విమర్శ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
విమర్శ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, ఫిబ్రవరి 2010, గురువారం

ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ

ఈ దేశంలో పుట్టి పెరిగినవారు ఒక ప్రాంతంనుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళడానికి భయపడేట్లు, వారి ఉనికినే ప్రశ్నార్థకం చేయడం భావ్యమా? మనమున్నది ప్రజాస్వామ్య గణతంత్ర ఫెడరల్ దేశంలోనా, లేక మత, ప్రాంతీయ, భాషాపరంగా విడగొట్టబడిన నేలమీదా?

తాను స్పాన్సర్ చేస్తున్న 20-20 టీం వలన ఇప్పటికే కోట్లాది రూపాయలు నష్టపోయిన కారణంగా, మొన్న జరిగిన క్రీడాకారుల వేలంపాటలో పాకిస్తానీ క్రీడాకారులను ఎవరూ కొనుక్కోకపోవడం గురించి మాట్లాడుతూ వారిని కూడా భాగస్వాములను చేసి వుంటే బాగుండేదన్న కారణంగా ఒక కళాకారుడిగా ఎక్కడా తన దేశభక్తిని శంకించేలా ప్రవర్తించని షారూఖ్ ఖాన్ పట్ల శివసేన తీవ్రంగా విరుచుకుపడడం చూస్తుంటే ముంబయి థాకరే దాదాల స్వభాషా, ప్రాంతీయ,మత దురభిమానం తారాస్థాయికి చేరుకొని అదొక పిచ్చివాళ్ళ రాజ్యంగా మారిందా అనిపిస్తోంది.

షారూఖ్ తండ్రివైపు తాత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నవాడే. తల్లిగారి తండ్రి నేతాజీ నేతృత్వంలో అజాద్ హింద్ ఫౌజ్ లో జనరల్ గా పనిచేసిన వారు. భారత్-పాక్ విభజనకాలంలో భారత్ వలస వచ్చిన కుటుంబం యొక్క దేశభక్తిని శంకించే మూర్ఖశిఖాణులను ఏమనాలో తెలియడంలేదు. తన స్వదేశ్, చక్ దే ఇండియాల వంటి సినిమాల ద్వారా దేశభక్తిని చాటిన షారూఖ్ ఎందరో క్రీడాకారుల్లో స్ఫూర్తిని రగిలించాడు.

మొన్నటికి మొన్న మన క్రికెట్ వీరుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ నేను ముందు భారతీయుడిని, తరువాత మరాఠీనన్నందుకు తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ప్రఖ్యాత చిత్రకారుడు M.F.హుస్సేన్ వేసిన బొమ్మలపై నిషేధం విధించి తనకు తాను దేశం వదిలివెళ్ళేట్లు చేసారు. తన చిత్రాలలో హిందూ దేవతలను నగ్నంగా చిత్రీకరించారని ఆరోపణ. మరి మన దేవాలయాలపై బూతుబొమ్మలు ఎవరివి?

ఇలా కళాకారులపై, వారి స్వేచ్చపై ఆంక్షలను విధిస్తూ, ఫత్వాలను జారీచేస్తూ, ఇప్పటికి గత 15 ఏళ్ళూగా అధికారానికి ప్రజలు దూరంచేసినా, తమ ప్రైవేటు సైన్యాలతో దాడులు చేస్తూ, విపరీత ధోరణితో విఱవీగే ధాకరేలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి.

తాజాగా రాహుల్ గాంధీ ముంబయి పర్యటన కూడా భయం భయంగా హెలికాప్టర్ తో చేసే దుస్థితి కల్పించినట్లు వార్తలు చెప్తున్నాయి.

తమ స్వలాభం కోసం యిలా కుల, మత, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టే వారికి తగిన మానసిక చికిత్స అవసరం.

9, నవంబర్ 2009, సోమవారం

మార్క్సిస్టు పార్టీగా పిలవబడడానికి అర్హత వుందా?


