దృక్పథం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దృక్పథం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, జూన్ 2012, శుక్రవారం

భూమి - దళితులు-ఆత్మగౌరవం..



భూమి - దళితులు-ఆత్మగౌరవం

శ్రీకాకుళం మళ్ళీ నెత్తుటి గుడ్డు అయ్యింది. కారంచేడు, చుండూరు, పదిరికుప్పం, వేంపెంట సంఘటనల తరువాత నేడు లక్ష్మిపేటలో దళితులపై జరిగిన అమానుష దాడి నాలుగు నిండు ప్రాణాలును బలిగొంటూ మనముందు అనేక ప్రశ్నలను వుంచింది. హత్యల వెనక కులం, రాజకీయ, ఆర్థిక కారణాలతో పాటుగా ప్రధానంగా దేశ అస్తిత్వ సమస్య అయిన భూమి వుంది.

సెంటు భూమిలేని దళితుల అస్తిత్వ పోరాటానికి సాక్ష్యం ఇది.

ప్రాంతంలోని సువర్ణముఖి, వేగావతి నదీ సంగమ ప్రాంతం మడ్డువలస దగ్గర నిర్మించిన ప్రాజెక్టు కింద వేలాది ఎకరాల పంట భూములు, గ్రామాలు నష్టపోయి అప్పటి అర కొర ప్యాకేజీలతో పొట్ట చేత పట్టుకొని చెట్టుకొకరు పుట్టకొకరైన వారే ఎక్కువగా వున్న ప్రాంతంలో ప్రభుత్వం యిచ్చిన నిర్వాసిత స్థలంలో ఇల్లు నిర్మించుకొని వున్న వాళ్ళలో కొట్టిశ, లక్ష్మిపేట గ్రామాల ప్రజలు వున్నారు. రెండు గ్రామాలు వంగర మండల పరిథిలో వున్నాయి. ఇందులో లక్ష్మిపేట గ్రామంలో 60 ఇల్లు దళితులలోని మాల వర్గానికి చెందినవి. మిగిలిన 80 ఇల్లు బి.సి. కాపు కులానికి చెందినవి. వీరంతా తమ పాత గ్రామం విడిచిపెట్టి వచ్చి ఇక్కడ కొత్తగా చేరినవారే. గ్రామం చుట్టు పరచుకొని వున్న 240ఎకరాల వ్యవసాయ భూమి బి.సి.వాళ్ళది. దీనికి ప్రభుత్వం కాంపన్సేషన్ చెల్లించి వేసింది. అయినా ఇది ముంపు పరిథి దాటి వుండడంతో ఇందులో 180 ఎకరాలు బి.సి.లు 60 ఎకరాలు మాలకులస్తులు సాగు చేసుకుంటూ వస్తున్నారు. భూమి తమదే కాబట్టి అరవై ఎకరాలు కూడా తమకే చెందాలని కాపువర్గం దళితులపై వత్తిడి తేవడంతో వారంతా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. మొత్తం భూమికి గవర్నమెంటు నష్టపరిహారం చెల్లించివున్నందున అది ప్రభుత్వ స్వాధీనంలో వున్నట్టే. దీనిపై ఎవరికీ హక్కులుండవు కాబట్టి దీనిని సరిఅయిన రీతిలో ఇరు వర్గాలను కూచోబెట్టి పంపిణీ చేసి వుంటే అసలు ఈరోజు ఇంత దారుణం జరిగి వుండేది కాదు.

