21, మే 2010, శుక్రవారం

అమెరికా జైల్లో మగ్గుతున్న ఓ తెలుగు యువకుడి తండ్రి ఆవేదన



మన దేశానికి రక్షణ కల్పించే నావికాదళంలో ఇరవై ఎనిమిదేళ్ళు సేవలు అందించాను. హైకోర్టు సుప్రీంకోర్టులలో లాయర్ గా ఎన్నో కేసులను స్వయంగా వాదించాను. కానీ, మూడేళ్ళూగా జైల్లో నలిగిపోతున్న నా కొడుకును మాత్రం బయటికి తీసుకురాలేకపోతున్నా. ఏ పాపమూ ఎరుగని నా బిడ్డ బలిపశువుగా మారాడని తెలిసి, నేను చేయని ప్రయత్నం లేదు. పగలనక, రాత్రనక, తిండీతిప్పలు మానుకొని పోరాటం సాగిస్తున్నా రవ్వంత కనికరం కలుగలేదు. అమెరికా ప్రభుత్వానికి. "స్వేచ్చకు చిహ్నంగా లిబర్టీ విగ్రహాన్ని నెత్తినపెట్టుకున్న అమెరికా" ఏ తప్పూ చేయని ఓ తెలుగువాడిని ఇనుప ఊచల్లో బంధించడం ఏ స్వేచ్చకు నిదర్శనం? హక్కుల గురించి అన్ని దేశాలకు పాఠాలు చెప్ప్టే అమెరికా.. అభాగ్యుల నోరుకుట్టేయడం ఏ హక్కుల పరిరక్షణ కిందికి వస్తుంది? చట్టం శిక్ష వేయకున్నా.. కేవలం విచారణ పేరుతోనే మూడేళ్ళూ జైల్లో పెట్టి.. మా కుటుంబాన్ని ముప్పుతిప్పలు పెట్టడం ఏం నీతి? ఇక్కడ నా కొడుకు జైలు పాలయ్యాడన్న బాధకంటే.. ఒక అగ్రరాజ్యం తెలుగువాడిని జైల్లో వేస్తే.. ఇదేనా మన దేశ స్పందన? ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం.. అమెరికా మీద చిన్నపాతి ఒత్తిడి కూడా తీసుకురాలేకపోవడం దురదృష్టకరం. నా కొడుకు విక్రమ్ అమెరికాలోని చికాగో జైల్లో మూడేళ్ళుగా బంధీ అయ్యాడు. రిటైరయ్యాక ప్రశాంత జీవితం గడుపుదామనుకున్న మాకు.. ఈ వేదన కమ్ముకుంది. అయినా సరే, అమెరికా చట్టాలతో కుస్తీ పడుతూ న్యాయం కోసం పోరాటం సాగిస్తూనే ఉన్నాను.

మాది ప్రకాశం జిల్లా చీరాల. నేను (బుద్ధికోట సుబ్బారావు) కాకినాడలో ఇంజినీరింగ్ చేశాను. అప్పుడే నేవీకి ఎంపికయ్యాను. పలుహోదాలతో పాతికేళ్ళు పనిచేసి కెప్టెన్ గా వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకున్నాను. ఉద్యోగంలో ఉన్నప్పుడు రెండు యుద్ధాల్లో పాల్గొన్నాను. ఐదుసార్లు వార్ మెడల్స్ వచ్చాయి. నా కష్టాన్ని గుర్తించిన బొంబే ఐఐటీ న్యూక్లియర్ టెక్నాలజీలో డాక్టరేట్ ప్రధానం చేసింది. ఇక నా భార్య శ్యామల ’ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్’ సెక్రటరీగా పనిచేశారు. ప్రస్తుతం నేను సుప్రీంకోర్టులో లాయర్ గా పనిచేస్తున్నాను. మాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక కొడుకు. అబ్బాయి పేరు విక్రమ్. ఎంతో కష్టపడి పైకొచ్చాడు. స్కూల్ డేస్ లోనే నేషనల్ టాలెంట్ స్కాలర్. బొంబే ఐఐటీలో ఎమ్మెస్సీ చేశాడు. ఆ తరువాత ౧౯౯౬ లో గణితంలో పీహెచ్ డీ చేసేందుకు అమెరికాలోని పర్దూ యూనివర్శిటీకి వెళ్ళాడు. ఎన్నొ ఆశలతో అమెరికా వెళ్ళి.. గొప్ప చదువులతో ఇండియా తిరిగొస్తాడని.. అందరు తల్లిదండ్రులలాగే మేమూ సంతోషపడ్డాం. కానీ, అమెరికా వెళ్ళడమే శాపమైంది. ౨౦౦౬లో చేయని నేరానికి అరెస్టై ఐఐటీ చదివిన మావాడు చికాగో జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. (దు:ఖంతో గొంతు పూడుకు పోతుండగా ఒక్కక్షణం ఆగారు సుబ్బారావు).