రెండు రోజుల క్రితం ప్రకాశ్ కారత్ మార్క్సిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి హోదాలో ఒక నిజాన్ని మాటాడారు. చైనా మావో ఆలోచనా విధానాన్ని వదిలేసి చాలా రోజులయిందని, దానిని అనుసరిస్తున్న మావోయిస్టు పార్టీ సిధ్ధాంతం అవుట్ డేటెడ్ అని. ఈ మాటలు ఇంతకు ముందు విన్నట్టుంది కదూ? అదేనండి తనకు తాను ప్రపంచ బాంకు సి.ఇ.ఓగా ప్రకటించుకున్న చంద్రబాబునాయుడూ అదే అన్నాడు. ఈనాడు మరల తమ ఉనికికే ప్రశ్నార్ధకంగా మారిన బెంగాల్ లో తమకు కొరుకుడుపడకుండా వున్న బలీయమైన ప్రజా మద్దతుతో ముందుకు వస్తున్న మావోయిస్టులను చూసి ఓర్వలేక ఈ నిజాన్ని మాటాడాడు. చైనా కేపిటలిస్టు పంథాలో, డెంగ్ ఆలోచనా విధానంలో పూర్తిగా కూరుకుపోయిన వైనాన్ని ఒప్పుకున్నాడు. తామూ అదే విధానంలో కొనసాగుతూ బెంగాల్ లో ప్రజలకు దూరమై పెట్టుబడిదారీ వర్గాన్ని భుజాన మోయడానికి రెడీ అయి ఇంకా మార్క్సిస్టు పార్టీ పేరుతో చెలామణీ కావడం ఎంతవరకు సమంజసం? ఇందిరమ్మ కొంగు పట్టుకు వేలాడి కొన్నాళ్ళు, సోనియా చెంగు పట్టుకు తిరిగి కొన్నాళ్ళు ప్రజలను పార్లమెంటరీ మురికి కూపంలో ముంచడానికి తమ వంతు సహకారాన్నిస్తూ ఎర్ర ఝెందా నీడలో మోసపు బతుకు బతికే వీళ్ళు ఏమాత్రం క్షమార్హులు కారు. పాలు తాగే తల్లి రొమ్మునే గుద్దే నీచులుగా అధికారంకోసం దేనికైనావెనుకాడని వీళ్ళని ప్రజలు ఇంకెంతో కాలం అంగీకరించరు. వీళ్ళ ఝెండా, ఎజెండా అధికార భాగస్వామ్యం తప్ప వేరుకాదు. కా.లెనిం తీవ్రంగా హెచ్చరించిన ట్రేడ్ యూనియం పోరాటాల ఊబిలో జనాన్ని కూరి పబ్బం గడుపుకోజూస్తున్నారు.

ఈ రెండు పార్టీలకు నాదొకటే విజ్ఞప్తి: మీ ఝెండాల రంగు, గుర్తులు, పార్టీల పేరులు మార్చుకొని మీ నిజస్వరూపాన్ని ప్రజలముందుంచండి. వాటిని వాడుకునే హక్కు ఇంకెంతమాత్రమూ మీకు లేదు.

21, అక్టోబర్ 2009, బుధవారం

ఆపరేషన్ గ్రీన్ హంట్ వెనక చిదంబర రహస్యం

దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించే కార్యక్రమంగా ప్రకటించిన ఆపరేషన్ గ్రీన్ హంట్ కార్యక్రమం ఎవరి గురించి చేపట్టారు? నిజానికి ఈ రోజు నూటా పది కోట్లకు పైగా జనాభా కలిగిన భారత దేశంలో మావోయిస్టు పార్టీ వెనక వున్నజనం ఎంతమంది? ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారుగా నాలుగువేలమంది సాయుధ మావోయిస్టు సభ్యులున్నారని తెలుస్తోంది. మరి వీరి గురించి సుమారు లక్షకు పైగా సైన్యాన్ని తరలించే కార్యక్రమం చేపట్టిన దేశీయ వ్యవహారాల మంత్రి ఇదంతా ఎవరికోసం చేస్తున్నట్లు. శ్రీలంకలో రాజపక్సే ఎల్టీ టీఈ వారిని సైనిక చర్యల ద్వారా అత్యంత పాశవికంగా అణచివేసిన స్ఫూర్తితో ఇక్కడ కూడా అదే పద్ధతిలో మావోలను పూర్తిగా నిర్మూలించే కార్యక్రమాన్ని చేపట్టారు.

