29, నవంబర్ 2009, ఆదివారం

తెలంగాణా పాలస్తీనా కానున్నదా ?

ఈ రోజు కె.సీ.ఆర్. ఆమరణ దీక్షకు కూచున్నట్లుగా ఈ దేశ రాష్ట్రపతిని, ప్రధాన మంత్రిని, ఈ రాష్ట్ర గవర్నర్ ను, ముఖ్యమంత్రిని కలిసి నెల రోజులు ముందుగానే శాంతియుతంగా నిరసన తెలియజేసే అవకాశం కల్పించమని కోరి పూనుకున్నా ఆయనకు ఆ అవకాశం కల్పించకపోవడం అప్రజాస్వామికం. ఆయన కెరీర్ లో తప్పులు చేసి వుండవచ్చు. కానీ తెలంగాణా ఉద్యమాన్ని సజీవంగా ముందుకు తీసుకుపోతున్న వ్యక్తిగా గౌరవించాల్సిందే. ఈ మద్య కాలంలో ఏర్పరిచిన ప్రత్యేక రాష్ట్రాలేవీ ఎన్నికల ద్వారా ఏర్పాటుకాలేదు. ఆయా ప్రధాన పార్టీల బలాలను ప్రధాన ప్రాతిపదికగా చేసుకుని ఏర్పాటు చేసారు. వాటివలన ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకంగా జరిగిన నష్టం లేదు. మరి తెలంగాణా విషయంలో గత అరవై సం.లుగా వారి ప్రజాస్వామిక డిమాండ్ ను గౌరవించకుండా ఈ రాష్ట్రం ఒక రెండు కులాల వ్యాపార అడ్డాగా మార్చుకొని ప్రాంతాల మద్య సమతుల్యాన్ని దెబ్బతీస్తూ తమ స్వంత ఆస్తులు కూడబెట్టుకోవడం తప్ప రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒరగబెట్టింది లేదు. రాష్ట్రంలోని ఖనిజ సంపదను విదేశాలకు తరలించి లక్షల కోట్ల రూపాయల దొంగ సొత్తు కూడబెట్టుకున్న వారిని ఇన్నాళ్ళు వెనకేసుకొచ్చి ఈ రోజు తాము అధికారానికి దూరమై సహజ వనరుల గురించి మాటాడుతున్నారు. అవకాశమున్నప్పుడు దోపిడీకి వెనకాడని ఈ రాజకీయ రాబందులు పీక్కుతిని కళేబరాన్ని మిగిల్చిన క్రమంలో అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి.

ఉస్మానియా యూనివర్శిటీలో పడి విద్యార్థులను దొంగలను కొట్టినట్లు కొట్టి కసి తీర్చుకున్న పోలీసులకు అధికారం ఎవరిచ్చారు. వారిని ఉసిగొలిపి యూనివర్శిటీలో భయోత్పాతాన్ని సృష్టించి తద్వారా యువకుల నోరుమూయించాలని, ఉద్యమాన్ని హింసాయుతంగా మార్చి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించ జూస్తున్న రాజకీయ దళారీల బండారాన్ని బయటపెట్టాలి.

ప్రజాస్వామ్యంగా పేర్కొంటున్న వ్యవస్థలో శాంతియుతంగా చేయతలపెట్టిన సత్యాగ్రహాన్ని ఆపాలనుకోవడం వారి నిజ స్వరూపాన్ని బయటపెడుతోంది.
యూనివర్శిటీ నుండి పోలీసులను తరిమికొట్టిన విద్యార్థుల చైతన్యం చూస్తుంటే తెలంగాణా మరో పాలస్తీనా కానున్నదా అనిపిస్తోంది. ఈ రెండింటి మద్య సారూప్యం కనిపిస్తోంది. అమెరికా అండతో ఇజ్రాయిల్ అనే దేశం ఏర్పడి తమ ప్రాంతంనుండి తరిమివేయబడిన పాలస్తీనా ప్రజలకు జరిగిన అన్యాయమే కళ్ళముందు కదలాడుతోంది.

న్యాయంగా విడిపోయే హక్కును గౌరవించి వారి ప్రజాస్వామిక డిమాండును అంగీకరించడమే అందరి కోరిక కావాలని ఆశిస్తూ..

9 కామెంట్‌లు:

  1. ప్రజాస్వామ్యమా? అది మన దేశంలో ఎక్కడ ఉంది? బషీర్ బాగ్, చిన్నగంజాం, ముదిగొండ, గంగవరం, పోలేపల్లి ఇవి ప్రజాస్వామిక దేశంలోని గ్రామాలా?

    రిప్లయితొలగించండి
  2. Had he continued with the hunger strike, KCR would've made a big fool out of himself at the end of the day. Instead, the Govt made him a martyr! కేసీయార్ కోరుకున్నదే ప్రభుత్వం చేసింది. ఆయన్ని సుబ్బరంగా నిరాహార దీక్షకి కూర్చోనిస్తే కడుపు మాడి సాయంత్రానికే ఆపేసుండేవాడు (ఆల్రెడీ ఒకసారి ఢిల్లీలో ఆ పని చేశాడు కదా). ఎక్కడ దీక్ష చెయ్యాల్సొస్తుందో అని బిక్కు బిక్కుమంటూ ఉన్నోడికి ప్రభుత్వం తీసుకున్న దుందుడుకు చర్యతో నెత్తిన పాలు కుమ్మరించినట్లయింది. ఈ దెబ్బతో జనం దాదాపు మర్చిపోయిన కేసీయార్ మరో నాలుగైదు నెలలు వార్తల్లో నలగటం ఖాయం.

