4, డిసెంబర్ 2016, ఆదివారం

తెలవారని ఆకాశం!

తెలవారని ఆకాశం!

కొన్ని మంచు బిందువులేవో రాతిరి కురిసిన
వాన చివుళ్ళ నుండి రాలుతూ

రెక్కల చాటున ముఖం దాచుకున్న పక్షి
టపటప రెక్కలల్లారుస్తూ ఎగరబోతూ

తొలి పొద్దు కిరణాలు తాకి విచ్చుకుంటూన్న
అడవి పువ్వు పరిమళమవుతూ

ఆ క్షణాన వన్ టూ త్రీ రోల్ కాల్ విజిల్ తో
టక టకమని వరుసలోకి వస్తూ

జ్వరంతో మాగన్నుగా రెప్పలను తెరవలేని
అలసిన ఎర్ర మందారాలు

ఒక్కసారిగా విరుచుకుపడిన తూటాలతో
అచేతనమయి నెత్తురోడి చెదరిన రేపటి కల

దేహం నుండి వేరుపడిన తల తెరచిన
కనులింక మూతబడవు

ఒక్కొక్కరుగా ఒరిగి పోయిన వారిని
హత్తుకుంటూ తెలవారని ఆకాశం

విరిగిపడిన కలలను ఏరుకుంటూ
ఆమె పొత్తిళిలో ఎర్ర వస్త్రం తడిగా!!

27, అక్టోబర్ 2016, గురువారం

బెజ్జంగీ = యురీ దాడి


ఒక అసహజ మరణం పొందిన దేహానికి పోస్ట్ మార్టం చేయించడానికి ఎన్ని తిప్పలు పడితే బతిమాలుకుంటే రోజంతా రోదిస్తూ కాళ్ళా వేళ్ళా పడితే గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టరుకు  గంటా రెండు గంటలు పడుతుంది. అలాగే సాయంత్రం 5 తరువాత రూల్స్‌ ఒప్పుకోవని రేపటికి వాయిదా వేస్తారు. అలాంటిది కనీసం శవపంచనామాలు కానీ వీళ్ళు చెప్పే ఏ చట్టపరమైన రూల్స పాటించకుండా అర్థరాత్రి పాతికపైగా శవాలకు గిన్నీస్ రికార్డ్ టైంలో  పోస్ట్ మార్టం చేసేసి ఒక కంటైనర్లో అట్టపెట్టెలలో పడేసి కుళ్ళబెట్టన డీజీపీ ఎంత సౌమ్యంగా మీడియా ముందు ఎన్నెన్ని చిలుకపలుకులు వల్లిస్తున్నాడో. నిన్నొక నాలుగు శవాలు పోగేసి హెలికాప్టర్ లో చక్కెర్లు కొడుతుంటే కాల్పులు జరిపారు ఎదురు కాల్పులలో చనిపోయారు గుర్తు తెలియని వారంటారు. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ద యూనిఫాం ఉద్యోగి ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్నీ ఆడుతన్నాడు. 

నువ్ నిజంగా ఎదురుకాల్పులలో చంపితే హైకోర్టు ఇచ్విన ఉత్తర్వులు పాటించి కెజీహెచ్ కు తీసుకు రావడానికి ఎందుకు భయపడ్డావు దొరా? పోస్ట్ మార్టం వీడియో తీయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఎందుకు పాటించలేకపోయావొ చెప్పగలవా? వాళ్ల మొఖాలపై కత్తి గాట్లు నోటిలోంచి వచ్చిన పచ్చి నెత్తురు ఏ సాక్ష్యం చెప్తున్నాయి? ఇరవై ఏళ్లు నిండని ఆ లేలేత ముఖాలు కళ్ళు పీకిన నీ చేతులను ధైర్యంగా చూపగలవా?  కనీసం అక్కడ కాల్పులు జరిగిన ప్రదేశం ఫోటోలు ఎందుకు చూపలేక గుట్టలు వాగులు ఫోటోలు చూపుతున్నావు దొరా? రాజకీయ నాయకుల అరికాళ్ళు నాకే ఈ అధికారులు ఎన్నెన్ని అసత్యాలు ప్రచారం చేయాలో చేస్తున్నారు.

ఇంతమంది ఆదివాసీలను చంపి కనీసం శవాలపట్ల కూడా మానవత్వం చూపని వారు ఢిల్లీలో గిరిజన కార్నివాల్ జరిపి ఆదివాసీల హక్కులను భూములను హరిస్తే సహించననీ నీతులు వల్లిస్తాడు మన ప్రధాని రూపంలొని అసలు పోలీస్ బాస్. కనీసం అక్కడ చనిపోయిన వాళ్ళలో మూడు వంతులమంది ఆదివాసీ మహిళలు యువకులే కదా? వారి మాట కూడా ఎత్తకుండా చేతులూపి మాటాడే ఇండియన్ ట్రంప్ ఎవరిని బుజ్జగించగలడు.

