23, నవంబర్ 2009, సోమవారం

పౌరహక్కుల పురుషోత్తంనకు జోహార్లు

సరిగా తొమ్మిది సం. క్రితం ఇదే రోజు శ్రీకాకుళం ప్రాంతంలో అరెస్టయిన కామ్రేడ్ల గురించి పది గంటల ప్రాంతంలోకా.పురుషోత్తంకు ఫోన్ చేసి చెప్పాను. తరువాత కా.వరవరరావు గారికి అదే విషయమై చెప్పాను. వెంటనే ఎలక్ట్రానిక్ మీడియావారికి ఇద్దరు ఫోన్ చేసి చెప్పారు. గంట తరువాత ఇంట్లో అవసరమైన వస్తువుల కోసం తమ ఇంటి ముందరికిరాణా షాపులో కొనుక్కుందామని బయటకు వచ్చిన కామ్రేడ్ని పోలీసు మాఫియా ముఠా తల్వార్లతో దాడిచేసి నరికిచంపారు. ఇదంతా ప్రజలంతా చూస్తుండగానే హత్యచేసిన వాళ్లు తాము వచ్చిన తెల్ల టాటా సుమోలో తాపీగాపరారయ్యారు. హత్య జరిగి పదిహేను నిముషాలైనా జరగకుండానే పోలీసు జాగిలాలతో రంగారెడ్డి జిల్లా ఎస్.పి. సురే౦ద్రబాబు హాజరు. అంత తొ౦దరగా సార్లకు ఎలా తెలిసి౦దో ఎవరికీ అర్ధం కాలేదు. హడావిడిగా శవాన్ని మార్చురీకి తరలించే వాళ్ళను తన సహచరి జ్యోతి అడ్డుకొంది. తన భర్త శవం దగ్గర ఏడ్వనివ్వండి అని వేడుకొంది. వినని పోలీసులపై చెప్పుతో కొట్టింది. దుమ్మెత్తిపోసింది. కొంతమంది పోలీసులు జ్యోతిని కదలకుండా పట్టుకుంటే కనీసం శవపంచనామా జరపకుండానే పోస్టుమార్టంకు తరలించారు. రక్తం మరకలను పోలీసులు కడిగివేయబోగా అడ్డుకుంది. కోడిపిల్లను గద్ద తన్నుకుపోయినట్లు హత్య జరిగిన పావుగంటలో వాలిన పోలీసులను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. హత్య జరుగుతుందని ముందుగా తెలియకపోతే వారు ఆ స్థలానికి అంత తొందరగా ఎవరూ చెప్పకుండానే ఎలా చేరుకోగలిగారు?

ఎనబై ఐదులో పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.రామనాధంను, ఎనబై ఆరులో కరీంనగర్ జిల్ల అధ్యక్షులు జాపా లక్ష్మారెడ్డిని, తొంభై ఒకటిలో వరంగల్ జిల్లా కార్యదర్శి న్యాయవాది నఱా ప్రభాకర రెడ్డిని పోలీసులు తామే ప్రత్యక్షంగా కాల్చి హత్య చేసి హంతకులుగా ప్రజల అసహ్యానికి గురయ్యారు. దీని నుండి తప్పించుకోవడానికి లొంగిపోయిన మాజీ నక్సలైట్లను చేరదీసి, వారికి ఆయుధాలు, వాహనాలు సమకూర్చి, విచ్చలవిడిగా డబ్బులిచ్చి హంతక ముఠాలుగా ఏర్పరిచి ప్రజా సంఘాల నాయకులను హత్య చేసేందుకుపయోగిస్తున్నారు. కాశ్మీరులో, అస్సాంలో ప్రభుత్వాలు ప్రైవేటు హంతకముఠాల ద్వారా పౌరహక్కుల నాయకులను హత్యచేయించడాన్ని గమనించి అదే విధంగా మన రాష్ట్రంలో కూడా పురుషోత్తంను, ప్రజా గాయకురాలు బెల్లి లలితను, ఉపాధ్యాయ సంఘ బాధ్యుడు కనకాచారిని మరకొంతమంది ప్రజా సంఘ నాయకులను గ్రీన్ టైగర్స్, బ్లూటైగర్స్ పేరుతో హత్యచేయించారు. ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురిచేయడానికి వారిళ్ళపై దాడులు చేయడానికి, ఫోన్లలో బెదిరించడానికి, కిడ్నాప్ లు చేయడానికి వీరిని వినియోగించారు. ఇందులో కత్తుల సమ్మయ్య అనే వాడిని శ్రీలంకలో దాచేందుకు విమానంలో తరలిస్తుండగా ప్రమాదవశాత్తు చనిపోవడంతో రాజ్యం నైజం బయటపడి ప్రజల అసహ్యానికి గురయ్యారు.

పురుషోత్తం తన చివరి శ్వాస వరకు రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడారు. బాలగోపాల్ ఏ.పి.సి.ఎల్.సి.ని వీడిన తరువాత తానే రాష్ట్ర మంతా పర్యటించి హక్కుల ఉద్యమాన్ని ముందుకు నడిపారు. న్యాయవాదిగా కోర్టులలో ప్రజల పక్షాన నిరంతర పోరాటం చేసారు. పాలమూరుజిల్లా ఐజ మండలం చినతాండ్రపాడు గ్రామంలో ఒక మామూలు మద్యతరగతి కరణం కుటుంబంలో అరవై ఒకటో సంలో జన్మించాడు. స్వాతంత్ర్య సమరయోధులు సీతారామారావు, రామ సుబ్బమ్మలకు నాల్గవ సంతానం. సాంప్రదాయ బ్రాహ్మణాచారలను తండ్రి నేర్పజూసినా తన దగ్గర అలానే వుండి పూజలు చేసేవాడు. కానీ తన చిన్న నాటి ఇతర కులాల పిల్లలతో కలిసి భోంచేసేవాడు. వారి ఎంగిలి ప్లేట్లను తానే కడిగేవాడు.

