26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

అలిపిరి తీర్పు బాబుకు దసరా కానుకా?


అలిపిరి దాడి కేసులో నిందితులపై సాక్ష్యాధారాలు లేవని సిట్ అధికారి చెప్పినా తిరుపతి సెషన్స్ జడ్జి వాటిని పట్టించుకోకుండా నిందితుల వాంగ్మూలాలను నామమాత్రంగా విని శిక్ష వేయడం ఈ తీర్పు రాజకీయ తీర్పుగానే పరిగణించాల్సి వస్తుంది. దర్యాప్తు అధికారి యిచ్చిన సాక్ష్యాన్ని కూడా వినని కోర్టులుగా రాజకీయ నాయకుల మాటే తీర్పుగా వెలువరించడం ఇటీవల సాధారణమవుతోంది. ఈ దేశంలో కాసింత మిగిలిన ఆశ కూడా ఇలా డబ్బు పాలు కావడం అధికారానికి దాసోహమవడం దారుణ పరిణామం. ఈ తీర్పు వెలువరించిన సమయం కూడా నాటి బాబు పర్యటనకు దగ్గరైన కాలం ఒకటే కావడం యాధృచ్చికం కాదని తెలుస్తోంది. రిటైరయ్యాక అధికార పార్టీలు ఇచ్చే పదవులు ఇటీవల కేరళ గవర్నర్ గా నియమితుడైన న్యాయాధీశులుంగారిని చూస్తే మనకు వీరి పట్ల గౌరవముండాల్సిన పనిలేదని అవగతమవుతోంది. 'న్యాయదేవత'??? కళ్ళే కాదు చెవి ముక్కూ నోరు కూడా కుట్టేస్తున్నారా? ప్రజాస్వామిక వాదులంతా మాటాడాల్సిన సమయమిది.