అయితే వీరి కార్యక్రమం వలన వేలాది గిరిజన ప్రజానీకం నిర్వాసితులవుతున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో అనేక మంది వూచకోతకు గురయ్యారు. దీనిని ఆపేందుకు సిటిజన్స్ ఇనిశియీతివ్ ఫర్ పీస్ పేరిట నిన్నను ఢిల్లీలోజరిగిన ఒక సమావేశంలో దీశావ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన మేధావులు, మాజీ న్యాయమూర్తులు, పౌరహక్కుల సంఘాల నేతలు దేశంలో అంతర్గత యుద్ధం తగదని ప్రభుత్వానికి హితవు చెప్పారు. దీనికి సమాధానంగా చిదంబరం మావోలు హింసను విడనాడితే మేము చర్చలకు సిద్ధమని ప్రకటించారు. కాని ఆయన ప్రకటనను నమ్మేందుకు ఆయన గురించి తెలిసిన వాళ్ళెవరు నమ్మలెరని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ వ్యాఖ్యానించారు. ఇటివల ఒక విదేశీ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోచిదంబరం మాటలకు చేతలకు మధ్య వున్న వైరుధ్యాన్ని ఆమె వివరించారు. చిదంబరం హార్వర్డ్ లో శిక్షణ పొందిన న్యాయవాది. దేశ చరిత్రలో మొదటిసారి అతిపెద్ద కార్పోరేట్ కుంభకోణం జరిపిన ఎన్రాన్ సంస్థకు ఆయన న్యాయవాదిగా వ్యవహరించారు. సెక్యూరిటీకుంభకోణం లో పాలుపంచుకున్న ఫైయిర్ గ్రోత్ కంపెనీలో వాటాలు కొన్నందుకు పీవీ హయాంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసారు. ఒరిస్సాలో మైనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద మైనింగ్ కార్పోరేట్ సంస్థ వేదాంత గవర్నర్ల బోర్డ్ లో చిదంబరం వున్నారు. ఆర్దిక మంత్రి అయిన మొదటి రోజే ఈ బోర్డ్ కు రాజీనామా చేసారు. ఆయన ఎన్నో పెద్ద పెద్ద కంపెనీల తరపున న్యాయవాదిగా వ్యవహరించి ఆర్ధిక మంత్రి అయిన తర్వాత వాటినుండి వైదొలిగారు. అయితే చిదంబరం స్థానంలో ఆయన సతీమణి నలిని ఆ కేసులను వాదించడం యాదృచ్చిక మాత్రం కాదు.

ఈ దేశంలో ఎనభై ఐదు శాతం మంది ప్రజలు నగరాల్లో జీవిస్తే దేశం బాగుపడుతుందని ఆయన ఒకసారి ప్రకటించారు, అంటే దాదాపు డబ్భై కోట్ల మంది దాకా పల్లెలు ఖాళీ చేసి పట్టణాలలో పడాలన్నమాట. దీనిని సాధించేందుకు లక్షలాది మంది సైన్యాన్ని గ్రామాలకు తరలించి ఖాళీ చేయిస్తున్నారు. అత్యంత ఆధునిక ఆయుధాలతోను, ఉపగ్రహ సహకారంతోను మావోయిస్టులను అణచివేసేందుకు లక్షల కోట్ల ప్రభుత్వ ధనాన్ని వినియోగిస్తున్నారు. నిజానికి ఇదే చైతన్యంతో మారుమూల గ్రామాలకు కనీస సౌకర్యాల కల్పనకు ఈ దేశంలో గత అరవై రెండు సం.లుగా ఏలిన ప్రభుత్వాలు కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు., ఆదివాసీ ప్రాంతాలపై ప్రభుత్వ దృష్టి మళ్లడం వెనుక ఆ ప్రాంతంలోని ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు విదేశీ కంపెనీలకు అవకాశంకల్పించేందుకు మాత్రమేనన్నది చిదంబర రహస్యమేమీ కాదు. విదేశి కంపెనీలు ఈ దేశంలో స్వేచ్చగా అడుగు పెట్టేందుకు చిదంబరం వంటి ఆర్ధిక మంత్రి కావలసి వచ్చాడు మన్మోహన్ సింగ్ కు. అలాగే ఇప్పుడు వారి కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అడ్డుపడుతున్న మావోయిస్టులను అణచివేసేందుకు హోం మంత్రి రూపంలో చిదంబరం అవసరమయ్యాడు. చర్చలు జరిపినా, అందుకు మావోయిస్టులు అంగీకరించినా చిదంబరం ఆదివాసీలను తమ ప్రాంతంలో తామూ నివసించేందుకు అనుమతిస్తారా? అంతర్గత యుద్ధం చేయడానికి ఇంతగా ముందుకు వచ్చిన తరువాత చర్చలు అన్నవి ఒక ముసుగు మాత్రమె. తెల్లపంచే, దోవతిలతో, చెరగని చిరునవ్వుతో అడ్డు నామంతో దర్సనమిచ్చే ఈ గోముఖ వ్యాఘ్రం వెనక వున్న శక్తి సామ్రాజ్య వాదమని వారి పెట్టుబడితో, ఆయుధ, సాంకేతిక సహకారాలతో విరుచుకు పడుతున్నది కార్పోరేట్ పెట్టుబడిదారీ వ్యవస్థని అర్థం కాని ముర్ఖులేవరున్నారు.

ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరిట దళారి బూర్జువాలు, అమెరికన్ సామ్రాజ్యవాదులు ఈ దేశ వనరులను కొల్లగొట్టేందుకు వీలుగా వత్తిళ్ళు చేయడమే వీరి ఉద్దేశ్యం. టాటాలు, మిట్టల్స్, రుయాలు, జిందాల్స్, బిర్లాలు, వేదాంత, పోస్కో కంపెనీలు యుపియే నేతలకు ఎన్నికల నిధులు సమకూర్చాయి. వారి దోపిడీని అడ్డుకునే ప్రథాన శత్రువు దేశంలో మావోయిస్టు పార్టీ మాత్రమే. అందుకే వారి అడ్డును పూర్తిగా తొలగించే కార్యక్రమాన్ని చేపట్టే పేరుతొ ఆదివాసీ ప్రాంతాలను అప్రకటిత యుద్ధానికి సిద్ధమయింది. ఈ వినాశకర యుద్ధాన్ని ఆపేందుకు మేధావులు, ప్రజాస్వామిక వాదులు కృషి చేయాలి. నిజానికిది నక్సలిజం పై యుద్ధం పేరుతొ సహజ సంపదను బడా కంపెనీలకు ధారాదత్తం చేసే కుట్రగానే గుర్తించాలి.

2, అక్టోబర్ 2009, శుక్రవారం

గాంధీ - దాగిన మరో కోణం


మోహం దాస్ కరం చంద్ గాంధీ, జాతిపితగా, మహాత్మాగా మనకందరికీ తెలిసిన కోణం. కానీ అందరికీ సుపరిచితమైన ఆ ఆహార్యం వెనుక దాగిన నగ్న సత్యాలు అనేకం.

నిజానికి గాంధీ ఏనాడూ ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని తీసుకు వచ్చే ప్రయత్నం చేయలేదు, ప్రజల ఆగ్రహం పతాక స్థాయికి చేరి బ్రిటిష్ పాలకులు ఇరకాటంలో పడ్డ నాడు ఆ పోరాట రూపాన్ని వదులుకునేందుకు కూడా వెనకాడలేదు. ఇందుకు చౌరీ చౌరా సంఘటన జరిగినంతనే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేసారు. అలాగే బొంబయి రేవు కార్మికులు సమ్మెకు మధ్ధతుగా మన సైనిక దళాలు కూడా సమ్మె చేసేందుకు వెనుకాడని పరిస్థితి వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుండి భద్రంగా తప్పుకునేందుకు అర్ధరాత్రి స్వాతంత్ర్య ప్రకటన చేయించాడు. ఇలా ఈ దేశం అర్ధ వలస, అర్థ భూస్వామ్య వ్యవస్థగా మారడానికి సహకరించి సామ్రాజ్యవాదుల ఏజెంటుగా నమ్మిన బంటు పాత్రను అత్యంత నమ్మకంగా పోషించాడు.

అసలు కాంగ్ర్రెసు పార్టీ ఆవిర్భావమే బ్రిటిష్ పాలకులకు అణుగుణంగా జరిగింది. కాంగ్రెసు పార్టీ వ్యవస్థాపకుడు ఎలెం ఓక్టాలియా హ్యూం ఒక బ్రిటిష్ ఉన్నతాధికారి. పార్టీ ఆవిర్భావ పరిస్థితి నాటి (1885) భయంకర కరువు పరిస్థితులు లోలోపల రగులుకొంటూ పైన నివురుగప్పిన నిప్పులావున్న భారతీయుల అసంతృప్తి, ద్వేషమూగ్రహించిన హ్యూం అప్పటి వైస్రాయి డఫరిం దగ్గరకెళ్ళి పరిస్థితిని వివరించాడు. ఆ సూచన ఇలా వుంది:

“ భారత దేశంలో బద్దలవటానికి సిద్ధంగావున్న సాయుధ విప్లవాన్ని అడ్డగించడానికి ఒకే ఒక మార్గం వుంది. ప్రజలముందు చట్టబద్దమైన ఉద్యమాన్ని ఉంచుదాం. ఆఉద్యమంలో ప్రజలు పాల్గొని చట్టబద్దంగా తమ అసంతృప్తిని ప్రకటిస్తారు. దాన్ని బట్టి ప్రజలనాడి ప్రభుత్వానికి అర్థమవుతూ వుంటుంది. ఇలాంటి ఉద్యమాన్ని ప్రారంచించడం వల్ల బ్రిటీషు ప్రభుత్వానికి సహకరించే ఉన్నతవర్గాల భారతీయులు నాయకత్వ స్థానాన్ని అలంకరించి ప్రజల్ని విప్లవ మార్గం నుంచి తప్పించి చట్టబద్ధమైన ఉద్యమంవైపు లాగుతారు. అప్పుడు ఆ ఉద్యమం పైన బ్రిటీషు ప్రభుత్వం గట్టిపట్టును కలిగివుంటుంది.’ (యశ్ పాల్ రాసిన రామరాజ్యం – పేజీ 69).