    రిప్లయితొలగించండి
  3. కె.సీ.ఆర్. తప్పులు చేసి వుండవచ్చు. కానీ తెలంగాణా ఉద్యమాన్ని సజీవంగా ముందుకు తీసుకుపోతున్న వ్యక్తిగా గౌరవించాల్సిందే. <<<<

    బాగా చెప్పారు.
    ప్రత్యేక తెలంగాణా వ్యతిరేకుల వద్ద ఆ అంశాన్ని లోతుగా , చారిత్రిక వాస్తవాలతో చర్చించే నిజాయితీ లేదు. వాళ్ళు వాస్తవాలను అధ్యయనం చెయ్యరు. పక్షపాత ధోరణి లేకుండా సమస్యను సమగ్రంగా విశ్లేషిం చరు.

    ఎక్కడ అన్యాయం జరుగుతోంది, సమస్యకు మూలాలేమిటి, తెలంగాణా ప్రజలు తమ రాష్ట్రం తమకు కావాలని కోరుకోవడం లో తప్పేమిటి, విడిపోతే ఎవడి కొంపలు మునిగిపోతాయి, ఓట్లకోసం ఎన్నికల ముందు మాత్రమె తెలంగాణా జపం చేసి ఆ తరవాత అ సమస్య జోలికి వెళ్ళకుండా ఏళ్ల తరబడి కమిటీలతో సొల్లు మాటలతో సాగ దీస్తూ తెలంగాణా ప్రజలను రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు ఎట్లా వంచిసున్నాయి ... ఇట్లాంటి విశాయలేమి పట్టించుకోరు. .

    కనీసం మనకు సంబంధం లేని విషయం అని నోరు మూసుకుని అయిన కూర్చోరు. కే సి ఆర్ ని టార్గెట్ చేసుకుని తెలంగాణా డిమాండ్ ని , తెలంగాణా ప్రజలకు జరుగుతున్న అన్యాయాలని తేలిగ్గా కొట్టి పారేయ్యాలని , అవహేళన చేయాలని మాత్రం ఓ తెగ ఉబలాట పడిపోతుంటారు.

    ఇప్పటికైనా... ఇంకా అనవసరపు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ... వ్యక్తిగత రాజకీయ, వ్యాపార స్వప్రయోజనాలు లేని ఆంద్ర సోదరులు సోదరీమణులు కే సి ఆర్ ని కాసేపు మరచిపోయి ఈ సమస్య మూలాల ను, తెలంగాణా ప్రజల ఆవేదనను అర్ధం చేసుకునేందుకు 1948 నాటి నిజాం వ్యతిరేక తెలంగాణా సాయుధ పోరాటం నాటి లాగా ఈనాటి తెలంగాణా ప్రజా పోరాటానికి మద్దతు తెలిపేందుకు ప్రయత్నించాలి.

    ఆంద్ర రాయల సీమ ప్రజలు వర్ధిల్లాలి.
    తెలంగాణా ప్రజలు వర్ధిల్లాలి.
    గతం లో లాగా తిరిగి రెండు రాష్టాలుగా విడిపోయినా ప్రపంచంలోని దాదాపు ౧౮ కోట్ల తెలుగు ప్రజలంతా మానసికంగా ఒక్కటై వర్ధిల్లాలి !

    రిప్లయితొలగించండి
  4. సరిగ్గా చెప్పారు. కొంతమంది చేసిన దానికి తెలంగాణా ప్రాంతంలోని ప్రజలు ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తాన్ని ద్వేషిస్తున్నారు. తాము మాట్లాడే భాషను కించపరుస్తున్నారు అంటున్నారు.నిజానికి అలా చేసే వాళ్ళు చాలా తక్కువమంది. తెలంగాణా ఏర్పాటు విషయంలో కెసీఆర్ నిబద్ధత నాకు ప్రశ్నార్ధకం. గతిలేని పరిస్థితులలో అతనికి మద్దతు ఇస్తున్నారు. ఇక్కడ చాలా మందికి కోస్తా ప్రాంతంపై అకారణ ద్వేషం ఉంది. నావరకు తెలంగాణా ప్రజల కోరిక మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా పర్వాలేదు.

    రిప్లయితొలగించండి
  5. ఉస్మానియా యూనివర్శిటీలో పడి విద్యార్థులను దొంగలను కొట్టినట్లు కొట్టి కసి తీర్చుకున్న పోలీసులకు అధికారం ఎవరిచ్చారు. వారిని ఉసిగొలిపి యూనివర్శిటీలో భయోత్పాతాన్ని సృష్టించి తద్వారా యువకుల నోరుమూయించాలని, ఉద్యమాన్ని హింసాయుతంగా మార్చి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించ జూస్తున్న
    కాలేజి పిల్లలు చాలామందిని పోలీసులు కొట్టడం ఎంతో రాక్షసత్వం. అదేమిటండి. గొడ్డును బాదినట్లు చిన్న పిల్లలను బాడు తున్నారు వీళ్ళు పోలిసుల యమ దుతలా

    రిప్లయితొలగించండి
  6. రమాగారూ కనీసం లాఠీ ఎత్తినప్పుడైనా వారి ముఖాలల్లో వాళ్ళ పిల్లల ముఖం కనిపించనంత కౄరంగా తయారయ్యారు. అంత ఉద్యోగ కార్యోన్ముఖులా వీరు? అడిగే వారు లేరనే వీరి విఱవీగుడు.

    రిప్లయితొలగించండి
  7. ప్రభాకర మందార మీ సహస్పందనకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. కార్తీక్ రాజకీయం కానిదేది. నిజమైన రాజకీయ పరిష్కారాలకు మన సమాజం దూరమవ్వడమే నేటి దుస్థితికి మూల కారణం. ప్రతిదానికి పోలీసుల మీద అధారపడడం వలన సమస్య పక్కదారి పడుతోంది.

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..