21, సెప్టెంబర్ 2014, ఆదివారం

సెప్టెంబర్ 21

సెప్టెంబర్ 21 భారత విప్లవోద్యమ చరిత్రలో ఓ ముఖ్య ఘట్టానికి నాంది పలికిన రోజు. కమ్యూనిస్ట్ పార్టీల ఐక్య సంఘటన కోసం పరితపించే విప్లవాభిమానులకు మరపు రాని రోజు. ఎర్రజెండా పార్టీలన్నీ ఒకే గాటన కట్టి వాటి మధ్య ఐక్యత కావాలని కోరుకోవడం అనవసరమైనది. ఎందుకంటే నాటి తెలంగాణా సాయుధ పోరాట విరమణ తరువాత భా.క.పా. పార్లమెంటరీ రొంపిలో కూరుకుపోగ చాలా మంది కార్యకర్తలు గోదావరి జిల్లాల వారు సినిమాలోకంలో మునిగిపోయారు. ఆ తరువాత 1964 ప్రాంతంలో భా.క.పా.ను రివిజనిస్ట్ పార్టీగా పేర్కొంటూ మార్క్సిస్ట్ పార్టీగా అవతరించి అంతే తొందరగా కరడు కట్టిన ఎన్నికల పార్టీగా మారిపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా నక్సల్బరీ పోరు హోరున ముందుకు వచ్చింది. ఇదే మార్క్సిస్ట్ పార్టీ తీవ్రమైన రాజ్యహింసకు పాల్పడుతూ ఆ పోరాటాన్ని అణచడంలో కీలక పాత్ర వహించింది. ఆ పంథాలో మరల తెలుగుదేశంలో శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం ఉవ్వెత్తున లేచింది. తీవ్రమైన సైనిక అణచివేతకు గురైనా దేశంలో విప్లవాగ్ని చల్లారలేదని పోరాటాలకు తూరుపు ఎరుపు సాక్షిగా నిలిచింది. అదే స్ఫూర్తితో జగిత్యాల పోరుతో మొదలై భా.క.పా. (పీపుల్స్ వార్) అవతరించింది. రెండు దశాబ్ధాల పోరాటంతో దేశంలో అతిపెద్ద విప్లవ పార్టీగా జనం మదిలో నిలిచి పోరాట బావుటాను ఎత్తి పట్టింది. ఇదే క్రమంలో పార్టీ యూనిటీతో ఐక్య సంఘటనను ఏర్పరచుకోని మరింత ముందుకు పోయింది. ఆ తరువాత 2004 సెప్టెంబర్ 21న ఉత్తర భారతదేశంలో MCC తో పొత్తు కుదిరి విశాల ఐక్య సంఘటనకు నాందిగా భా.క.పా. (మావోయిస్ట్) గా మారి దేశంలోని ప్రధాన దళారీ పార్లమెంటరీ పార్టీలకన్నింటికీ ఏకైక ప్రతిపక్షంగా నిలిచి పోరాడుతూ దేశంలోనే ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగానే కాక జనతన సర్కార్ ను ఏర్పాటు చేస్తూ ప్రజా ప్రత్యామ్నాయ పాలనను స్థాపిస్తూ ఎర్రజెండా రెపరెపలను ఆకాశానికెత్తిపడుతూ వుంది.
ఇదే సమయంలో ఎర్రజెండా పార్టీలుగా చెప్పుకునే చాలా పార్టీలు ప్రజలు ఇంకా విప్లవానికి సంసిద్ధం కాలేదు దేశంలో విప్లవకర పరిస్థితులున్నాయి కానీ పోరాటాలను ఆర్థిక పోరాటాలకే సరిపెడుతూ తమ పిరికి నాయకత్వాన్ని సిద్ధాంతాలను వల్లిస్తూ ప్రజలను ఎరుపు దనంతో వంచిస్తూ వీధి పోరాటాలకు కూడా దూరంగా జరిగి పేపర్ స్టేట్ మెంట్లకే పరిమితమయి పోయి చంద దందాలతో నెట్టుకొస్తున్న విప్లవ పార్టీలు చాలా వున్నాయి. ఇవి ఏనాటికీ ప్రజాపంధాలో కలిసేవి కావు. వీరి పంధా మారకుండా వీరితో ఐక్య సంఘటన ఏనాటికీ కుదరదు. ఇంకా సిపిఐ, సిపిఎం పార్టీలు ఏనాడో ప్రజలకు దూరంగా జరిగి దళారీ పార్టీలకంటే ఘోరంగా నీచ పొత్తులకు పాల్పడుతూ అసెంబ్లీ పార్లమెంట్లలో సీట్లకు కక్కుర్తి రాజకీయాలకు పాల్పడే లోఫర్ పార్టీలు ఈ పేరును మార్చుకుంటే సంతోషిద్దాం.
ఈ రోజు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక నిర్వహించదలచిన సభను తెలంగాణా ఆంధ్ర ప్రభుత్వ పాలక వర్గాలు ఏకమై అక్రమ అరెస్టులతో అడ్డుకొని తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నాయి. పేరుకు మాత్రమే తాము వేరు వేరు పార్టీలుగా ప్రాంతాలుగా చెప్పుకుంటూ ప్రజల ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని అడ్డుకోవడంలో బలప్రయోగం చేయడంలో దొందూ దొందేనని నిరూపించుకొన్నాయి.
ప్రజా పోరాటాలను ఎత్తిపడుతూ ఈ దేశ ప్రత్యామ్నాయ రాజకీయ పంధాను ఎలుగెత్తి చాటుదాం.

13, సెప్టెంబర్ 2014, శనివారం

కామ్రేడ్ జతీంద్ర నాద్ దాస్ అమర్ రహే..

Comrade Jatindra Nadh Das


కామ్రేడ్ జతీంద్రనాద్ దాస్ పట్టుదలకు త్యాగనిరతికి నిలువెత్తు నిదర్శనం. స్వాతంత్ర్య పోరాట కాలంలో తమను రాజకీయ ఖైదీలుగా గుర్తించాలని, జైలులో ఖైదీలకు సౌకర్యాలు మెరుగుపడాలని తమ పట్ల జైలు అధికారుల అనుచిత ప్రవర్తన, కౄర హింస పట్ల వ్యతిరేకతతో 63 రోజులు నిరాహార దీక్ష చేపట్టి ఇదే రోజున 1969లో జైలులోనే అమరుడయ్యాడు. 

ఆయన పోరాట స్ఫూర్తితో నేటికీ అనేక మంది రాజకీయ ఖైదీలు జైలులో పోరాటం చేస్తున్నారు. పదేళ్ళకు పైగా అండర్ ట్రైలు ఖైదీలుగా మగ్గుతూ నిత్యమూ అనేక మంది మానసికంగా ఒంటరితనంతో మగ్గి పోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు, అనారోగ్యం పాలవుతూ సరైన వైద్య సౌకర్యాలు లేక చనిపోతున్నారు. అక్రమ కేసులు బనాయించి మావోయిస్టు ముద్రతో వేలాది గిరిజన జనం రాజకీయ ఖైదీలుగా జైళ్ళలో మగ్గుతున్నారు. ప్రతిసారీ ఆగస్టు 15, అక్టోబర్ 2 తారీఖులలో రాజకీయ పలుకుబడిగల ఖైదీలు ప్రభుత్వ ప్రాపకంతో విడుదలవుతున్నారు. వామపక్ష భావజాల నెపంతో వేలాది మంది ఖైదీలు జైల్లలో వుండిపోతున్నారు. చేయని నేరాలకు శిక్ష అనుభవించేవారే ఖైదీలలో ఎక్కువమంది. 

