27, జులై 2010, మంగళవారం

దొంగ ఓట్ల దొంగ నోట్ల రాజ్యమొకా రాజ్యమా??




జరిగినవి ఓ 12 నియోజక వర్గాలలో ఉప ఎన్నికలు..
కానీ ఈ మూణ్ణాళ్ళు మద్యం ఏరులై పారింది..
నిస్సిగ్గుగా కుల సంఘాల దగ్గరనుండి వార్డు ఆకు లీడర్ల వరకు విపరీతంగా డబ్బు సంచులు ముట్టాయి..
కార్లలో, ఆటోలలో ఇదిగో పట్టుకున్నాం, అదుగో పట్టుకున్నాం అన్నారే తప్ప ఇదంతా ఎలా జరిగిపోయిందో నీరసించిన వాళ్ళు చెప్పాలి..
ఉదయం నుండి మధ్యాహ్నం వరకు 40 శాతం లేనిది సాయంత్రానికి 60 దాటిపోతుంది.. ఈ చక్రపొంగలి ఎలాగో ఎన్నికల సుబ్బారావులకే ఎరుక..
మొన్నటి వరకు ఓటేసిన వారి ఓటు చీటీ గల్లంతు..
మీటనొక్కితే కుంయిమనకుండానే వెళ్ళిపోతున్న ఓటు..
వీపుపైన లాఠీ వాతతో మొఱోమని వేసిన వాడేడుపు...
నా ఓటెవడు వేసాడురా అని గట్టిగా అడగలేని వాడు ---- నోరూ మూసుకొని పోవాల్సిందే...
ఇదిగో బంగారు పల్లెం.. ఇందులో వుంది -------ముఖం చూసుకో రేప్పొద్దున్న...
ప్రజాస్వామ్యమా మూడు చీర్లు ఆరు చీకులతో వర్థిల్లు...
ఎందుకురా పిచ్చి తండ్రులారా ఆత్మ హననాలు, మీ బలిదానాలు...
మీ ఒంటిని తాకి పునీతమైన అగ్ని జ్వాలలు చివరకు వీళ్ళకు బీడీ ముట్టించుకునేందుకు తప్ప ఎందుకు కొరగాలే...

అంతా ఓట్ల మాయ... నోట్ల మాయ...

జై కొట్టిన వాడి చేతికి అరిగిన చిప్ప...

కానీ ఇలా మూడు మూడు రోజులకి ఎన్నికలొస్తే జనం నోళ్ళుకొట్టి సంపాదించి దాచిన దొంగ బంగారం, డబ్బు తప్పక బయటకు వస్తుంది...

ఎన్నికలూ జిందాబాద్...

24, జులై 2010, శనివారం

షహీద్ చంద్రశేఖర్ అజాద్ అమర్ రహే



నిన్న భారతదేశం గర్వించదగ్గ విప్లవ మూర్తులలో ఒకరైన షహీద్ చంద్రశేఖర్ అజాద్ 105 వ జన్మదినం. అంతా బాబ్లీ గందరగోళంలో పడి ఎవరూ గుర్తుచేసుకో లేకపోయినారు. అయినా శత్రువుకు తలవంచని వీరుడైన కా.అజాద్ ను గుర్తుచేసే ధైర్యం ఎంతమందికి వుంటుందీ కాలం. మారుతున్న విలువలు, అవసరాల నేపథ్యంలో ముందుతరాల వారి త్యాగాలను గుర్తుచేయడం ద్వారా వారి స్ఫూర్తి ఎటువైపు దారితీస్తుందోనన్న బెంగ ఈ కాలం నాయకులలో వుంటుంది. తాము పాలిస్తున్న విధానాలకు, నాటి వలసవాద విధానాలకు తేడా లేకపోవడంతో ఇలాంటి వీరుల పేరునే స్మరించే అర్హత లేదన్న ఎరుక కూడా కారణం కావచ్చు. అయినా కా.షహీద్ భగత్ సింగ్ కు ముఖ్య అనుచరుడిగా, హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ నిర్మాతగా, శత్రువు చేత చిక్కక తనను తాను ఆత్మాహుతి చేసుకున్న అమరవీరునిగా భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైన కా.చంద్రశేఖర్ అజాద్ ను మరొకమారు గుర్తుచేసుకొని ఆయన ఆశయాల సాధనలో భాగమవుతున్న ఉద్యమాలను అక్కున చేరుద్దాం.

