25, నవంబర్ 2013, సోమవారం

తల తెగిపడినా ఈ నేల నాదే...



మధ్య తరగతి బుద్ధిజీవులకు ఈ దేశ ప్రజాస్వామ్యంపై ఈ పింజారీ వ్యవస్థపై నమ్మకాన్ని సడలకుండా పోరాడే తత్వాన్ని దూరం చేసేందుకు విదేశీ స్వదేశీ పెట్టుబడిదారుల తొత్తులు అయిన NGO's, కొన్ని మీడియా సంస్థలు (తెహెల్కా వంటివి) చాలా కృషి చేస్తున్నాయి అని అర్థమవుతోంది కదా! వీళ్ళ వెనక దోపిడీదారుల సొమ్ము పెట్టుబడిగా థింక్ వెస్టివల్స్, మరికొన్ని సాహిత్య సేవలు (రాంకీ వంటివి) పేరిట ఆలోచనలను కుళ్ళబెట్టే పండగలు జరిపి దేశానికి ఉద్దరించేస్తున్నామని డబ్బాలు కొడుతుంటాయి. వీళ్ళ అసలు రంగు ఇలా బయటపడుతుంది అప్పుడప్పుడు. ఈ గ్రీకు వీరుల రంకు చేష్టలు, మహిళలపై దాడులు హీరోలుగా ప్రచారానికీ ఉపయోగపడుతుంటాయి.
మధ్య భారతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యాపారానికి తీవ్ర స్థాయిలో ఎదురవుతున్న స్థానిక గిరిజన ప్రజానీకంపై జరుగుతున్న అమానుష అత్యాచార దాడులను ఒక్క మీడియా కూడా ప్రచారంలోకి తేవడంలేదు. అటు సైన్యం చేతిలో, ప్రైవేటు సైన్యం చేతులలో హత్యలకు, మానభంగాలకు గురవుతున్న నియాంగిరీ ప్రాంత ఆదివాసీ ప్రజానీకం తమపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రతిఘటన ర్యాలీలు చిన్న స్థానిక నియోజక వర్గం కాలంలలో ప్రచురించే మీడియా సో కాల్డ్ ఫేజ్ త్రీ షోకిల్లా రాయులకు ఇంత పబ్లిసిటీ ఇస్తుంది. 

ఆదివాసీలను మనుషులుగా గుర్తించని వీరు మనుషులేనా??
ఈ దేశ ఖనిజ సంపదను, నేలపై హక్కును కాపాడి తద్వారా ఈ దేశ సార్వభౌమత్వాన్ని సమున్నతంగా నిలిపే ఆ మూలవాసులు చేసే పోరాటానికి కాసింత బాసటగా నిలుద్దాం. తద్వారా మన కాళ్ళ కింది నేలను కాపాడుకుందాం.

29, అక్టోబర్ 2013, మంగళవారం

'వామపక్షం - నూతన ప్రపంచం' - మార్త హర్నేకర్ ( Marta Harnecker)


మార్త హర్నెకర్ ఒక సామాజికవేత్త, రాజకీయ శాస్త్రవేత్త. పత్రికా రచయిత్రి, ఉద్యమకారిణి. 1960వ దశకం చివరిలో ఆమె రచించిన ' The Basic Concept of Historical Materialism ' అనే పుస్తకం ప్రచురించిన తర్వాత లాటిన్ అమెరికాలోని మార్క్సిస్టు వామపక్షం ఆమె రచనలను అత్యంత విస్తృతంగా చదవటం మొదలయింది. బొలివేరియన్ విప్లవాన్ని (సైమన్ బొలివర్ అనే వెనిజులా తత్వవేత్త ఆలోచనలతో, ఉత్తేజంతో ముందుకు వచ్చిన విప్లవ సిద్దాంతం) బలంగా సమర్థించుతూ మార్తా హర్నేకర్ అనేక రచనలు చేసారు. ఈ పుస్తకం 'Re building of the Left' అనే పుస్తకానికి అనువాదం తెలుగులో ఆశాలత గారు చేసారు. సంగం మీడియా గ్రూపు వారి ప్రచురణ. మిత్రులు Rajendra Prasad Yalavarthy గారు నాకు ఈ పుస్తకాన్ని పరిచయం చేసారు. వారికి ధన్యవాదాలు. మార్క్సిజం పై ఓ కొత్త ఆలోచనా ధారను మనకందించే ఈ పుస్తకం పూర్తయ్యాక మళ్ళీ మాటాడుకుందాం. మీరూ చదవండి. విశాలాంధ్ర, ప్రజాశక్తిలలో దొరుకుతుంది.