ఇదేం న్యాయం సార్ అన్నందుకు...

మాకుటుంబంలో అందరూ ఉన్నత చదువులు చదువుకున్నారు. విక్రమ్ కూడా అదే లక్శ్యంతో చదువుకున్నాడు. అమెరికాలోని పర్దూ యూనివర్శిటీలో రెండుసార్లు ’బెస్ట్ టీచింగ్’ అవార్డు అందుకున్నాడు. అలా బుద్ధిగా చదువుకుంటున్న వాడు జైలుకు వెళ్ళేందుకు ఆ యూనివర్శిటేలో జరిగిన ఓ సంఘటన కారణమైంది. ఓ రోజు.. ఎగ్జామ్స్ లో శ్వేత విద్యార్థి కాపీ కొడుతుంటే.. చూసీ చూడనట్లు వదిలేశారు యూనివర్శిటీ అధికారులు. అదే నల్లజాతి విద్యార్థి కాపీ కొడుతుంటే మాత్రం పట్టుకొని సస్పెండ్ చేశారు. విక్రమ్ అందరిలాగే చూస్తూ ఊరుకోలేకపోయాడు. "ఇదేం న్యాయం సార్. మీ చట్టంలో ఇలాగే వుందా?" అంటూ యూనివర్శిటే ప్రెసిడెంటుకు లేఖ రాశాడు. దాన్ని చదివి ఓర్వలేక విక్రమ్ ను ఎలాగైనా సరె ఇబ్బంది పెట్టాలని కాచుక్కూచున్నారు అధికారులు. కొన్ని నెలల తరువాత మరో సంఘటన జరిగింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్, లారా బుష్ లను చంపుతామంటూ యాహూ నుంచి మెయిల్ పంపించారు గుర్తుతెలియని వ్యక్తులు. వీటిని చాలా సీరియస్ గా తీసుకున్న అమెరికా వైట్ హౌస్ యంత్రాంగం.. ఈ మెయిల్స్ ఎక్కడినుంచి వచ్చాయో కనుక్కోవాలని సీక్రెట్ సర్వీస్ పోలీసులను ఆదేశించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఐపి (ఇంటర్నెట్ ప్రోటోకాల్) అడ్రస్ ఆధారంతో ఏ కంప్యూటర్ నుంచి ఈ మెయిల్ వచ్చిందో గుర్తించారు. ఇండియానాలోని పర్దూ యూనివర్శిటీలోని ఓ కంప్యూటర్ ద్వారా ఈ-మైల్ బెదిరింపు బుష్ కు వెళ్ళినట్లు నిర్ధారించుకున్నారు. సీక్రెట్ సర్వీస్ పోలీసులు యూనివర్శిటీలో యిద్దరు విద్యార్ధులను అదుపులోకి తీసుకొని వదిలేశారు. ఇదే అదనుగా భావించిన యూనివర్శిటీ అధికారులు పోలీసులకు విక్రమ్ పై లేనిపోనివి చెప్పి తను కూచునే కంప్యూటర్ నుండే మైల్ వెల్లిందని చెప్పి అరెస్టు చేయించారు. ప్రాథమిక విచారణ చేసిన పోలీసులు "విక్రమ్ వల్ల బుష్కు గానీ, అమెరికాకు కానీ ఎలాంటి ప్రమాదమూ లేదు" అంటూ రిపోర్టు రాశారు. విక్రమ్ ను కూడా అంతటితో వదిలేశారు. అంతవరకు మాకు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నాం.