ఇలా విషప్రయోగము జరిపి మత్తులో వున్నవారిని చంపి వారి పట్ల మాకు వ్యతిరేకత లేదు వారి చర్యలపైనే అని సన్నాయి నొక్కులు నొక్కి రక్తపుటేరులు పారించే వీళ్ళు యురీలో దాడి చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులకు ప్రతిరూపాలు కాదా? దీనిని సర్జికల్ స్ట్రైక్స్ తో పోల్చి గొప్పలు చెప్పడం కాదు. ఇది రాజ్యం ఉగ్రవాద దాడి. కనుకనే ఇంత మంది తెలుగు వారు చనిపోతే ఇరు రాష్ట్రాల అమావాస్య చంద్రులు నోరు మెదపరు. ప్రతిపక్ష నాయకులు ఖండించరు. వీళ్ళంతా ఒకే అతుకుల బొంతలోని చినుగులు కనుక. 

ప్రజాస్వామ్య వాదులారా విదార్థీ యువజన మేధావుల్లారా ఆలోచించండి. ప్రశ్నించండి.

Condemn the State Terrorism on its own people. 

14, ఆగస్టు 2016, ఆదివారం

ఈ గేం ఆఫ్ డెత్ ఎవరి కళ్ళకు గంతలు కట్టడానికి?

Nayeem dead body

నయీంను ఎన్కౌంటర్ చేసి చంపాక ఇంక సాక్ష్యాలెన్ని కూడబెట్టినా ఎవరిని శిక్షిస్తారు? ప్రధాన నిందితున్ని పట్టుకుని కాల్చి చంపి అనుచరులను అరెస్టులు చూపి భార్యా పిల్లలను నిర్బంధించి కూడబెట్టిన ఆస్తులను విపరీత లెక్కలు వేస్తు చూపుతూ తాను చేసిన నేరాలకు ఎవర్ని బాధ్యులను చేయడానికి ఈ సిట్ డ్రామా? ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకులను, తమకెదురు తిరిగే వారిని ఇందులో ఇరికించి చచ్చాక కూడా నయీం భయపెడుతున్నట్టు ప్రచారం చేస్తు తమ మీడియా అనుచరగణాన్ని ఉసిగొలుపుతూన్న ప్రభుత్వం ఎవరి మీద చర్య తీసుకుంటుంది? ఇవన్నీ కోర్టులలో నిలిచేవేనా? అసలు చంపాల్సి వచ్చిందెందుకో ఇప్పటికీ నోరు మెదపని హోం మంత్రి ఏం జవాబిస్తారు. ఇన్నేళ్ళు ఈ భేతాళున్ని మోసుకు తిరిగి తమ కుర్చీల కాళ్ళను విరిచేయ చూసినప్పుడు ప్రజల గోడు గుర్తొచ్చిందా? పదేళ్ళ క్రితం ఇదే నాయకులంతా మానవ అక్రమ రవాణా కేసుల్లో వున్నవారే కదా? వాటికీ ఏ చర్యాలేదు ఇప్పటికి. అప్పట్నుండి అంటకాగి ప్రజా సంఘాలను ఎదగనీయకుండా రకరకాల పేర్లతో భయపెట్టి, భయపడని వారిని తుదముట్టించేందుకు వాడుకుని ఇప్పుడు ఈ ఐ.పి.ఎస్.లు శ్రీరంగ నీతులు చెప్తారు. ఇదో తురుపు ముక్కగా దొరికింది అధికార పార్టీకి. అధికార గణాన్ని తమ కాలికింద చెప్పులా అణచి వుంచడానికి. ఈ గేం ఆఫ్ డెత్ ఎవరి కళ్ళకు గంతలు కట్టడానికి?

