ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలను పార్లమెంటరీ రొంపిలోకి దించి, ప్రజల పోరాట కాంక్షను అణగదొక్కడానికి అన్ని విధాలుగా సాయపడిన వ్యక్తులలో మొదటివాడు జ్యోతిబసు.
డాంగే విధానాలను వ్యతిరేకించి C.P.I. వారిని రివిజనిస్టులుగా, ఇందిరా గాంధీ అనుయాయులుగా ముద్రవేసి తాము బయటకు వచ్చిన కొద్ది రోజులకే అదే రివిజనిస్టు పంథా, పార్లమెంటరీ మార్గంలో పార్టీ శ్రేణులను నడిపిన ఘనత C.P.M. నాయకత్వానిదే. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఆదినుండి నడిపించిన జ్యోతిబసు నయా రివిజనిస్టే.
ఈ దేశంలో ప్రజాఉద్యమాలకు భయపడి, కోకోకోలా కంపెనీని నిషేధిస్తే, దానిని మరల కేరళ వామపక్ష ప్రభుత్వమే మొదట ఆహ్వానం పలికింది. దీనికి వత్తాసు పలికింది ఏచూరి కమిటీ. బలపరిచినది నాటి రాజకీయ నాయకత్వమే. ఈ విధంగా సామ్రాజ్యవాద కంపెనీలకు మొదటినుండి బార్లా తలుపులు తెరిచి ఆహ్వానించింది CPM నాయకత్వం.
అలాగే ఈ కుహనా కమ్యూనిస్టు ప్రభుత్వం యొక్క భూసంస్కరణల డొల్ల తనానికి వ్యతిరేకంగా నక్సల్బరీ రైతాంగ ఉద్యమం మొదలైనప్పుడు అత్యంత కౄరంగా అణచివేసినది CPM నాయకత్వంలోని ప్రభుత్వమే. ఆ కాలంలో (1967-69) బెంగాల్ ఉప ముఖ్యమంత్రి పదవిలో వున్నది బసు. రైతాంగ విప్లవ కార్యకర్తల రక్తం రుచిమరిగిన CPM నాయకత్వం తదనంతరం తమ పార్టీ శ్రేణులను సాయుధ ముఠాలుగా మార్చి, తమ ఏకచ్చత్రాధిపత్యాన్ని సాగించడానికి అణువుగా మార్చుకున్నాయి.
బయటకు కమ్యూనిస్టు ఎఱ జెండా ముసుగులో నందిగ్రాం, సింగూర్ లలో టాటా కంపెనీకి రైతాంగం భూములను వేలాది ఎకరాలను అమ్మి వేసింది కూడా బసు ప్రభుత్వమే. దానిని అడ్డుకునే క్రమంలో, విప్లవ శ్రేణులు తమ అలుపెరగని పోరాటం ద్వారా అడ్డుకుంటుంటే నేటికీ ఈయన ప్రియ శిష్యుడు బుద్ధదేవ్ గారు పారామిలటరీ బలగాలతో ఉక్కుపాదంతో అణచివేయడానికి నిరంతరం కేంద్రంతో లాలూచీ పడుతున్నారు. తృణమూల్ ను అడ్డుకునేందుకు సోనియాతో మంతనాలు జరిపింది బసుగారే.
ఈ విధంగా ప్రజా వ్యతిరేక కౄర పాలన సాగించడమే కాకుండా తన స్వంత కుమారునికి సుమారు 600 కోట్ల పెట్టుబడితో పరిశ్రమలేర్పాటుచేసి తన స్వంత ఆస్తిని కూడబెట్టుకున్నారు. ఇది జ్యోతిబసుగారి గురించి తెలిసిన కొంత సమాచారమే. చనిపోయిన వాని కళ్ళూ చారడేసిలా ఈనాడు ఒక్కో పాలకవర్గ దోపిడీ పార్టీ నాయకులు పోటీపడి సంతాప తీర్మానాలు చేయడం వారి సంఘీభావాన్ని తెలియజేస్తుంది.
ఈ నయారివిజనిస్టుల వారసులపట్ల ప్రజలు జాగ్రత్త వహించాలి.