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

కా. చాయారాజ్ అమర్ రహే


విప్లవ కవి సిక్కోలు గొంతు జనసాహితీ వ్యవస్థాపక సభ్యుడు కామ్రేడ్ చాయారాజ్ ఈ రోజు ఉదయం 8.30 గం.ల ప్రాంతంలో శ్రీకాకుళంలో తుదిశ్వాస విడిచారు. ఆయన రచనలు శ్రీకాకుళం (ఉద్యమ కథా కావ్యం), గుమ్మ (కొండ కావ్యం), దర్శని (కావ్యం), నిరీక్షణ (దీర్ఘ కవిత), మట్టి నన్ను మవునంగా ఉండనీయదు (కవితా సంపుటి) బుదడు (కావ్యం). మొన్న 18న ఆయన రచన 'కారువాకి' (నవల) శ్రీకాకుళంలో ఆవిష్కరించారు. ఇవన్నీ ఆయన ఉద్యమాలలో తనను తాను ఆవిష్కరించుకునే క్రమంలో రాసిన కవిత్వం.

బుదడు కావ్యంలో చివరిగా చాయారాజ్ గారన్నట్టు " కవీ! మృత్యువు నీకు బంధువు, నీ కోర్కె ప్రకారం నిన్ను విశ్వ సౌందర్యంలోనికి ఒంపేస్తుంది. ఉషస్సులలో, సంజలలో, ఎండ్లల్లో వెన్నెల్లో ఇంకిపోతావు. అనంతమైపోతావు. ఎందుకూ మిగలవు. ఎవరికీ తగలవు. " మృత్యువు అతనికి ప్రియురాలు. అతడ్ని ధ్వంసం చేస్తుంది. మళ్ళీ మళ్ళీ పునర్ నిర్మిస్తుంది. ఒక అసంతూప్రి స్థితిని సంతృప్తపరిచేందుకు - ప్రేరణ ప్రతీకార చర్యలే జనన మరణ నిజాలు".

నిజమే. చాయారాజ్ మాస్టారుని మృత్యువు కేన్సర్ రూపంలో తనను కబళించినా మనందరిలో తన స్ఫూర్తిని మిగిల్చిన కావ్యాలాపన ద్వారా మనల్ని పునర్నిర్మించే మరో కార్యసంబంధమైన పనిలోకి ఈ మట్టిలోలోపలికి ఇంకిపోతూ ఇగిరిపోతూ అమరులయ్యారు.

జోహార్ కా.చాయారాజ్ జోహార్
మీ ఆశయాలను కొనసాగిస్తాం..

9, ఆగస్టు 2013, శుక్రవారం

ఆగస్ట్ - 9...