దోపిడీవర్గాలకి దురాలోచనే కాక ఎంతటి దూరాలోచనా! జాతీయోద్యమాన్ని కాంగ్రెసు పార్టీ, గాంధీ ఇలానే నడిపించారు.

అయినప్పటికీ 1905 లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ఉవ్వెత్తునసాగటం, మధ్యతరగతి యువకులు బ్రిటీషు ముష్కరుల పైన దాడులు చేయటం జరిగింది. పత్రికలలో వ్యాసాలు రాసినదానికే బాల గంగాధర తిలక్ కు 6 సం.ల కఠిన కారాగార శిక్ష విధించిన బ్రిటీషు పాలకులకు వ్యతిరేకంగా బొంబాయి కార్మికులు హర్తాళ్ళ్, బంద్ లు నిర్వహించి రాజకీయాల్లోకార్మికులు క్రియాశీలక పాత్ర నిర్వహించే కాలం వచ్చిందనే హెచ్చరిక చేసారు. ఈ అసంతృప్తిని పక్కదారి పట్టించగల సమర్ధవంతమైన నాయకత్వం, బ్రిటీషు పాలకులకి దేశీయ భూస్వామ్య దళారీ బూర్జువాలకీ అవసరమయింది.

దక్షిణాఫ్రికాలో బ్రిటీషు పాలకులకి వ్యతిరేకంగాపోరాడిన ‘ జూలూ ‘ జాతి రైతుకూలీల పోరాటంలోనూ, బోయర్ యుధ్ధకాలంలోనూ, మొదటి ప్రపంచ యుద్ధం లోనూ బ్రిటీషువారికి తోడ్పడంలో ప్రాణాపాయ స్థితిని తెచ్చుకోడానికి కూడా వెనుకాడనిప్రభుభక్తిని గాంధీ ప్రదర్శించాడు.(భారదేశంలోని ఇంగ్లీషు వారందరికీ – గాంధీ బహిరంగ లేఖ అధారం). తమకు కావలసిన వాడు ఇతడే అని గుర్తించారు.

ఉదా: బీహార్ లోని చంపారం లో నీలిమందు రైతుల పోరాటాన్ని సంస్కరణవాద ఊబిలోకి లాగటం, రౌలత్ చట్టానికి, జలియన్వాలా బాగ్ దురంతాలకు వ్యతిరేకంగా సాగిన ప్రజల ఆందోళన హద్దులు దాటుతోందని నిలిపివేయటం జరిగింది.

సామ్రాజ్యవాదుల ఎడల భారత ప్రజల అసంత్రుప్తి తీవ్రత ఎంతలా వుందంటే ఏ కొద్దొ రాయితీలు పొందే ఉద్యమానికి పిలుపునిచ్చినా లక్షలాదిగా తరలి వచ్చే వారు. ప్రజా పోరాట జ్వాలను చల్లార్చటానికి ఆఉద్యమాన్ని అడ్డుకట్ట వేయడానికి గాంధీ ‘ శాంతి ‘ మంత్రం జపించి వారి పునాదులను కాపాడే వాడు. అందుకే వారికి మహాత్ముడయ్యాడు.

1931 లో గాంధీ స్వభావాన్నిగూర్చి స్టాలిన్ చెప్పిన మాటలు “ భారతదేశం, ఇండోచైనా, ఇండోనేషియా, ఆఫ్రికాఖండంలోని దేశాల్లోని విప్లవ పోరాటాలని కసాయి బూర్జువా పరిపాలకులు రక్తపుటేరుల్లోముంచారు. కౄరమైన హింసావిధానం ద్వారా అక్కడి ఉద్యమాల్ని అణచడానికి ప్రయత్నించారు. వాళ్ళ ప్రయత్నాలు రెండు రకాలుగా జరిగాయి. ఒకటి – తుపాకీ ద్వారా విప్లవోద్యమాన్ని అణచడము , రెండవది – గాంధీ లాంటి వ్యక్తి ద్వారా విప్లవోద్యమాన్ని పక్కదారి పట్టించడమూ!”