కామ్రేడ్ జతిన్ దాస్ స్ఫూర్తితో రాజకీయ ఖైదీల విముక్తి కొరకు ప్రజాస్వామిక వాదులు తమ మద్దతు తెలుపుతూ వారిని బేషరతుగ విడుదల చేసేందుకు కృషి చేయాల్సిన సమయమిది.

కామ్రేడ్ జతీంద్ర నాద్ దాస్ అమర్ రహే.
రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేద్దాం. 
Demand to release all political prisoners..

15, ఆగస్టు 2014, శుక్రవారం

మేరా భారత్ మహాన్...



ఒకసారి మన్నించేయ్ 
ఇప్పుడేదో సాధించలేదని 
ఇంకెప్పుడో సాధించి పెడతామని 
ఆశ పడుతూ ఆశ పెడుతూ 
నీకో చాక్లెట్ ఇచ్చి 
జై కొట్టించి 
ఎండలో నిలబెట్టినందుకు

ఎగిరినంత సేపు లేదాయె గాలి
మూడు రంగులూ మూడు రంగులే ఎప్పటికీ
అవేవీ కలవకుండా ధర్మ చక్రం గిర్రున తిరుగుతూనే వుంటుందిలే

నీ రంగు నీదే నా రంగు నాదే 
వాడక్కడే ఏడుస్తూ ఈడుస్తాడు 
నేనిక్కడే కదలకుండా వల్లెవేస్తుంటాను
నువ్వక్కడికక్కడే నీలో నీవు మరిగిపో

ఎవడి నీళ్ళు వాడివే ఎవడి కంపు వాడిదే
గొంతు తడవనీయడెవడు
బురదనూడ్చేస్తానంటాడొకడు 
కడిగి పారేస్తానంటాడొకడు
వీళ్ళిద్దరి నాలుక కింద తిరుగాడే స్క్రూ వేరొకడిది

హద్దులు చెరిగిపోవాలంటాడొకడు
ఏ హద్దులో చెప్పని టక్కరి వాడు
నువు వదులు చేసాక పెడతాడా బోర్డ్ 
ఇక్కడ అన్నీ అమ్మబడును అని

చివారఖరికి నీ గోచి పాతకు
పిన్నీసు గుచ్చి 
వేలాడదీస్తావు 
చిరిగిన మూడు రంగుల కాగితాన్ని

మేరా భారత్ మహాన్...

24, జులై 2014, గురువారం

ఈలం టు పాలస్తీనా...


ఒక్కోసారంతే 
నిస్సహాయత అసమర్థత్వం అసహనంగా మారి వెంటాడుతూ 
వేటాడుతూ నిలవనీయవు అలా అని పరుగెత్తనీయవు
నీరసంగా ఓ మూల కూలబడేట్టు చేసి

మొన్న ఈలం 
నిన్న ఎన్నికల ఫలితాలు
నేడు పోలవరం బిల్లు
ఎన్నాళ్ళుగానో పాలస్తీనా

ఒక్కోటీ ఒకదానికొకటి ముడిపడే వున్నట్టు 
నెత్తురంటిన దారపు కొసలు ముడివడీ పడనట్టు 
నీ కళ్ళపై ఓ కఫన్ అల్లిక చేరి నిద్రపొమ్మని 
గట్టిగా నీ మెడ నరం తెగేట్టు కొరికినట్టు

ఆవులింతల మధ్య ఆవిరయ్యేనా ఈ 
క్షణాల ప్రకంపనల తీవ్రత 
మరిగే రక్తం టీ కాచే పాత్రను వీడి బయటకు రాని డికాక్షన్ లా కుత కుతలాడుతూ

వాడొక్కా బాలూ తంతూ లాటిన్ అమెరికా యవ్వనపు శీర్షాన్ని విరగతన్ని
బంగారపు బంతిని ఎగరేసుకు పోయి
నాజీల మారాజూ విరగబడినవ్వుతున్నాడు...

ఇదంతా గొలుసుగా కొనసాగినా మనకు మన చర్మానికి
ముక్కుపుటాలకి కమురు కంపు తెలీనివ్వని చంకలనిండా పూసుకున్న
AXE మత్తులో జోగుతూ సెలవింక....