ఆగస్ట్ 9.. గత పదిహేనేళ్ళుగా అంటే 1998 నుండి నన్ను వెంటాడే రోజు.. గుండెనంతా దు:ఖం పట్టి జ్ఞాపకాలన్నీ తెరలు తెరలుగా కనుల ముందు కదలాడే రోజు. ఒడిసా రాష్ట్రంలోని కోపర్ డంగ్ అటవీ ప్రాంతంలోకి ఆంధ్రా గ్రే హౌండ్స్ ప్రవేశించి తెల్లవారుఝామున గ్రామాన్నంతా చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఆదివాసీ చిన్నారులను, వారి పశు సంపదను కూడా గురి చూసి కాల్చి బీభత్సంగా ఆధునిక ఆయుధాలతోను గ్రైనేడ్స్ తోను దాడి చేసి 13 మంది అప్పటి పీపుల్స్ వార్ పార్టీ కళీంగాంధ్ర నాయకత్వాన్ని హత్య చేసారు. దేశంలోనే మొట్ట మొదటి సారిగా హెలికాప్టర్లనుండి వెతికి కాల్పులు జరిపిన సంఘటన ఇదే. ఒక పోలీసు స్టేషన్ పరిధి దాటి కేసు నమోదు చేయని శాఖ ఇలా వేరొక రాష్ట్ర భూభాగంలోకి చొరబడి కాల్పులు జరిపి హత్య చేయడం న్యాయస్థానంలో ప్రశ్నించినా జవాబు రాలేదు. ఇదీ ఈ రాజ్యంలోని నాలుగు కాళ్ళ న్యాయం. సరిహద్దులు చెరిపేసిన ఎదురుకాల్పులుగా కోపర్ డంగ్ మొదలయింది. 

ఏ ఆదివాసీ ప్రజల స్వేచ్చా స్వాతంత్ర్యాలతో ఈ దేశ విముక్తి ముడిపడి వుందో వారిని ప్రలోభ పెట్టే ఆదివాసీ మేళాలను వ్యతిరేకిద్దాం. 

ఆదివాసీ పోరాటాలకు సంఘీభావం తెలియజేద్దాం. 

అమర వీరుల ఆశయాలను కొనసాగిద్దాం. 

5, జులై 2013, శుక్రవారం

ప్రసాదం గారూ...

ప్రసాదం గారూ...

మీరలా చేతులూపుతూ మాటాడుతూ
ఒక్కొక్కరినీ వేయి మందిని చేస్తూ
ఒక్కో అడుగూ వేల అడుగులుగా
రూపాంతరం చెందుతూ
ఒక్కో నినాదమూ మీ గొంతు నుండి తూటాగా మారి
వాడి గుండెల్లో దూసుకుపోతూంటే
వాడికొక్కటే దడ
వాడి పీఠానికున్నా నాలుగు కోళ్ళూ ఊడి
అధికార బెలూన్ పగిలి పోతుందేమోనని...

ప్రసాదం గారూ అని అంతా ఆత్మీయతతో కూడిన గౌరవంగా పిలుస్తూ
మీతో కలిసి నడిచి మీ పిడికిలిలో పిడికిలౌతున్నారని వాడికొకటే బెంగ
అందుకే వాడు మళ్ళీ అపరిచితంగా వాడి ముఖాన్ని జనానికి చూపలేక
మీ మెడపై కత్తై గుండెల్లో బుల్లెట్లు దించాడు...

అయినా వాడు చంపగలిగింది ప్రసాదాన్నే
కానీ ప్రసాదం గారి ఆశయాన్ని కాదు కదా..

నాకు దుఃఖంతో పాటూ నవ్వు వస్తోంది
వాడి పిరికితనాన్ని చూసి...

కోపమూ వస్తోంది
వాడి కౄరత్వాన్ని చూసి...

మరో మారు ఋజువయ్యింది
వాడు ఉత్తి కాగితపు పులేనని...

ప్రసాదం గారూ మీరు అమరులు
ప్రజలు అజేయులు...

(జోహార్ కా. గంటి ప్రసాదం)

29, జూన్ 2013, శనివారం

నల్ల సూరీడు..




















 నువ్వలానే గుర్తు నాకు
చూపులలో విస్ఫులింగాలను ప్రతిఫలిస్తూ
పిడికిలెత్తి పోరాట పతాకాన్నెత్తి పట్టినట్టు...

చీకటి ఖండంలో వెలుగులు నింపే
నీ యుద్ధ దరహాసం మెరుస్తున్నట్టు...

ఎందుకో
మరల మరల
అదే మాట మండే సూరీడు మండేలా
అంటూ గుండెల్లో పోటెత్తావు...