8, ఆగస్టు 2016, సోమవారం

రాజ్యం మరో వికృత రూపం

నయీం ఎన్ కౌంటర్ రాజ్యం వికృత రూపానికి మరో ఉదాహరణ మాత్రమే. వాడుకున్నన్నాళ్ళు వాడుకొని ప్రజా సంఘాల నేతలను దారుణంగా హత్య చేయించి ప్రజలలో భయాందోళనలను సృష్టించిన రాజ్యం తన పెంపుడు పిచ్చి కుక్కను ఇన్నాళ్ళు చంకలో ఎత్తుకు తిరిగి ఈరోజు చంపి తామేదో ఘనకార్యం సాధించినట్లు చెప్తున్నారు. నయీంను మఫ్టీలో తామే కాపలా కాస్తూ ఇన్నాళ్ళు పోషించి వారి ద్వారా తమ రియలెస్టేట్ దందా నడిపి కోట్లు కూడబెట్టుకున్న రాజకీయ నాయకులు పోలీసులు ఇంక అక్కరలేదు అనుకున్న సమయాన ఇలా హత్య చేయడం తామేదో నిజాయితీపరులమన్న ముసుగు వేసుకునేందుకు చేసిన హత్య తప్ప మరేం కాదు. ఇది మీడియాలో ఓ మూడు రోజుల వార్త తప్ప ఇంకేం కాదు. మరల మరో పిచ్చివాడితో మొదలు పెట్టొచ్చు.

హతమైన వారికి వారి కుటుంబాలకు ఇది కాస్తా ఊరట కావచ్చు కానీ రాజ్యం ఇలా చేసే పగటి హత్యలను ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్సును సమర్ధించలేను.

18, ఏప్రిల్ 2016, సోమవారం

కానుగపూల పరిమళం...


కొన్ని సాయంత్రాలు దేహం కోల్పోయిన
ఆత్మను మోసుకొస్తుంది


అడుగుల పరిధి కుంచించుకొని
ఒక మాత్ర అందని దూరంలో విసిరేయబడతావు


పహరా చుట్టూ కంచె పెరుగుతూ
నడకను నియంత్రిస్తుంది


నీలోని ప్రతి అణువును మలేరియా తిని
మెదడుకు పాకి కళ్ళను పైకెగదోస్తుంది


నిట్ట నిలువుగా వెన్నును విరిచి
కాళ్ళను చేతులను హరిస్తుంది


నీ నుదుటి మీద వెన్నెల ఓ
దు:ఖపు ముద్దుగా మెరిసి కుంగిపోతుంది


నువ్వంటావు చివరిగా ఈ ఝెండా 
భుజం మార్చుకుంటుందా అని


రవీ నువ్ నడిచినంత మేరా పరచుకున్న
ఈ కానుగ పూల పరిమళం అద్దుకుని


అటు చివర ఆ బాలుడు విల్లునలా
గురిచూస్తూ విసురుగా వస్తున్నాడు...


(మలేరియా కబళించిన  కామ్రేడ్ సి.సి.కమాండర్ రవి స్మృతిలో)

16, జనవరి 2016, శనివారం

ఆయనొక్కడే...


ఆయనలా 
తన దేహాన్నే నిరసన చిత్రంగా
ఈ దేశ కాన్వాసుపై వేసి
ఖళ్ళున ఇంత నెత్తురు ఉమ్మి పోయాడు


నువ్వూ నేను నిర్లజ్జగా ఇలా
బతుకును ఓ విరిగిన బండి చక్రంగా 
ఈడ్చుకుంటూ పోతున్నాం



తనలా విసురుగా కొన్ని పదాలు
నినాదాలుగా మార్చి అనాధ గొంతులో
స్వరాలుగా యిచ్చి పోయాడు



ఆయనొక్కడే 
అలిసెట్టి ప్రభాకరుడు
కోటి వెతల క్రోధాగ్ని జ్వాల అతడు
బతుకునొక నిప్పుల గుండంగా వెలిగించి చూపినవాడు



నొ
క్క
డే
నెత్తురు చిమ్మిన కుంచె చివరంటా జ్చలించిన వాడు


(అలిసెట్టి ప్రభాకర్ స్మృతిలో)
(12-01-2016)

10, ఏప్రిల్ 2015, శుక్రవారం

దగ్గర్లోనే...


ఇప్పుడంతా సముద్రం
ఇంకిపోయిందని సంబరాలు 
చేసుకుంటున్నారు!


వెటకారపు నవ్వులతో చూపులతో
వెకిలి చేష్టలతో అంతా అయిపోయిందని
గెంతులేస్తున్నారు!


అడిగేవారే లేరని
అడవితో పాటుగా నగరంలోనూ
విరుచుకుపడుతున్నారు!


కన్నాభిరాన్ లేడూ బాలగోపాల్ లేడూ
హెబియస్ కార్పస్ పిటిషన్ లేదూ
లాకప్లో చంపినా దిక్కులేదు వీళ్ళకని!


కానీ నీ నేల కింద 
సముద్రం కుతకుతలాడుతూ 
జనం సునామీలా ఎగసిపడే రోజు దగ్గర్లోనే!!