడ్నాప్ ఎత్తుగడ మొదలైంది. 

ఒడిసా సర్కారు ఇటాలియన్ టూరిస్టులుగా చెప్పుకొని ఆదివాసీల అర్థ నగ్న చిత్రాలనుతీసి సొమ్ము చేసుకోజూస్తున్న వారిని అడ్డుకునే క్రమంలో వారిని కిడ్నాప్ చేసి తమ డిమాండ్లను పెడితే తెలివిగా కొన్నిఆమోదించినట్లు నటిస్తూ వారి విడుదలకు కేంద్రంనుండి అంతర్జాతీయ వత్తిడి కారణంగా చొరవ చూపింది. అదే గిరిజన ఎం.ఎల్,ఏ.కిడ్నాపయి నెలరోజులకు పైగా బందీగా వున్నా కనీసం పట్టించుకోకుండా ఆయనకు ఏమీ చేయరన్న ధీమాతో స్పందించలేదు. సదరు ఎం.ఎల్,ఏ.కు తన వర్గం పట్ల రాజ్యానికి వున్న సవతి తల్లి ప్రేమ బహిర్గతం కావడంతో ఇంక తనకు తాను తన పదవికి, బూర్జువా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించాడు. 

ఇందులో మీడియా వారు కూడా తమ పాత్ర తాము చాలా నాటకీయంగా ప్రదర్శిస్తున్నారు. కలెక్టరు కిడ్నాప్ జరిగిన మరుసటి రోజే ఆయన ఇలా చదివాడు, ఇలా పెరిగాడు అంటూ వాళ్ళ కుటుంబ సభ్యుల రోదనలు, వేదనలు పేపర్లలోను టీవీలలోను ప్రచారం చేస్తారు. అదే ఓ ఆదివాసీని మావోయిస్ట్ పార్టీ సభ్యుడిగా నేరంమోపి అరెస్ట్ చేస్తేనో, ఎన్ కౌంటర్ చేస్తేనో అది వార్తకాదు. ఈ ద్వంద్వనీతీ వీరి వర్గ స్వభావాన్ని తెలియజేస్తుంది. 

కావున ఇలా కిడ్నాపులను వ్యతిరేకిస్తున్న మేధావి వర్గం అదే స్థాయిలో ఆదివాసీ ప్రజలపైన వారి భూభాగంపైనా రాజ్యం చేస్తున్న పాశవిక దాడిని ఖండించేలా గొంతు కలపాలని, నిజంగా ఈ దేశం పట్ల ప్రజాస్వామ్యం పట్ల ఆలోచించే వారే ఐతే మన సార్వభౌమత్వాన్ని సామ్రాజ్యవాద దేశాలకు తాకట్టు పెడుతున్న కార్పొరేట్ దళారీ బూర్జువా పాలకుల ఎత్తుగడలను ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్య ఉద్యమాలను నిర్మించేందుకు బలపరచడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నా.