కానీ యూనివర్శిటీ అధికారులు ఎలాగైనా జైల్లో పెట్టాలని పట్టుబట్టి నేరుగా బుష్ కు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే అటార్నీ జనరల్ కు చెప్పారు. కొన్ని రోజులు గడిచాక విక్రమ్ ను మళ్ళీ అరెస్టు చేసారు సీక్రెట్ పోలీసులు. మొదట్లో ఏదో చిన్న విషయమే అనుకున్నాం కానీ ఆ తర్వాత అర్థమైంది ఏదో కుట్ర జరుగుతోందని. తల్లిదండ్రులిద్దరం అరవైఏళ్ళు పైబడ్డ వాళ్ళం. ఇక్కడి నుంచి వెంటనే అమెరికాకు వెళ్ళాలంటే వీసా దొరుకుతుందా? ఎమర్జన్సీ వీసాకు దరఖాస్తు పెట్టాను. నెలరోజులకు వీసా వచ్చాక అమెరికా వెళ్ళాను. నేను ఇదివరకే లాయర్ ను కనుక అమెరికా చట్టాలను చదవడం ప్రారంభించాను. ఇంటర్నెట్ ను కేవలం వ్యక్తీకరించే హక్కుగానే పరగణిస్తుంది అక్కడి చట్టం. దానికి తోడు ’విక్రమ్ నాట్ థ్రెట్" అంటూ సీక్రెట్ సర్వీసు పోలీసులు రిపోర్టు యిచ్చారు. పర్ధూ యూనివర్శిటీ కంప్యూటర్లను అప్పటికీ చాలాసార్లు హ్యాకింగ్ చేసినట్లు ఋజువులున్నాయి. చార్జిషీటులో ఏ కారణాన్ని నమోదు చేశారు? అరెస్టు చేసేందుకు కోర్ పోయింట్ ఏమిటి? విక్రం కంప్యూటర్ నుంచి ఈ-మైయిల్ పోలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలిన విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారా? ఈ సందేహాలను నివృత్తి చేయలేదు అమెరికా పోలీసులు. ఇన్ని అనుమానాల మధ్య నా కొడుకును కోర్టులో ప్రవేశ పెట్టారు. కఠిన నిబంధనలు పెట్టారు. నేను క్రిమినల్ లాయర్ గా పనిచేశానని కోర్టు కు తెలిసి అమెరికా పోలీసులు కోర్టు లోపలికి వెళ్ళకుండా అడ్డుకున్నారు.

ఎన్నో దేశాల న్యాయశాస్త్ర రచనకు స్ఫూర్తినిచ్చిన అమెరికాలో ’ఇదేం న్యాయం’ అనుకున్నాను. ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలంటే అమెరికాలో కూడా చట్టాలను ఇలా వాడుకుంటారా? అంతలోనే వీసాగడువు ముగిసిందని నా పాస్ పోర్టు లాక్కున్నారు. ఎంతోమందిని కలిసాను. ఉత్తరాలు, ఇ-మెయిళ్ళు, వినతిపత్రాలు అందజేసాను. నాకొడుకు ఏ తప్పూ చేయలేదని విన్నవించుకున్నాను. కొందరు లాయర్లు సాయపడుతున్నారు. ఇండియాకు తిరిగొచ్చాక ప్రయత్నం చేస్తూనే వున్నాను. యూఎస్ అటార్నీ జనరల్, ప్రెసిడెంట్ ఒబామా, హిల్లరీ క్లింటన్ లకు లేఖలు రాశాను. ఈ లేఖలు వైట్ హౌస్ కు అందినట్లు అక్నాలెడ్జ్ మెంట్ లు వస్తున్నాయి కానీ, వారినుంచి సానుకూల స్పందన లేదు. మన విదేశాంగ మంత్రి ఎస్.ఎమ్.కృష్ణ గారిని కలిసి సమస్యను చెప్పుకున్నాం. నాభార్య రాష్ట్రపతి, ప్రధానమంత్రిలకు వినతిపత్రాలు పంపించారు. ఒక్కరు కూడా గట్టిగా ప్రయత్నించడంలేదు. మూడేళ్ళుగా ఓ తెలుగువాడు అమెరికా జైలులో మగ్గుతుంటే అతిపెద్ద భారత దేశం ఏమీ చేయలేకపోతోంది. ఎప్పుడు ఏ తీపి కబురు వస్తుందా అని మేమంతా వేయికళ్ళతో ఎదురుచూస్తున్నాం.