కానీ

పాతికేళ్ళు చీకటి కొట్లో దాచిన
వాడి జాత్యహంకారం నీకో శాంతి బహుమతినిచ్చినప్పుడు
చాచిన నీ చేతులు అంటే కోపమొచ్చింది...

నిన్నో స్టాంపును జేసి ఉమ్మినంటించే
వాడి కుట్రను నవ్వుతూ స్వీకరించావని
కోపమొచ్చింది...

అయినా
ఎప్పటికీ నల్ల సూరీడంటే
గుర్తుకొచ్చేది నువ్వే నువ్వే...

(మండేలాకు ప్రేమతో)


9, జూన్ 2013, ఆదివారం

బాకీ...

చప్పుడు కాని అడుగులో అడుగుతో
కాలాన్ని బంధించి ఊపిరాగిన
నిశ్శబ్ధంలోంచి రెప్పవేయని సమయాన్ని
ట్రిగ్గర్ పై చూపుడు వేలు బిగిస్తూ...

ఎండ పట్టిన ఆకాశపు బూడిద వర్ణంలోంచి
మట్టిని పూస్తూ ఆకు తొడిమలన్నీ
ఊదారంగులోకి మారుతూ నిప్పు కణికలోకి
ఊపిరిని ఎగదోస్తూ...

బిగిసిన వేలి లోంచి దూసుకు పోయిన
గురి పొలో పొలో నెత్తుటి పొలో మని
బిగ్గరగా సమూహమౌతూ నిన్నటి
బాకీని తీరుస్తూ....

రాతిరింత
నెత్తుటి వాన కురుస్తూ
పసరిక వాసనేస్తూ నెలవంక అంచునంటిన
ఎరుపు జీర జెండా అంచున మెరుస్తూ...

హొళీ హోళీ హొళొలి రంగా హోళీ
సమ్మకేళీల హోళీ అంటూ
ధింసా ఆడుతూ పాదాలన్నీ
కలసి ఒకే అడుగు వేస్తూ...


(తే 6-6-2013 దీ)

28, మే 2013, మంగళవారం

తప్పనిసరైన ప్రతి హింస..

మొన్న చత్తీస్ ఘడ్ లో మహేంద్ర కర్మతో పాటు కాంగ్రెస్ నాయకులపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ అధినాయకత్వం ఈ దేశానికి తామే రక్షకులుగా బీరాలుపోతూ యువరాజునుండి గల్లీ లీడర్ల వరకు ప్రకటనలు జారీ చేస్తున్నారు. అసలు ప్రజాస్వామ్యం గురించి మాటాడే అర్హత వీరికుందా? 

అత్యంత కౄరంగా ఆదివాసీలపై బస్తర్ ప్రాంతంలో దాడులు కొనసాగించి తమ రాచరికానికి, భూస్వామ్య హక్కులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అత్యంత వెనుకబడిన ఆదివాసీ తెగలపై ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రైవేటు సైన్యంగా సల్వాజుడుం పేరుతో గూండాలను కౄరులను తయారు చేసి ఆదివాసీ గూడేలను ఖాళీ చేయించి కాన్సంట్రేషన్ కాంపులలో వేసి వేయికి పైగా గ్రామాలను ఖాళీ చేసి మూడు లక్షలమందికి పైగా ఆదివాసీలను నిర్వాసితులను చేసి ఆదివాసీ మహిళలను దారుణంగా అత్యాచారం చేయించి, వృద్ధులను పిల్లలను వందలాదిమందిని హత్య చేయించి, తాము స్వయంగా నిర్మించుకున్న పాఠశాలలను వైద్యశాలలను కాల్పించి ఇళ్ళను తగులబెట్టించిన మహేంద్ర కర్మను అటు కేంద్రంలోని కాంగ్రెస్ , రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వాలు ప్రోత్సహించి సాయుధ మూకలతో భీభత్సాన్ని సృష్టిస్తే హక్కుల సంఘాలు, ప్రజాస్వామ్య మేధావి వర్గాలు అనేక విన్నపాలు, పోరాటాలు, చివరికి సుప్రీం కోర్టును ఆశ్రయించి ప్రైవేటు సైన్యం చేస్తున్న దారుణాలను న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్ళగా వారి ఆదేశాలకు తాత్సారం చేస్తూ చివరికి ఈ గూండా సైన్యాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి తిరిగి వారినందరిని SPO లుగా లైసెన్సులిచ్చింది ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజలకు వ్యతిరేకంగ ఇంత పెద్ద ఎత్తున దాడులు చేయించిన మహేంద్రకర్మను చివరికి ఆదివాసీ ప్రజాసైన్యం హతమార్చింది. ఇలా ప్రజా పోరాటాలకు వ్యతిరేకంగా ప్రైవేటు లంపెన్ సైన్యాన్ని తయారు చేసి ఉసిగొల్పడం ఇజ్రాయిల్ నుండి నేర్చుకుందీ ప్రజాస్వామ్య ప్రభుత్వం. 

