23, ఫిబ్రవరి 2011, బుధవారం

మరో కుట్రను కప్పిపుచ్చే తీర్పు



గోధ్రా దుర్ఘటన వెనక కుట్రను అంగీకరిస్తూనే ప్రధాన నిందితున్ని నిర్దోషిగా, మరికొంతమందిని సాక్ష్యాల సాకుతో విడిచిపెట్టడం, అసలు ఈ దుర్ఘటన వెనక ప్రధాన కుట్రదారుడు హాయిగా సింహాసనంపై ఎంజాయ్ చేయడం చూస్తుంటే వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూచుంటే మనకేమి అన్న చందాన తయారైన న్యాయవ్యవస్థను చూస్తూ మన కళ్ళను మనమే పొడుచుకోవాలి..

గుజరాత్ లో నాటి పోటా చట్టం కింద నమోదైన కేసులోని నూటా ముప్పైనాలుగు మంది నిందితులలో చిన్నపిల్లలను కూడా కలిపి మొత్తమ్మీద ఈ దారుణాన్ని అంటగట్టే ప్రయత్నం చేసారు. అలాగే ఇంతమంది కలిసి చేసిన కుట్రగా అంగీకరిస్తున్న న్యాయస్థానం అసలు కుట్ర ఎలా జరిగిందో వివరించాల్సిన అవసరముంది. ఆ రైలు బోగీలో జరుగుతున్న అఘాయిత్యాన్ని అడ్డుకునే క్రమంలో జరిగిన సంఘటనగా చూసినా ఇది అప్పటికప్పుడు ఎలా రూపుదిద్దుకున్నదో బయటపేట్టాలి. వెంటనే సంఘటన జరిగిన భోగీని సందర్శించగలిగిన గుజరాత్ సి.ఎం. గారు బెస్ట్ బేకరీ దారుణ మారణ కాండ జరిగిన ప్రాంతాన్ని సందర్శించకపోవడం ఎలా ప్రజాస్వామ్యబద్ధం. అది ఆయన పరిపాలనా ప్రాంతం కాదా. లేక వాళ్ళు తమ పౌరులు కాదనుకున్నారా? అంటే మొత్తంగా గుజరాత్ దారుణ మారణకాండ వెనక వున్నది తనేనని ప్రస్ఫుటం చేయడం ద్వారా తాను హిందూ మతోద్ధారకుడిగా, నాయకుడిగా గుర్తింపబడడానికేనా?

ఈ దుర్ఘటన జరిగిన నేపథ్యం గురించి తెలుసుకోవాల్సిన జస్టిస్ నానావతి కమీషన్ అసలు దోషులను దాచిపెట్టేందుకే కృషి చేసినట్లుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా చేసిందేమీ లేదు. ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేందుకు తద్వారా తమ పైశాచిక కృత్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ దుర్ఘటనను సాకుగా చూపి సుమారు రెండువేల మంది ముస్లిం ప్రజల మాన ప్రాణాలు హరించి, వందల కోట్ల ఆస్తులను హరించి వేసి తమ ఫాసిస్ట్ పరిపాలనను సాగించడానికి వాడుకున్న అసలు నిందితులు తప్పించుకు తిరుగుతుండటం ఘోరం.. ఇది న్యాయ, పరిపాలనా వ్యవస్థల వైఫల్యమే.. మరణించిన కరసేవకుల కుటుంబాలకు జరిగిన అన్యాయం పూడ్చలేనిది. ఈ దారుణ రాక్షస యజ్న౦లో సమిధలైన వారి పట్ల సానుభూతి మాత్రమే వ్యక్తం చేయగల నిస్సహాయులమైపోయాం. మొత్తమ్మీద అధికార యంత్రాంగానికి ఊడిగం చేస్తూ తరిస్తున్న న్యాయవ్యవస్థనుండి ఇంతకంటే ఏం ఆశించగలం..

ఇక్కడ ఈ తీర్పుపై ఓ వ్యాసం.చదవండి

1 కామెంట్‌:

ఆలోచనాత్మకంగా..