( ఆంధ్రజ్యోతి సౌజన్యంతో ప్రజాస్వేచ్చ నవంబరు-డిసెంబరు ౨౦౦౯ సంచికలో(ఇదే కొత్తది) వచ్చింది ఈ ఆర్టికల్, తనకున్న సమాచారం మేరకు నేటికీ విడుదల కాలేదని ఇప్పుడే ఆ పత్రిక వర్కింగ్ ఎడిటర్ సురేష్ కుమార్ ఫోనులో చెప్పారు)


http://justiceforvb.blogspot.com/2009/08/appeal-from-dr-buddhi-kota-subbarao.html

9 కామెంట్‌లు:

  1. its surprising. No Telugu newspaper or channel made a story on this, as far as I know. Its a very serious issue to be taken up by the Indian government.
    Ramu
    apmedikaburlu.blogspot.com

    రిప్లయితొలగించండి
  2. నేను కొన్నిసార్లు ఈ వార్తను కొన్ని నెలల క్రితమే దినపత్రికల్లో చూసాను. ఆంధ్రజ్యోతిలోనో లేక మరే పత్రికలోనో గుర్తుకులేదు.

    రిప్లయితొలగించండి
  3. నిజంగా ఇది చాలా బాధ కలిగించే విషయం. ఈ విషయం ఒక సారి మన తెలుగు మీడియాలో (వార్తా చానెల్స్ లో) వచ్చి అందరికీ తెలిస్తే అప్పటికైనా ప్రభుత్వం కొంచెం శ్రధ్ధ పెడుతుందేమో?

    రిప్లయితొలగించండి
  4. subbarao gaari email id:

    bksubbarao@gmail.com

    aayanaku mail chesi support cheyandi.

    రిప్లయితొలగించండి
  5. The Indian government did similar things to the father. He is a strong man. He studied law and survived. I hope that the son will show his father's resilence and thrive.

    రిప్లయితొలగించండి
  6. శరత్ గారూ కింద ఫుట్ నోట్ లో రాశాను సార్ ఆ విషయం. ఈ విషాదం మన తెలుగు మీడియాలో సరిగా ప్రచారం కాలేదు. తండ్రి న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఐఐటీ పట్టభదృడు. ఆయన ఇండో అమెరికన్ న్యూక్లియర్ ఒప్పందంపై డీసెంట్ నోట్ రాశారు తన బ్లాగులో. అది కూడా ఒక కారణం కావచ్చునని అనుకుంటున్నారు. Please see his writings : http://www.countercurrents.org/ind-subbarao090306.htm.

    రిప్లయితొలగించండి
  7. This is a very old news, and it has got maximum coverage in news here in USA, even back in India as well.

    I followed it regularly in local news papers here in USA both Indian Papers and local american papers too.

    As far as I know, there was a final verdict few months ago, and he got few years of sentence, a reduced one I believe. I will post more details later.

    It looks like there was some fault from Vikram. The story above is not completely true, it's a one sided version

    రిప్లయితొలగించండి
  8. కుమార్N గారు ఇది పాత న్యూస్ కావచ్చు. కానీ ఆయన విడుదల కాకపోవడం నిజమే కదా? 3సం.లుగా జైలులో వుంచినాయనపై అనుమానాలు రావడం సహజమే. ఈ విషయం విదేశాలలో ప్రాచుర్యమైనంతగా తెలుగు నేలపై కాలేదు. ఏదో జరిగివుంటుందన్న అనుమానం, పెద్దన్నను ప్రశ్నించే దమ్ములేకపోవడం కారణం కావచ్చు. షారూఖ్ ఖాన్ కు, మరికొంతమందికి అక్కడి సెక్యూరిటీ సిబ్బంది బట్టలూడదీయడం లాంటి వాటికి ఇచ్చిన ప్రాధాన్యత ఓ మనిషి జీవితాన్ని బంధిఖానా చేయడంపై జరగకపోవడం, భారతదేశ పాలక వర్గాల అమెరికా అడుగులకు మడుగులొత్తే తత్వం వలన ఇది మరుగునపడిపోయింది. ఓట్లు,నోట్లు రాలని వాటికోసం పట్టించుకునే ఓపిక మన నాయకులకు లేదు.

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..