ఉన్నత న్యాయస్థానం సొంత రిపబ్లిక్ లోని ప్రజలపైకి సైన్యాన్ని తరలించడాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యానించినా ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో పారామిలటరీ బలగాలను కోబ్రాలుగా తయారు చేసి జనంపైకి లక్షల సైన్యాన్ని తరలిస్తూ అత్యంత విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు, MNC లకు అప్పనంగా దొబ్బబెట్టి తాము విలాసవంతమైన జీవితాలను మరో ఏడు తరాలుదాకా జీవించేందుకు లక్షల కోట్లరూపాయలు దాచిపెట్టుకునే  రాజకీయ రాబందులను కాపాడే ప్రభుత్వ నాయకత్వంది ప్రజాస్వామ్యమా? వీళ్ళ అల్లుళ్ళు, పిల్లలు, బందుగణమంతా అవినీతి అరాచకాలకు పాల్పడుతూంటే వారిని వెనకేసుకు వస్తూ నిస్సిగ్గుగా పాలన చేసే ఈ నాయకులు ప్రజాస్వామ్యం గురించి మాటాడే అర్హతుందా??

మధ్య భారతదేశాన్ని దోచుకుపోవడమే ప్రధాన ఎజెండాగా పరిపాలన సాగిస్తూ తమ సైన్యాన్ని అత్యంత కౄరంగా వాడుకుంటూ తమ ఉనికి ప్రశ్నార్థకమౌతున్నందుకు పోరుబాటకు సమాయత్తమయ్యే ఆదివాసీ ప్రజలను ఊచ కోత కోస్తున్నప్పుడు వీళ్ళకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా?? 

మధ్యతరగతి బుద్ధిజీవులకు హింసకు ప్రతిహింసకు తేడా తెలీకుండా చేస్తూ కార్పొరేట్ అగ్రకుల మీడియా వార్తా ప్రసారాలతో దోపిడీ పాలకవర్గాలకు వత్తాసు పలుకుతోంది. వీళ్ళకూ ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది..

ప్రజా పోరాటాలు వర్థిల్లాలి...

12, ఏప్రిల్ 2013, శుక్రవారం

జోహార్ కొండపల్లి సీతారామయ్య..


యుక్త వయసులో ఈ పేరు వింటే ఆ ముఖమెప్పుడూ చూడకపోయినా ఒక ఉద్వేగం కలిగేది. పీపుల్స్ వార్ పార్టీ పేరు రేడియోలో వినని రోజంటూ వుండేది కాదు. ఆంద్రప్రదేశ్ నుండి ఉత్తర భారతం వైపు ప్రజా ఉద్యమాన్ని అడుగులు వేయించిన మహా యోధుడు ప్రజా యుద్ధ వీరుడు. అంతిమ దశలో అనారోగ్య కారణాల వలన యుద్ధభూమినుండి మరలి వచ్చినా ఆయన ఆచరణ సైద్ధాంతిక దృక్పధం ఆలోచనా ధార భారత ప్రజాతంత్ర విప్లవ కార్యాచరణకు ఆయుధాలే. 