అమర్ రహే కా.అజాద్...

15, జులై 2010, గురువారం

మిత్రులారా.. ఇప్పుడేమంటారు?



రాజ్య స్వభావంపై మనకున్న భ్రమలను చెదరగొట్టే వరస సంఘటనల సమాహారం

బషీర్ బాగ్ కాల్పులు..

ముదిగొండ కాల్పులు..

సింగూరు, నందిగ్రాంల అణచివేత..

కాల్దారిలో రైతులపై కాల్పులు..

నిన్నటి సోంపేట కాల్పులు..

ఇలా రోడ్డురోలర్ నమూనాలో జరపతలపెట్టిన అభివృద్ధి పేరుతో రాజ్యం తన రక్కసి స్వభావాన్ని దాపరికం లేకుండా బయటపెడుతున్నా ఇదో గొప్ప ప్రజాస్వామ్య దేశంగా కీర్తిస్తున్న వర్గం తన స్వభావాన్ని ముసుగుతీస్తున్నట్లుగానే గ్రహించాలి.

ప్రజలే నాశనమైన తరువాత ఎవరిని ఉద్ధరిస్తారు?

ఎవరి సంక్షేమం కోసం తాము పనిచేస్తున్నారో నిన్నటి సంఘటనతో తేటతెల్లమైంది.

ఇక్కడ మరో విషయం పోలీసుల స్వభావాన్ని నిన్న మరింతగా వారు తెలియజేసారు. తాము ఓ కీలుబొమ్మలమే తప్ప తాము వచ్చిన వర్గ దృక్పధం కోల్పోయి నిండా చీర లేని ఆడువారిపై కూడా ప్లాస్టిక్ లాఠీలతో చావబాదుతూ చుట్టుముట్టి వారిని దారుణంగా హింసించడాన్ని కళ్ళారా చూసిన తరువాత కూడా ఏమనాలి?

నిన్నటి వరకు శాంతియుతంగానే ర్యాలీలతోను, ధర్నాలతోను, నిరాహార దీక్షలతోను, కోర్టులలో కేసులు వేసి, ప్రభుత్వానికి విన్నపాలను సమర్పించిన ప్రజలు చివరకు అన్ని దారులు మూసుకుపోయి తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదాన్ని అడ్డుకునే క్రమంలో ఉత్త చేతులతో కాళ్ళకు దండాలు పెట్టి అయ్యా అని బతిమాలినా వారిని కనికరించని వారిపై నిరాయుధంగానే ప్రతిఘటిస్తే వారిపై నేరుగా కాల్పులకు ఎగబడ్డ వారిని వెంటేసుకొచ్చిన రాజ్య ప్రతినిధులను ఎవరి ప్రతినిధులుగా గుర్తిద్దాం?

ఈ సంఘటనలతో ఇన్నాళ్ళు నివురుగప్పిన నిప్పులా వున్న ఉద్దానం తన పూర్వ రూపువైపు ఉద్యమాల వనంగా మారితే అది ఎవరి తప్పు?

ఎవరు ఉగ్రవాదో చెప్తారా?