16, మే 2014, శుక్రవారం

యుద్ధమూ - భూమీ..


ఔను నువ్వెన్నయినా చెప్పు 
భూమ్మీదే భూమి కొరకే యుద్ధం జరుగుతుంది..


ఈ నేల మాళిగలలో ఇగిరిన నెత్తురంతా 
భూమికోసమే


ఒక రాణీ నవ్విందనో ఏడ్చిందనో అన్నది
 సాకు మాత్రమే 

నేల కొరకు నేలపై హక్కు కొరకు నేల 
సరిహద్దుల మార్పు కొరకే


భూమి పుత్రుల నెత్తుటి ధారతో 
ఈ నేల సరిహద్దు రేఖలు గీయబడ్డాయి


సరిహద్దులన్నీ చెరిపేసే నెత్తుటి 
ధారాపాతం


నియాంగిరీ సాక్షిగా నేల తల్లి పొత్తిళ్ళలో దాగిన సంపద 
బొక్కే దొంగలను నిలువరించే యుద్ధం


యిది ముమ్మాటికీ సత్యం వారసత్వంగా
 కొనసాగే యుద్ధం 

నువ్వు ఎన్ని ఆపరేషన్లతో పరేషాన్ అయినా 
ఆపలేని యుద్ధం..

21, ఏప్రిల్ 2014, సోమవారం

నవ్వూ యుద్ధ వ్యూహమే..


నీలా వెన్నెల కురిసేలా నవ్వగలగడం
కూడా యుద్ధ వ్యూహమే కామ్రేడ్

శతృవు గుండెల్లో గుబులు పుట్టించే
ఆ నవ్వు కూడా ఆయుధమే కామ్రేడ్

మా గుండెల్లో దిగులు పారదోలే
సాయుధరూపం నీ నవ్వు కామ్రేడ్

నీ నవ్వు మహా ప్రస్థానానికి
ఉద్యమ గేయం కామ్రేడ్

నీ నవ్వు అంబరాన
ఎగరేసిన ఎర్రజెండా కామ్రేడ్

నీ నవ్వునింకా బాలింతరపు పరిమళం
వీడక పునర్జన్మిస్తూనే వుంది కామ్రేడ్..

17, ఏప్రిల్ 2014, గురువారం

అసహ్యం నాకు...


అసహ్యం నాకు...

వాడెప్పుడూ తన ముఖాన్ని దాచుకోలేదు

నెత్తురంటి
కంపుకొడుతున్న చేతులని దాచుకోలేదు

మెడలో వేసుకున్న బాలింతరాలి పేగులను జంధ్యంలా పేనుతున్నాడు

కంకాళాలను కాలికింద నలుపుతూ సింహాసనమెక్క వస్తున్నాడు

దేశమంతా స్మశాన నిశ్శబ్దం వాగ్ధానం చేస్తూ రంకెలేస్తూ వస్తున్నాడు

వాడొక్కడే ఈ నేలకు వారసుడుగా త్రీడీలో పోజులిస్తున్నాడు

వాడిప్పుడు అధికారంతో చేతులు కడుక్కోజూస్తున్నాడు

వాడి చుట్టూ చేరుతున్న భజనపరులను చూస్తేనే అసహ్యం నాకు

12, ఫిబ్రవరి 2014, బుధవారం

దేవుడిపై యుద్ధం ప్రకటించావా?


దేవుడిపై యుద్ధం ప్రకటించావా?

సరే
....

నీ దగ్గర ఆయుధమేముంది?

కలం
...

యిది చాలా ప్రమాదకమైనది

ఉరితీయండి వీడ్ని
...

అత్యంత ప్రమాదకరమైన ఆయుధం
మనసులలోకి దూసుకు పోయే ఆయుధం
...

మతమా నువ్వు మరణిస్తే కానీ
మానవత్వం బతకదు
...

రాజ్యమా నువు సమాధి అయితే కానీ
ప్రపంచం వికసించదు
...

హాషిం షబానీ
నీ మెడ ఎముక విరిగినా
నీ పాళీ విరగలేదు

నీ మరణం చిరస్మరణీయం

(ఇరాన్ లో మైనారిటీ అరబ్ జాతీయుల హక్కుల కోసం పోరాడిన కవి హాషిం షబానీ నిజాద్ ని మూడేళ్ళు బంధించి చిత్రహింసలకు గురిచేసి జూలై 2013 లో ఉరితీసారని చదివి)