న్యాయస్థానాన్ని ఇరువర్గాలు ఆశ్రయించడంతో మొత్తం భూమిపై స్టే ఆర్డరిస్తూ ఎవరూ సాగు చేయకుండా ఆదేశాలిచ్చింది. ఇది బి.సి.లకు పుండు మీద కారంలా మారింది. గతంలో తమ సాగులో వున్న భూమిపై హక్కు తాము దళితులు అడగడం కారణంగా కోల్పోయామని వారు భావించడం, అందుకు బి.సి వర్గానికి చెందిన మాజీ ఎం.పి.పి. బొత్స వాసుదేవ నాయుడు తమ అధికార పార్టీ అండతో ప్రభుత్వాధికారుల అవినీతి అలసత్వాలను సొమ్ము చేసుకొంటూ సమస్యను తెగనీయకుండా చేస్తూ ఇరువర్గాలను రెచ్చగొట్టి తన రాజకీయ పలుకుబడిని పెంచుకునే ఎత్తుగడలో భాగంగా సమస్యను జఠిలం చేయడంలో ప్రధాన పాత్ర వహించాడు. దీనికి వత్తాసుగా మంత్రులు బొత్స సత్యనారాయణ, కోండ్రు మురళిలు కొమ్ము కాయడంతో ఎన్నాళ్ళుగానో రగులుతున్న తమ కక్షను, పగను తీర్చుకునేందుకు ఉప ఎన్నికల సందర్భాన్ని (12-6-12) వాడుకున్నారు బి.సి.లు. గ్రామంలో గత ఆర్నెళ్ళుగా కొనసాగుతున్న పోలీసు పికెట్లోని వారు ఎన్నికల డ్యూటీకి వెళ్ళిన వేళ దళితులంతా ఉదయం చద్దన్నం తినడానికి ఇంట్లో వున్న సమయంలో కత్తులు, బాంబులు, రాళ్ళతో కాపు వర్గానికి చెందిన ఆడా మగా పిల్లలతో సహా వారిపై దాడి చేసి ఇంట్లోంచి ముంగిటకు లాక్కొని వచ్చి వారిని అతి దారుణంగా కొట్టి చంపారు. వారి వృషణాలపై రాళ్ళతో కొట్టి చంపడం ఇక్కడ వారి పట్ల వున్న కసి పగను తెలియజేస్తోంది. దాడిలో దళితులైన బూరాడ సుందరరావు, చిట్టి అప్పడు, తండ్రీ కొడుకులైన నెవర్తి వెంకటి, నెవర్తి సంగమేసులు చనిపోయారు.

రాయలసీమ, పల్నాడు ప్రాంతంలోని బాంబుల సంస్కృతిని ఇక్కడ కూడా ప్రవేశ పెట్టిన ఘనత మంత్రి బొత్సకు దక్కిందని అంతా అంటున్నారు. ఇంత దారుణంగా దళితులపై దాడులు జరిగి హత్యచేయబడి, 20 మందికి పైగా గాయాలపాలై అందులో మరి కొంతమంది చావు బతుకుల మధ్య కొట్టుకుంటుంటే కనీసం ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించలేదు. అలాగే కంటి తుడుపు చర్యగా ముఖ్యమంత్రి ప్రకటించిన నష్టపరిహారం పై కూడా సరైన ఆదేశాలు రాకపోవడం దళితులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. దీంతో రాష్ట్ర ఎం.ఆర్.పి.ఎస్.అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మరికొంత మంది దళిత నాయకులు, రాజకీయ పార్టీల వారు చనిపోయిన మృతదేహాలను ఖననం చేయకుండా మూడురోజులుగా పోరాటం చేయడంతో కదలిన అధికార యంత్రాంగం భూమిలో దళితులకు ఎకరా చొప్పున ఇవ్వడానికి అలాగే దాడికి పాల్పడిన వారిపై చర్యలకు హామీలివ్వడంతో ఈరోజు (14-6-12) సాయంత్రం ఖననం చేసారు.

