
జరిగినవి ఓ 12 నియోజక వర్గాలలో ఉప ఎన్నికలు..
కానీ ఈ మూణ్ణాళ్ళు మద్యం ఏరులై పారింది..
నిస్సిగ్గుగా కుల సంఘాల దగ్గరనుండి వార్డు ఆకు లీడర్ల వరకు విపరీతంగా డబ్బు సంచులు ముట్టాయి..
కార్లలో, ఆటోలలో ఇదిగో పట్టుకున్నాం, అదుగో పట్టుకున్నాం అన్నారే తప్ప ఇదంతా ఎలా జరిగిపోయిందో నీరసించిన వాళ్ళు చెప్పాలి..
ఉదయం నుండి మధ్యాహ్నం వరకు 40 శాతం లేనిది సాయంత్రానికి 60 దాటిపోతుంది.. ఈ చక్రపొంగలి ఎలాగో ఎన్నికల సుబ్బారావులకే ఎరుక..
మొన్నటి వరకు ఓటేసిన వారి ఓటు చీటీ గల్లంతు..
మీటనొక్కితే కుంయిమనకుండానే వెళ్ళిపోతున్న ఓటు..
వీపుపైన లాఠీ వాతతో మొఱోమని వేసిన వాడేడుపు...
నా ఓటెవడు వేసాడురా అని గట్టిగా అడగలేని వాడు ---- నోరూ మూసుకొని పోవాల్సిందే...
ఇదిగో బంగారు పల్లెం.. ఇందులో వుంది -------ముఖం చూసుకో రేప్పొద్దున్న...
ప్రజాస్వామ్యమా మూడు చీర్లు ఆరు చీకులతో వర్థిల్లు...
ఎందుకురా పిచ్చి తండ్రులారా ఆత్మ హననాలు, మీ బలిదానాలు...
మీ ఒంటిని తాకి పునీతమైన అగ్ని జ్వాలలు చివరకు వీళ్ళకు బీడీ ముట్టించుకునేందుకు తప్ప ఎందుకు కొరగాలే...
అంతా ఓట్ల మాయ... నోట్ల మాయ...
జై కొట్టిన వాడి చేతికి అరిగిన చిప్ప...
కానీ ఇలా మూడు మూడు రోజులకి ఎన్నికలొస్తే జనం నోళ్ళుకొట్టి సంపాదించి దాచిన దొంగ బంగారం, డబ్బు తప్పక బయటకు వస్తుంది...
ఎన్నికలూ జిందాబాద్...