14, జులై 2010, బుధవారం

చివరకు బలిగొన్నారు..Police firing on Fishermen at Sompeta



ఉత్తరాంధ్రను అతలాకుతలం చేస్తున్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజానీకంపైకి పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు మత్స్యకార కుటుంబానికి చెందిన వారు మృతి చెందారు. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం వలన సోంపేట, బారువ,పలాస్, మందస మొ.న.నాలుగు మండలాల ప్రజానీకం కాలుష్యబారిన పడతామని, తమ ఉనికికే ప్రమాదకరంగా పరిగణిస్తూ ప్రజలే తమకు తాము స్వచ్చందంగా ముందుకు వచ్చి పోరాటాన్ని చేస్తున్నారు. వీరిని అణచివేసేందుకు రకరకాల పన్నాగాలు పన్నిన ప్రభుత్వం చివరకు ఈ ఉదయం సోంపేట దగ్గర నాగార్జున కన్స్ట్రక్షన్స్ వారు చేపడుతున్న నిర్మాణాలను అడ్డుకొన్న స్థానికులపై పోలీసులచేత కాల్పులు జరపడంతో నలుగురు చనిపోయారు. ఒకేమారు ఉత్తరాంధ్రలో 10 వరకు థర్మల్, ఒక అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణాలను చేపట్టాలని జూస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడిదారులు ఈ ప్రాంత సస్యశ్యామలమైన భూములను, తీర ప్రాంతంలోని మత్స్య సంపదను నాశనం జేసి ఎవరికోసం ఈ విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. యూరోప్ దేశాలన్నీ వదులుకుంటున్న అణు ప్రాజెక్టులను ఇక్కడ నెలకొల్పడం ఎంతవరకు సమంజసం? ఈ పాలక వర్గాలకు ప్రజల పట్ల ఎంత బాధ్యత వుంటుందో పాతికేళ్ళనాటి భోపాల్ దుర్ఘటన ఇంకా మాయలేదు. కోస్టల్ కారిడార్ పేరుతో అనేక కాలుష్యకారక ఫ్యాక్టరీలను ఏర్పాటుజేయడానికి సెజ్ లకు అనుమతిస్తూ ప్రజలను నిర్వాసితులను జేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడజూస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ చేపట్టిన స్వచ్చంద నిరసన కార్యక్రమాలు గత సం.కాలంగా జరుగుతూనే వున్నాయి. నేడు వారి రక్తం రుచి చూడడం దారుణం. దీనిని ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలి..

Watch thesuchi.com - Sompeta Police Firing - NTV\thesuchi.com - Sompeta Police Firing - NTV in Entertainment  |  View More Free Videos Online at Veoh.com

12, జులై 2010, సోమవారం

అంతర్యుద్ధంపై దృశ్యరూపం - గోపాల్ మీనన్

గోపాల్ మీనన్ ఈ చిన్న నిడివి చిత్రంలో మనకు ఏదైతే అంతర్గత భధ్రతకు ముప్పుగా పరిగణిస్తూ యుద్ధం ప్రకటించబడ్డ ప్రాంతాలనుండి అక్కడివారి గొంతులో వారి బాధలను చూపించే ప్రయత్నం చేసారు. మానవత్వం గురించి, హింస గురించి మాటాడుతున్న మేధావులకు కనిపించని కోణం ఇది. ఇందులో ప్రముఖ సామాజిక కార్యకర్త అరుంధతీ రాయ్, ప్రముఖ సినీ నిర్మాత మహేష్ భట్ ల అభిప్రాయాలను పొందుపరిచారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఎఱ రాజ్యమొచ్చేస్తుందో అని గగ్గోలు పుట్టించి, ఆ వాతావరణంలో ఈ దేశ సహజ వనరులను విదేశి కంపెనీలకు దోచిపెట్టేందుకు అడ్డులేకుండా జేసుకునే క్రమంలో పేరులోనే విధ్వంసాన్ని నింపుకున్న ఆపరేషన్ గ్రీన్ హంట్ చేపట్టి స్వంత ప్రజలపైనే యుద్ధాన్ని చేయబూనిన కార్పొరేట్ పాలకవర్గం కుట్రను తప్పక గ్రహించాల్సిన అవసరముంది. తమ పరిపాలనలోని బూటకత్వాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఉద్యమకారులు చేసే ప్రతిహింసను భయానకంగా చూపిస్తూ తమ ఘోరకృత్యాలను దాచే ప్రయత్నం చేస్తున్నారు. ఒకే వర్గానికి చెందిన సామాన్య జనం మధ్య యుద్ధాన్ని పెట్టి తమ వ్యాపారాలు చేసుకునే కుటిల నీతిని అమలుజేస్తున్నారు. దీనిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి.



7, జులై 2010, బుధవారం

జర్నలిస్టు పాండే సహచరి బబిత ఆవేదన..