ఈ రోజు ఆయన 11వ వర్థంతి
జోహార్ కొండపల్లి సీతారామయ్య..


13, ఫిబ్రవరి 2013, బుధవారం

రాజ్యం - హిందూ కార్పొరేట్ ఫాసిస్ట్ ముఖం..

వరుస ఉరి శిక్షల అమలుతో రాజ్యం తామింత కాలం దాచుకున్న లౌకిక ప్రజాతంత్ర ముసుగును తొలగిస్తోంది. ఓట్ల కోసం ఎంతకైనా తెగించే ధోరణితో ముందుకు దూసుకు వస్తోంది. తన విదేశీ ముఖాన్ని కప్పిపుచ్చుకోవడానికి కుంభమేళాకు హాజరయ్యేందుకు సిద్దపడుతూంది. ఈ దేశాన్ని ఒక వైపు సామ్రాజ్యవాద అనుకూల శక్తులకు ధారపోస్తూ విదేశీ వ్యాపార సంస్థలకు పూర్తిగా తాకట్టుపెడుతూ మరోవైపు సనాతన హిందూ వేషాన్ని ముసుగుగా చూపిస్తూ తిరిగి అధికారాన్ని చేపట్టాలని చూస్తోంది. ప్రతిపక్షానికి ఏ అవకాశాన్నీ వదలకుండా ఓట్లు దండుకునేందుకు దూకుడుగా వస్తోంది. ఇంతకాలం మైనారిటీ అనుకూల వాదిగా వున్న ముద్ర తొలగిపోయినా తనకెదురులేదన్న దిశగా కదులుతోంది. 

ఒకవైపు మూడోసారి స్వరాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన హిందూ ఫాసిస్ట్ తానే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకుంటూ వస్తున్న తరుణాన దానిని ఎదుర్కొనేందుకు తద్వార తన యువరాజుకు పట్టం కట్టేందుకే ఈ హత్యాకాండ సాగిస్తోంది. అధికార దాహానికిది పరాకాష్ట. ప్రజలకు వేరే ఆప్షన్ లేకుండా చూసే ప్రయత్నంలో భాగంగానే ఇంత నీచంగా కనీస ప్రజాస్వమ్య రాజనీతిని న్యాయ పరమైన సూత్రాలను కూడా లెక్క చేయకుండా ఉగ్రవాద ముద్రతో ప్రజల నోరు నొక్కుతూ వరుస హత్యలకు పాల్పడుతోంది. దీనిని ఏదో తమ విజయంగా అమాయకంగా సంబరాలు చేసుకుంటే ప్రజలకు తమ నట్టింట్లోకి ఈ గోముఖ వ్యాఘ్రాలు ప్రవేశించి తమ కాళ్ళకింద నేలను,  ప్రాణాలను హరిస్తాయన్న ఎరుక కోల్పోకూడదు. 

ప్రజాస్వామ్య ముసుగుతో నేరుగా సైనిక పాలనే సాగుతున్నది. ముమ్మాటికీ నిజం. ఇది పోలీసు రాజ్యం.  ఒకవైపు మధ్య భారతదేశమంతా సైనిక కవాతు చేస్తూ ఆదివాసీ ప్రజలను అత్యంత కౄరంగా 
హింసిస్తూవారి తరతరాల హక్కులను స్వేచ్చా స్వాతంత్ర్యాలను హరిస్తూ ఖాళీ చేయిస్తూ సహజ వనరులను 
కొల్లగొట్టడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తోంది.  

ప్రశ్నించే వేదిక ఏదైనా అది ఆఖరికి అంతర్జాలమైనా వారి గొంతునొక్కే కఠిన నిర్ణయాలు పాలకులు తీసుకుంటున్నారంటే ఇంక ప్రజలకు ఏ అవకాశముంది??  కావున దీనిని అతి జాగరూకతతో నివారించి మన హక్కులను కాపాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం ద్వారా ఈ దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం మనందరిదీ.