21, సెప్టెంబర్ 2014, ఆదివారం

సెప్టెంబర్ 21

సెప్టెంబర్ 21 భారత విప్లవోద్యమ చరిత్రలో ఓ ముఖ్య ఘట్టానికి నాంది పలికిన రోజు. కమ్యూనిస్ట్ పార్టీల ఐక్య సంఘటన కోసం పరితపించే విప్లవాభిమానులకు మరపు రాని రోజు. ఎర్రజెండా పార్టీలన్నీ ఒకే గాటన కట్టి వాటి మధ్య ఐక్యత కావాలని కోరుకోవడం అనవసరమైనది. ఎందుకంటే నాటి తెలంగాణా సాయుధ పోరాట విరమణ తరువాత భా.క.పా. పార్లమెంటరీ రొంపిలో కూరుకుపోగ చాలా మంది కార్యకర్తలు గోదావరి జిల్లాల వారు సినిమాలోకంలో మునిగిపోయారు. ఆ తరువాత 1964 ప్రాంతంలో భా.క.పా.ను రివిజనిస్ట్ పార్టీగా పేర్కొంటూ మార్క్సిస్ట్ పార్టీగా అవతరించి అంతే తొందరగా కరడు కట్టిన ఎన్నికల పార్టీగా మారిపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా నక్సల్బరీ పోరు హోరున ముందుకు వచ్చింది. ఇదే మార్క్సిస్ట్ పార్టీ తీవ్రమైన రాజ్యహింసకు పాల్పడుతూ ఆ పోరాటాన్ని అణచడంలో కీలక పాత్ర వహించింది. ఆ పంథాలో మరల తెలుగుదేశంలో శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం ఉవ్వెత్తున లేచింది. తీవ్రమైన సైనిక అణచివేతకు గురైనా దేశంలో విప్లవాగ్ని చల్లారలేదని పోరాటాలకు తూరుపు ఎరుపు సాక్షిగా నిలిచింది. అదే స్ఫూర్తితో జగిత్యాల పోరుతో మొదలై భా.క.పా. (పీపుల్స్ వార్) అవతరించింది. రెండు దశాబ్ధాల పోరాటంతో దేశంలో అతిపెద్ద విప్లవ పార్టీగా జనం మదిలో నిలిచి పోరాట బావుటాను ఎత్తి పట్టింది. ఇదే క్రమంలో పార్టీ యూనిటీతో ఐక్య సంఘటనను ఏర్పరచుకోని మరింత ముందుకు పోయింది. ఆ తరువాత 2004 సెప్టెంబర్ 21న ఉత్తర భారతదేశంలో MCC తో పొత్తు కుదిరి విశాల ఐక్య సంఘటనకు నాందిగా భా.క.పా. (మావోయిస్ట్) గా మారి దేశంలోని ప్రధాన దళారీ పార్లమెంటరీ పార్టీలకన్నింటికీ ఏకైక ప్రతిపక్షంగా నిలిచి పోరాడుతూ దేశంలోనే ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగానే కాక జనతన సర్కార్ ను ఏర్పాటు చేస్తూ ప్రజా ప్రత్యామ్నాయ పాలనను స్థాపిస్తూ ఎర్రజెండా రెపరెపలను ఆకాశానికెత్తిపడుతూ వుంది.
ఇదే సమయంలో ఎర్రజెండా పార్టీలుగా చెప్పుకునే చాలా పార్టీలు ప్రజలు ఇంకా విప్లవానికి సంసిద్ధం కాలేదు దేశంలో విప్లవకర పరిస్థితులున్నాయి కానీ పోరాటాలను ఆర్థిక పోరాటాలకే సరిపెడుతూ తమ పిరికి నాయకత్వాన్ని సిద్ధాంతాలను వల్లిస్తూ ప్రజలను ఎరుపు దనంతో వంచిస్తూ వీధి పోరాటాలకు కూడా దూరంగా జరిగి పేపర్ స్టేట్ మెంట్లకే పరిమితమయి పోయి చంద దందాలతో నెట్టుకొస్తున్న విప్లవ పార్టీలు చాలా వున్నాయి. ఇవి ఏనాటికీ ప్రజాపంధాలో కలిసేవి కావు. వీరి పంధా మారకుండా వీరితో ఐక్య సంఘటన ఏనాటికీ కుదరదు. ఇంకా సిపిఐ, సిపిఎం పార్టీలు ఏనాడో ప్రజలకు దూరంగా జరిగి దళారీ పార్టీలకంటే ఘోరంగా నీచ పొత్తులకు పాల్పడుతూ అసెంబ్లీ పార్లమెంట్లలో సీట్లకు కక్కుర్తి రాజకీయాలకు పాల్పడే లోఫర్ పార్టీలు ఈ పేరును మార్చుకుంటే సంతోషిద్దాం.
ఈ రోజు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక నిర్వహించదలచిన సభను తెలంగాణా ఆంధ్ర ప్రభుత్వ పాలక వర్గాలు ఏకమై అక్రమ అరెస్టులతో అడ్డుకొని తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నాయి. పేరుకు మాత్రమే తాము వేరు వేరు పార్టీలుగా ప్రాంతాలుగా చెప్పుకుంటూ ప్రజల ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని అడ్డుకోవడంలో బలప్రయోగం చేయడంలో దొందూ దొందేనని నిరూపించుకొన్నాయి.
ప్రజా పోరాటాలను ఎత్తిపడుతూ ఈ దేశ ప్రత్యామ్నాయ రాజకీయ పంధాను ఎలుగెత్తి చాటుదాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆలోచనాత్మకంగా..