ఈ రోజు ఆంధ్ర జ్యోతి నవ్య పేజీలో మావోయిస్టు అగ్రనేత కా.అజాద్ తో పాటు హత్య చేయబడ్డ జర్నలిస్టు హేమచంద్ర పాండే సహచరి బబిత ఆవేదనను గూర్చి రాసారు. చదవగలరుః

పోలీసు, మావోయిస్టుల వార్‌లో ఎప్పటిలాగే మూడోవాళ్లూ మూల్యం చెల్లించారు. అయితే ఈసారి ఆ గురి ఓ పాత్రికేయుడిని తగిలింది. అతను హేమచంద్రపాండే. అప్పటిదాకా కర్తవ్య నిర్వహణలో ఉన్న పాండే పోలీస్ తూటా తగలగానే చిత్రంగా మావోయిస్ట్‌గా మారిపోయాడు. ఇంతకీ అతను విప్లవకారుడా?సామాజిక కార్యకర్తా? కేవలం జర్నలిస్టేనా? మూడూ కలగలిసిన వ్యక్తా? సహచరికన్నా బాగా చెప్పగలిగిన వారు ఎవరున్నారు? అందుకే ఆయన గురించి భార్య బబిత మాటల్లోనే తెలుసుకుందాం...

హేమచంద్ర కుమావూన్ యూనివర్శిటీలో పిజి చేశాడు. నేనూ అదే యూనివర్శిటీలో డిగ్రీ చదివాను. ఆ పరిచయమే మా మధ్య ప్రేమగా మారింది. 2002 ప్రేమికుల రోజున పెద్దల ఆంగీకారంతో పెళ్లి చేసుకున్నాం. ఆయనది చాలా సున్నితమైన మనస్తత్వం.ఎవరికి ఏ చిన్న కష్టమొచ్చినా సాయం చేయడానికి ముందుండే వాడు. ఇప్పుడు ఎన్‌జీవోలపై పిహెచ్‌డీ చేస్తున్నాడు. ఆయన్ని పాత్రికేయుడు కాదంటుంటే నవ్వొస్తుంది. మల్టీమీడియా డి ప్లొమా చేసిన నేనూ మొన్నటి దాకా జర్నలిస్ట్‌గానే పని చేశాను.

నన్నూ కాల్చేస్తే పోయేది
మేము మూడున్నరేళ్ల క్రితం ఢిల్లీ వచ్చాం. ఇక్కడ శాస్త్రీనగర్‌లో ఒక చిన్న ఇంటిలో అద్దెకుంటున్నాం. పాత్రికేయుడే కాక ఆయన ఓ సామాజిక కార్యకర్త కూడా. అల్మోరాలో జంగల్ బచావో...ఉత్తరాఖండ్ ఉద్యమాలలో పాల్గొన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ జోక్యం చేసుకునేవారు. అలాంటి మంచి మనిషిని ఇంత దారుణమైన చావు వెంటాడుతుందని కలలో కూడా ఊహించలేదు. అయన్ను చంపినట్టు నన్నూ ఒక్క బుల్లెట్‌తో కాల్చి చంపేస్తే బావుండేది.

ఆ మాటలే చివరివి
నా భర్త నాతో చివరిగా మాట్లాడింది జూన్ 30 సాయంకాలం ఐదు పదిహేనుకి. నాగ్‌పూర్‌కి వెళ్తూ ట్రైన్‌లో ఉన్నాను అని ఫోన్‌లో చెప్పారు. అవే చివరి మాటలు. బహుశా అది చెన్నై లేదా ఎపి ఎక్స్‌ప్రెస్ అయ్యుండాలి. మొత్తానికి ఏదో ఒకదాంట్లో రిజర్వేషన్ చేయించుకున్న దాఖలా కూడా ఉంది.ఆయన ఆ రోజు మధ్యాహ్నం ఒకటిన్నరకే ఇంటి నుంచి బయలుదేరారు. ఏదో ఇంటర్వ్యూ కోసం నాగపూర్‌కి వెళ్తున్నానని మూడుంపావుకి ట్రైన్ ఉందని, రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పారు. ఏం స్టోరీ ఏంటని నేను వివరాలు అడగలేదు. వృత్తిపరమైన విషయాల్లో జోక్యం చేసుకునే అలవాటు నాకు లేదు. కాబట్టి విషయాన్ని కాజువల్‌గానే తీసుకున్నాను.