దళిత హత్యాకాండ, దాడి సంఘటనకు ప్రధానంగా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం బాధ్యత వహించాలి. అలాగే స్థానిక రాజకీయ నాయకులు తమ అగ్రకుల అధికార మదంతో దళితులను భయభ్రాంతులను చేసి వారిని ఊరినుండి తరిమి కొట్టడం ద్వారా మొత్తం ప్రభుత్వాధీనంలోకి పోయిన భూమిపై తామే హక్కును కైవసం చేసుకోవాలన్న పక్కా ప్రణాళిక వుంది. దేశంలోని కులం, వర్గం యొక్క స్వభావానికి మరో తార్కాణం లక్ష్మిపేట దళితులపై జరిగిన దాడి. దీని యొక్క సామాజిక, రాజకీయార్థిక మూలాలను అర్థం చేసుకోవాల్సి వుంది. బలహీన వర్గాలకు కులమొక్కటే ఆత్మగౌరవ సమస్యగా ఉద్యమాలు చేయడం కాకుండా వారికి ఆర్థిక పరమైన ఆసరా, హక్కును కల్పించే భూమి ప్రధాన సమస్యగా ముందుకు తీసుకు రావాల్సిన అవసరాన్ని లక్ష్మిపేట ఊచకోత తెలియజేస్తోంది.

2, జులై 2010, శుక్రవారం

మరో కట్టు కథ



మావోయిస్టు అగ్రనేత చెరుకూరి రాజ్ కుమార్ @ అజాద్ తెల్లవారుఝామున ఎదురుకాల్పులలొ చనిపోయాడన్న మరో కట్టుకథ ఈ రోజు ప్రచారమవుతోంది. ఎదురుకాల్పులు జరిగితే ఎలావుంటుందో చతీస్ఘడ్, ఝార్ఖండ్ లలో అనుభవమవుతోంది. అయినా పాతిక మంది మావోయిస్టులుతో ఆదిలాబాద్ అడవుల్లో కాల్పులు జరిగితే ఒక్క పోలీసుకు గాయంకాకుండా సురక్షితంగా ఎలా బయటపడ్డారు. ఇంతకంటే పెద్ద జోక్ వుంటుందా? మీడియాముందు మాటాడడానికైనా సిగ్గు పడడంలేదు.

ఓవైపు చర్చలకు ఆహ్వానిస్తున్న హోంమంత్రి ఇలా తమకు దొరికిన మేధావివర్గాన్ని హత్యచేసే బదులు వారితో మాటాడితే సమస్య పట్ల సానుకూల వైఖరికి రావొచ్చుకదా? ఒకవైపు ఆపరేషన్ సాగుతూ మరోవైపు చర్చలంటూ మభ్యపెట్టడం ఏం ప్రజాస్వామ్యం? తీవ్రమైన సమస్యగా గుర్తించినప్పుడు దానికి ఓ పరిష్కార మార్గం కోసం ప్రయత్నిస్తున్న నిజాయితీ వుంటే ఇలా సీనియర్ నేతలు దొరికినప్పుడు వారిని అరెస్టు చూపించి అయినా వారితో మాటాడడం వలన ఉపయోగం వుంటుంది. అంతే కానీ చంపుతూ పోతే మరింత మంది ఆజాద్ లు వస్తూనే వుంటారు కానీ సమస్య పరిష్కారం కాదు. ఎవరు ఔననా కాదన్నా వాళ్ళు ఈ దేశంలో ఓ ప్రధాన రాజకీయ స్రవంతికి ప్రతినిధులు. సుమారుగా దేశంలో సగానికి పైగా జిల్లాల్లో ప్రజలను ప్రభావితం చేస్తున్న వాళ్ళు. వారి నాయకత్వాన్ని మట్టుబెట్ట చూడడం వలన అది సమసిపోదు. ఇది చరిత్ర చెపుతున్న సత్యం. ఇప్పటికి గత కొంత కాలంగా ఆ స్థాయి నాయకులను 10 మందికి పైగా చంపినా సమస్య మరింత జఠిలమవుతోందే తప్ప పరిష్కారం వైపు కనుచూపు మేరలో కానరావడం లేదు. కావున ఇది ముమ్మాటికీ పాలకవర్గం కోల్పోయిన ఓ మంచి అవకాశం. ప్రజల సమస్యలపట్ల చిత్తశుద్ధిలేమి వెల్లడవుతోంది.
http://www.ndtv.com/article/india/andhra-pradesh-top-2-maoist-leaders-killed-in-encounter-35061