అలాగే వైస్రాయి ఇర్విన్ రైలు పేలిపోయే విధంగా విప్లవకారులు బాంబులు పెడితే అవి పేలినా వైస్రాయి క్షేమంగా బయటపడ్డందుకు చాలా సంతోషించాడు. ఈచర్యను ఖండిస్తూ కాగ్రెసు సభలలో తక్కువ మెజారిటీతో తీర్మానాలు చేయించుకుని ప్రభుభక్తిని చాటుకున్నడు.. విప్లవ కారులను నిందిస్తూ ‘ కల్ట్ ఆఫ్ ది బాంబ్ “ అనేవ్యాసం రాసాడు. దీనికి జావాబుగా వారు ‘ ఫిలాసఫీ ఆఫ్ బాంబ్ “ రాసి అందులో గాంధీ స్వభావాన్ని ఇలా పేర్కొన్నారు:

“ కాంగ్రెసు ప్రజలలోస్వాతంత్ర్య ఇచ్చను కలిగించిందని మేమూ ఒప్పుకుంటాం. అయితే అంతటితో కాంగ్రెసు బాధ్యత తీరిపోలేదు. దేశానికి కాంగ్రెసు చేయవలసినది ఎంతో వుంది. కానీ ఆసంస్థ మీద దళారీరాజకీయాలను అభిమానించే నాయకుల ప్రాబల్యం ఎక్కువైంది. కాంగ్రెసు చెప్పే అహింస విదేశీ పాలకులతో రాజీ బేరాలకు దిగడానికి ఒక సాకుగా తయారయ్యింది.”

గాంధీ-నెహ్రూల నాయకత్వం భగత్ సింగు తదితరుల ఉరిశిక్ష రద్దుకు సీరియస్ గా ప్రయత్నించనిది దళారీ రాజకీయాల కారణంగానే. కరాచీలో నెహ్రూ అధ్యక్షతన జరగనున్న కాంగ్రెసు సమావే్సానికి (మార్చి 25 1931 న) ఏ అడ్డంకీ రాకుండా వుండేందుకు భగత్ సింగు, రాజగురు, సుఖదేవ్ ల ఉరిని 23 రాత్రి 7.30 ని.లకి ( చట్టానికి వ్యతిరేకంగా రాత్రి ఉరితీయరాదు) అమలుచేయించాడు.

ఈదేశప్రజలలో మత మౌఢ్యాన్ని పెంచడానికి తాను అనుసరించిన సనాతన ధర్మం, మత మార్పిడుల పట్ల వ్యతిరేకత తోడ్పడ్డాయి.

హి వాజ్ ఏక్టెడ్ ఏజ్ ఏన్ ఇన్విజిబిల్ ప్రొటెక్టర్ టు ది బ్రిటిష్ రాజ్ ఎండ్ ఇండియన్ బూర్జువాజీ.

(ఈ వ్యాసం రాయడానికి ‘ నా నెత్తురు వృధాకాదు ‘ పుస్తకంలోని వ్యాసాలను ఆధారం చేసుకున్నాను.)