అనూహ్యం
తర్వాత చాలాసార్లు ఫోన్ ట్రై చేశాను. కాంటాక్ట్‌లోకి రాలేదు. నాట్ రీచబుల్ అనే రెస్పాన్స్ తప్ప ఎలాంటి స్పందనా లేదు. తర్వాతి మూడు రోజులూ మనసు మనసులో లేదు. కీడు శంకించడానికీ ఎలాంటి సూచనలూ లేవు. ఆ భరోసాతోనే ధైర్యంగానే ఉన్నా. లోలోపల మాత్రం తెలియని బెంగ...దిగులుతోనే గడిపాను. రెండో తారీఖు కల్లా తిరిగి వస్తానని చెప్పిన మనిషి పత్రికల్లో శవమై కనిపించాడు. 'తెలుగు న్యూస్ పేపర్స్‌లో ఓ ఫొటో వచ్చింది. హేమచంద్రలాగే ఉంద'ని సన్నిహితులు చెబితే అప్పుడు చూశాను...నిజమే! మా ఆయనే....కుప్పకూలిపోయాను. విషయమేంటో అర్థం కాలేదు. చివరకు ఒక హై క్యాడర్ మావోయిస్ట్ లీడర్‌తో పాటు మా ఆయన్నీ మావోయిస్ట్ అనే ముద్రవేసి ఆంధ్రప్రదేశ్ పోలీసలు ఎన్‌కౌంటర్ చేశారని తెలిసింది.

గొంతు నొక్కే ప్రయత్నమే
అయనకి దూరంగా ఒక్క రోజు కూడా ఉండలేదు. ఆయనలేని ఈ జీవితాన్ని ఎలా....(దుఃఖంతో కాసేపు మౌనం)నాకేమీ అర్థం కావడం లేదు. చేతనైన మంచి చేసుకుంటూ మా బతుకు మేము బతుకుతుంటే మా మీద మావోయిస్ట్‌లనే అనవసరమైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది అన్యాయం. అసలు ఇంత వరకు ఆయన మీద ఒక్క కేసు కూడా లేదు. ఎప్పుడూ అరెస్ట్ అవలేదు. బాధ్యత గల ఒక జర్నలిస్ట్‌ని పట్టుకుని అజ్ఞాత నక్సలైట్ అనడం ఎంత అన్యాయం? దీన్ని ఎదుర్కోవడానికి ఏ స్థాయిలోనైనా ఉద్యమిస్తాను. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం కూడా అదే. దీనికి ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్ట్‌లు అందరూ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ హత్యను కేంద్ర మంత్రి చిదంబరం కావాలని చేయించారు. జర్నలిస్ట్‌ల గొంతు నొక్కేయడం కోసమే ఇలాంటి పని చేయిస్తున్నారని నేను భావిస్తున్నాను.

నా అన్నను అన్యాయంగా చంపారు
అన్నయ్య, నేను ఇద్దరమే. అక్కచెల్లెళ్లు లేరు మాకు. తనంటే నాకు ప్రాణం. అంతే గౌరవం కూడా. అన్యాయాన్ని వెలికితీసే మంచి జర్నలిస్ట్. అద్భుతమైన వ్యాసాలు రాసేవాడు. అలాంటి నిఖార్సయిన మనిషిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు.

- రాజీవ్ పాండే (తమ్ముడు) కుటుంబ నేపథ్యం
ఉత్తరాఖండ్ రాష్ట్రం పిథోర్‌ఘడ్ జిల్లా దేవకల్ గ్రామం హేమచంద్ర పాండే స్వస్థలం. మధ్యతరగతి కటుంబం. తల్లీతండ్రులిద్దరూ టీచర్లుగా పనిచేసి రిటైరయ్యారు. హేమచంద్ర తండ్రి దివంగతులవగా తల్లి మాత్రమే ఉన్నారు. తమ్ముడు రాజీవ్ పాండే కూడా నైనిటాల్‌లో ఆరేళ్లుగా అమర్ ఉజాల పత్రికలో పాత్రికేయవృత్తిలో కొనసాగుతున్నారు.

