7, మార్చి 2010, ఆదివారం

'మా కుమారి నాన వయమన్నెకీ' వెంటాడుతున్న ప్రశ్న..



'మా కుమారి నాన వయమన్నెకీ' (మా కుమారక్క వచ్చిందా?) అని దళం ఊరు చేరగానే ఎదురయ్యే ప్రశ్న. 2004 మార్చి 8 నాటినుండి వెంటాడుతున్న ప్రశ్న.
సరిగ్గా ఆరేళ్ళక్రితం ఈ దినం విజయనగరం జిల్లా సాలూరు మండలంనకు ఒరిస్సా రాష్ట్ర సరిహద్దులనానుకొని వున్న కొఠియా కొండల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో అమరురాలైన కా.కుమారి గురించి ప్రజలు మరిచిపోలేని తన ఆచరణ ద్వారా తడిఆరని జ్ఞాపకాల కొలిమిలోంచి వేసే ప్రశ్నకు జవాబు ఎవరు చెప్పగలరు.
ఓ మారుమూల గిరిజన గ్రామవాసి తమ ఊరిలో వినబడుతున్న విప్లవగీతాలపట్ల ఆకర్షితురాలై, పాటలు నేర్చుకొనే నెపంతో జట్టుకట్టి, తరువాత్తరువాత తమ గిరిజన జీవితంలోని వెతలకు మార్గం విప్లవించడంగా ఎంచుకొని పూర్తిస్తాయి కార్యకర్తగా మారిననాటినుండి వెన్నుచూపక, ప్రజలకు చేరువైన తీరు అభినందనీయం. తమ స్వంత భాషలో పలకరిస్తూ, పాట పాడే బోడెమ్మ విప్లవ జననాట్యమండలి కళాకారిణిగా మారి అమరురాలైన కుమారక్క పేరుతో ప్రజలలో కలిసిపోయిన వైనం ఆచరణాత్మకం.
తరువాత్తరువాత తన కుటుంబంపై, గ్రామ కమిటీ నాయకులపై రాజ్యం ఎంత వత్తిడిచేసినా, వారికి కౌన్సిలింగ్ పేరుతో భయపెట్టజూసినా, తను ఎంచుకున్న మార్గం గురించి వివరంగా తన గ్రామప్రజలకు ఉత్తరంద్వార తెలియజేసింది.
గ్రామాలలో ఏర్పాటు చేసే సమావేశాలలో దళంలో తను నేడున్న స్థితి, తమ గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న పురుషాధిక్యత, ఆర్థిక వెనుకబాటుతనం, కట్టుబాట్లపై తను వారి కోందుభాషలోనే వివరిస్తుంటే ప్రజలు తనతో గొంతుకలపడం మరువలేనిది.

అనతికాలంలోనే దళంలో చురుకైన పాత్రతో అందరి మన్ననలు చూరగొన్న కుమారి చంద్రబాబు కౄర అణచివేత కాలంలో శతృవు ఆంబుష్ లో చిక్కుకొని మరో యిద్దరు సహచరులతో అమరురాలు కావడం విప్లవ కళాకారులకు తీరని లోటుగా, మహిళా సాధికారత గురించి గొప్పలు చెప్పే బాబు పాలననాడు అదే మహిళాదినోత్సవం నాడు అమరురాలు కావడం విషాదం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆలోచనాత్మకంగా..