4, సెప్టెంబర్ 2009, శుక్రవారం

మరో మారు షాజహన్ మరణించాడు


మొన్నటి నుండీ ఆంధ్ర ప్రదేశ్ అంతటా అలముకున్న కారు మబ్బులు నిన్నటి ఉదయానికి వీడిపోయాయి. కాని అవి తెలుగు ప్రజల మనసుపై తీవ్రంగా కమ్ముకున్నాయి. తమతమ రాజకీయ భావాలు ఏవైనా తాము నిత్యమూ ఏదో ఒక రూపంలో చూస్తున్న, వింటున్న మనిషి అర్ధాంతరంగా గగనతలం నుండి అంతర్ధానం కావడాన్ని జీర్ణించుకోలేకపోయారు. నిత్యమూ చిరునవ్వులు చిందిస్తూ తను అనుకున్నది నిర్ధ్వందంగా చేసుకుంటూ ముందుకు సాగిపోయే మొండిమనిషి మరి లేడన్న వాస్తవాన్ని అంత తొందరగా సున్నిత మనస్కులైన తెలుగు ప్రజానీకం అంగీకరించలేకపోయారు. ఇది మరో మిస్టరీగా మిగిలిపోయింది అందరి మదిలో. నమ్మినదానిని ఆచరించడం, నమ్ముకున్న వాళ్ళను ఎంత కష్టమొచ్చినా, అది తనకు ఎంత నష్టదాయకమైనా వాళ్ళకోసం ఎంతటి త్యాగమైనా చేసే మనిషి మరి కనరాడన్న సత్యం ఇంకా అసత్యంగానే నమ్ముతున్న వాళ్ళు అధిక శాతం ఉన్నరనడం కఠోర వాస్తవం. ఇంతమంది హృదయాలలో బందీగా వున్న వాడికి ఈ అకాల మృత్యువు నిజమైనదేనా అని నా సందేహం. నేను నా చుట్టూ వున్న సామాన్య జనం వ్యక్త పరుస్తున్న అనుమానాలను ఇక్కడ మీతో పంచుకుంటున్నా.
అ. తండ్రి మరణిస్తే తనకు కొన్ని తరాలకు సరిపోయే సిరి సంపదలు ఇచ్చిన వాడి ఆచూకీ
కోసం వేలాదిగా తరలి వస్తే తాను ఎందుకు రాలేదు?
ఆ. మీడియా ముందుకు నిన్నటి మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులెవరూ కనబడరేం?
ఇ. శవపేటిక వద్ద స్టైలిష్ గా నిలబడి నవ్వుతూ అందరికీ చేతులుకలుపుతూ కొద్దిసేపు ఫోజులిచ్చి వెళ్ళిపోవడం తన ధీరోదాత్తతను వ్యక్తం చేయడమా?
ఉ. పిచ్చి జనం గుండె ఆగి, ఉరివేసుకొని, గొంతుకోసుకుని మరణించారు. మరి తన ఉప్పుతిన్న వాడెవడూ పోలేదే?
ఊ. అంతర్ధానమైన మరుక్షణమే ఢిల్లీలో తన అనుచరులను పంపి మంతనాలు సాగించిన వారసుడి నైజం
బయటపడలేదా?
ఋ. పార్ధీవ దేహం ఇంకా ఇంటికి రాకముందే అరువుకుక్కల మీడియా వాళ్ళ స్క్రోలింగులలో తమకు తాను తప్ప దిక్కులేదని తన అనుచర గణంతో ప్రకటనలు ఇప్పించుకోవడం చూస్తుంటె నా లాంటి అమాయక అనుమానపు జనం గుడ్లప్పగిస్తూ చూడడం తప్ప ఏమీ చేయలేని మాటాడలేని నిస్సహాయతను తిట్టుకుంటూ....
ౠ. సాయంత్రమయ్యేసరికి నూరుకుపైగా సంతకాలు రెడీ, దొంగఏడుపుగాళ్ళు ఒకపక్క ఓ మాకలల నేత పోయాడని అంటూనే, చివర్లో యువనేత తప్ప మరో దారిలేదని నిర్లజ్జగా ప్రకటనలివ్వడం జనం వెర్రిపప్పలనేగా?
ఎ. వారసత్వ రాజకీయాలను, అధికారాన్ని ఆమోదించడమేనా మన ప్రజాస్వామ్యం?

పైవన్నీ ఒక నిస్సహాయ తెలుగు వాడిగా నా అనుమానాలు మాత్రమేనయ్యా...
మనసెందుకో ఈ ఔరంగజేబును అంగీకరించలేకపోతోంది....

6, ఆగస్టు 2009, గురువారం

నాటో - మానవ హనన రాకాసి


ఆఫ్ఘనిస్తాన్ లో నేడు పర్యటిస్తున్న నాటో అధిపతి రామ్సుస్సేన్ దేశంలో సామాన్య జనం హతులవకుమ్డా చూస్తామని హామీ ఇచ్చాడు. అసలు వాళ్ల దేశంలో అడుగు పెట్టి వాళ్ల ప్రాణాలకు వీడు హామీ ఇవ్వడం ఏమిటి? భూమండలంలోనే స్వతంత్ర దేశం లేకుండా చేస్తున్న అమెరికా వాడికి వత్తాసుగా ఏర్పడిన దుష్ట కూటమి ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఇటివలి రాకెట్ దాడులలో ఇద్దరు చిన్న పిల్లలు, ఒక పెద్దాయన్ చనిపోయారని వారి పార్ధివ శరీరాలను బహిరంగంగా చూపించినా అలాంటిదేమీ లేదని బుకాయి౦చుతున్నారు వీళ్ళు. ముస్లిం సమాజాన్ని ఉగ్రవాదులుగా ముద్ర వేసి వారిని సమూలంగా నాశనం చేసి వారి ప్రాకృతిక హక్కైన చమురు సంపదను దోచుకునే కుట్రలో భాగంగా జరుగుతున్నా మానవ హననమిది. వాడి మోచేతి నీళ్ళకి ఆశపడి మాత్రు దేశాన్ని తాకట్టు పెట్టె పాలక వర్గాల వత్తాసుతో వాడి దౌష్ట్యాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నాడు. ఇరాక్ యుద్ధం నాటినుండి పాలస్తీనా దురాక్రమణ వరకు లక్షలాది మంది అభాసుభం తెలియని పసివాల్లతో సహా హతమైన క్రూర దాడులకు గుణపాఠ౦గానే సెప్టెంబర్ దాడులు జరిగాయి. దాంతో సాకుతో మరింతగా రెచ్చిపోయి దాడులు చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని నామ రుపాల్లెకుండా బాంబింగ్ చేస్తున్నాడు. వాడి తొత్తు కర్జాయిని అధ్యక్ష స్థానంలో కూచోబెట్టి ప్రజలను ప్రేక్షకులను చేసాడు. ప్రజాస్వామ్య వాదులు అమెరికన్ దౌష్ట్యాన్ని ఖమ్దిచాల్సిన అవసరముంది. ఆఫ్ఘన్ ప్రజల పోరాటాలకు మద్దతు తెలియచేయాలని కోరుతున్నాను.