జూ ఎం.డి. మునీర్,
ఆన్‌లైన్, మంచిర్యాల
http://epaper.andhrajyothy.com/GalleryView.shtml

3, జులై 2010, శనివారం

హిందూలో అజాద్ ఇంటర్వ్యూ

నిన్నటి బూటకపు ఎదురుకాల్పులలో మరణించిన మావోయిస్టు అధికార ప్రతినిధి కా.అజాద్ చర్చలపై చిదంబరం ప్రతిపాదనల గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలో హిందూ పత్రిక ఎడిట్ చేసి ప్రచురించిన భాగాలుః

Azad's Interview in Hindu

2, జులై 2010, శుక్రవారం

మరో కట్టు కథ



మావోయిస్టు అగ్రనేత చెరుకూరి రాజ్ కుమార్ @ అజాద్ తెల్లవారుఝామున ఎదురుకాల్పులలొ చనిపోయాడన్న మరో కట్టుకథ ఈ రోజు ప్రచారమవుతోంది. ఎదురుకాల్పులు జరిగితే ఎలావుంటుందో చతీస్ఘడ్, ఝార్ఖండ్ లలో అనుభవమవుతోంది. అయినా పాతిక మంది మావోయిస్టులుతో ఆదిలాబాద్ అడవుల్లో కాల్పులు జరిగితే ఒక్క పోలీసుకు గాయంకాకుండా సురక్షితంగా ఎలా బయటపడ్డారు. ఇంతకంటే పెద్ద జోక్ వుంటుందా? మీడియాముందు మాటాడడానికైనా సిగ్గు పడడంలేదు.

ఓవైపు చర్చలకు ఆహ్వానిస్తున్న హోంమంత్రి ఇలా తమకు దొరికిన మేధావివర్గాన్ని హత్యచేసే బదులు వారితో మాటాడితే సమస్య పట్ల సానుకూల వైఖరికి రావొచ్చుకదా? ఒకవైపు ఆపరేషన్ సాగుతూ మరోవైపు చర్చలంటూ మభ్యపెట్టడం ఏం ప్రజాస్వామ్యం? తీవ్రమైన సమస్యగా గుర్తించినప్పుడు దానికి ఓ పరిష్కార మార్గం కోసం ప్రయత్నిస్తున్న నిజాయితీ వుంటే ఇలా సీనియర్ నేతలు దొరికినప్పుడు వారిని అరెస్టు చూపించి అయినా వారితో మాటాడడం వలన ఉపయోగం వుంటుంది. అంతే కానీ చంపుతూ పోతే మరింత మంది ఆజాద్ లు వస్తూనే వుంటారు కానీ సమస్య పరిష్కారం కాదు. ఎవరు ఔననా కాదన్నా వాళ్ళు ఈ దేశంలో ఓ ప్రధాన రాజకీయ స్రవంతికి ప్రతినిధులు. సుమారుగా దేశంలో సగానికి పైగా జిల్లాల్లో ప్రజలను ప్రభావితం చేస్తున్న వాళ్ళు. వారి నాయకత్వాన్ని మట్టుబెట్ట చూడడం వలన అది సమసిపోదు. ఇది చరిత్ర చెపుతున్న సత్యం. ఇప్పటికి గత కొంత కాలంగా ఆ స్థాయి నాయకులను 10 మందికి పైగా చంపినా సమస్య మరింత జఠిలమవుతోందే తప్ప పరిష్కారం వైపు కనుచూపు మేరలో కానరావడం లేదు. కావున ఇది ముమ్మాటికీ పాలకవర్గం కోల్పోయిన ఓ మంచి అవకాశం. ప్రజల సమస్యలపట్ల చిత్తశుద్ధిలేమి వెల్లడవుతోంది.
http://www.ndtv.com/article/india/andhra-pradesh-top-2-maoist-leaders-killed-in-encounter-35061