ఆయనకు తల్లిదండ్రులంటే అమితమైన ప్రేమ. బాగా చదువుకొని ఉద్యోగంచేసి వారిని సుఖపెట్టాలనుకునేవాడు. గద్వాలలో ఇంటర్మీడియేట్ చదివే రోజుల్లో స్నేహితులంతా విప్లవరాజకీయాలు మాట్లాడుతుంటే దూరంగా వుండి తన చదువు తాను చదువుకునేవాడు. ఎనభైలో బి.ఎస్సీ.లో చేరేనాటికి డిగ్రీ కాలేజీలో రాజకీయాలు ఊపందుకున్నాయి. అదే సం. డిసెంబరు నాలుగున ఆర్.టి.సి. బస్సు చార్జీల పెంపునకు నిరసనగా ఆందోళన చేసిన విద్యార్దులపై పోలీసుల కాల్పుల కారణంగా పది సం.ల బాలుడు చనిపోయాడు. అనేకమంది గాయపడ్డడంతో చలించిపోయిన పురుషోత్తం ఇతర విద్యార్ధులతో కలిసి పోలీసు స్టేషన్ తగలబెట్టె కార్యక్రమంలో పాల్గొన్నాడు. అప్పటినుండి రాడికల్ విద్యార్ధి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు. పాలమూరు ప్రజల పోరులో భాగంగా ఆయుధం పట్టాడు. తరువాత ఎనబై ఏడులో తిరిగి డిగ్రీ చదువు మొదలుపెట్టి పూర్తుచేసాడు. తరువాత పేదవిద్యార్దులకు తన గ్రామంలో ఉచితంగా విద్య నేర్పే స్కూలు నడిపాడు. బి.ఇడి.పూర్తిచేసాడు. గ్రామీణ ప్రాంత విలేకరిగా పనిచేసాడు. తరువాత న్యాయవాద విద్య పూర్తిచేసి న్యాయవాదిగా పేదల పక్షాన పోరాటం మొదలుపెట్టి పౌరహక్కుల సంఘంలో చేరాడు. అణచివేత దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడే ఉద్యమకారులను బూటకపు ఎన్ కౌంటర్ల పేరుతో హత్య చేస్తూ వారి శవాలను కూడా కుటుంబ సభ్యులకివ్వని రాజ్యహింసకు వ్యతిరేకంగా శవాల స్వాధీన కమిటీ పేరుతో గద్దర్ తోను, ఇతర ప్రజా సంఘాల వారితో ఉద్యమాన్ని నడిపాడు. రాజ్య హింసకు వ్యతిరేకంగానే కాకుండా సమాజంలో ప్రజలను అణచివేస్తున్న ఆధిపత్య వ్యవస్థలన్నిటికీ వ్యతిరేకంగా ఒక పౌరహక్కుల నాయకుడుగా ఉద్యమాలు నడపడంలో కృషిచేశాడు.

ఇంతలా తమ పక్కలో బల్లెంలా తయారయిన పౌరహక్కుల నాయకుడిని హత్య చేయడానికి కుట్ర చేసిన పోలీసులు, ప్రభుత్వమే పురుషోత్తం హత్యకు బాధ్యత వహించాలి. కా.పురుషోత్తం ఆచరణ, ఆశయాలు ప్రజల పక్షాన పోరాడే వారికి మార్గదర్శకాలు. అమర్ రహే కా. పురుషోత్తం.


2 కామెంట్‌లు:

  1. చాలా మనసుకి హత్తుకునేలా చెప్పారు. కాని ఉద్యమం మొదలైన కొత్తల్లో ఉన్నా పట్టు ఇప్పుడు లేదని ఒక వాదన వింటున్నాను. కరక్టేనా. ఒకప్పుడు బాగా విద్యావంతులు చేరే వారని ఇప్పుడు అల కాదని అంటారు. నిజమేనా

    రిప్లయితొలగించండి
  2. నిర్బంధ దినాలలో బయటకు అలానే కనిపిస్తుంది. విద్యావంతులు చేరకపోవడమంటూ లేదు. ప్రజా సంఘాలలో పనిచేస్తున్నవారు విద్యావంతులు కారా? ప్రస్తుత పరిస్తితులలొ ఏదో ఒక రూపంలో ఉద్యమానికి సహకరిస్తూనే వున్నారు. మీడియాకు కనబడని రూపంలో జరుగుతుంది కాబట్టి ఇలాంటి భావాలు ప్రచారంలో వుంటాయి. చర్చల సమయంలో ఎంతమంది స్వేచ్చగా మాటాడారో గుర్తుచేసుకోండి. మధ్య తరగతి బుద్ధి జీవులు తమ చేతికి మట్టి అంటకుండా పని జరుపుకో జూస్తారు కాబట్టి ఇలా అంటూంటారు.

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..