3, జులై 2009, శుక్రవారం

వానా వానా వందనం

మన ప్రయాణం ఎటు వైపు సాగుతుందో, మన ఆలోచనలు ఎటు వైపు మల్లి౦చబడుతున్నాయో చూస్తూ౦టే మనం ఇరవయ్యొకటో శతాబ్దంలోనే వున్నామా అనిపిస్తోంది. ప్రకృతిలో జరుగుతున్న వాతావరణ మార్పుల వలన, మనం చేస్తున్న ఆత్మహత్యా సద్రుస్యమైన ప్రక్రుతి విరుద్ధ కార్యాల వలన వర్షాలు పడక ప్రకృతి అల్లాడుతుంటే ప్రజలను శాస్త్రీయ ఆలోచనలవైపు మల్లి౦చకు౦డా వరుణ యాగాలు చేయమని పురమాయించడం సమస్యల నుండి దృష్టిని మల్లి౦చే ప్రయత్నం చేస్తూ తాము ప్రజల పట్ల ఎంతో ప్రేమగా వున్నామని నటిస్తూ తమ సొంత వ్యాపారాలను నిరాటక౦గా చేసుకునే నాయకమ్మన్యుల బ౦డారాన్ని బయటపెట్టే విపక్షం కూడా లేకపోవడం ఆ౦ధ్రుల దురదృష్టం. ప్రజల పట్ల నిబద్ధత కల పాలకులైతే వారిని శాస్త్రీయ ఆలోచనలవైపు ప్రోత్సహించి తద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడేట్లు చేయాలి. నిజానికి వరుణ యాగాలు పేరుతొ ఒక వర్గం ప్రజలను ప్రోత్సహి౦చి భక్తిని కూడా సరుకును చేసి కోట్లను కొల్లగొట్టే ప్రయత్నం కాదా? జనాలను ఇలా ఎ౦తకాల౦ మభ్యపెడతారు. ప్రతిపక్షాలు కూడా మతపరమైన భావాలు దెబ్బతింటే తమ ఓటు బ్యాంకు కోల్పోతామని కిమ్మనకు౦డా ఉంటున్నాయి. మన అంతరిక్ష పరిశోధనా శాస్త్ర వేత్తలైనా వీటి పట్ల ప్రజలకు వివరణ ఇస్తారని ఆశిద్దామంటే తాము కాపీ చేసి రూపొందించిన రాకెట్ల నమూనాలు సైతం తీసుకుపోయి తిరుపతి వెంకన్న పాదాల దగ్గర పెట్టె వారిను౦డి ఇది ఆశించగలమా? మన విశ్వవిద్యాలయాల ఆచార్యులున్నారంటే వారు ఎంతసేపూ తమ కులపోల్లకు పనికిరాని అంశాలనిప్పుంచుకొని డాక్టరేట్లు ఇప్పి౦చుకునే౦దుకు నిర౦తర౦ పోటీపడితేనే సరిపోతో౦ది. మరి మనవైపు ఎవరున్నారు? ఒకమారు అ౦దర౦ ఆలోచిద్దా౦. శాస్త్రీయ దృక్పధం వైపు సమాజాన్ని మళ్ళించేందుకు శాయశక్తులా కృషిచేసేందుకు కాస్తా ప్రయత్నిద్దామా?

1, జులై 2009, బుధవారం

హిరణ్యాక్షుడి పాలన

సహకార వ్యవసాయం పేరుతొ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో కంపెనీ పాలన మొదలవబోతోంది. రైతన్నకు వెన్నుదన్నుగా వుంటామని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన పాలకులు ప్రపంచ బ్యాంకు వారి ఆదేశాలకు లోబడి వ్యవసాయ రంగం నడ్డి విరిచే పనులు ఇంత తొందరగా మొదలు పెట్టి ఇన్నాళ్ళు తాము వేసుకున్న ముసుగును తొలగించుకున్నారు. సోషలిస్టు రాజ్యాలలోనే విఫలమైన సహకార వ్యవసాయం ఇంతవరకు ఫ్యూడల్ రూపంలోంచి పూర్తిగా బయటపడని మన ఆర్ధిక, సామాజిక వ్యవస్తలో ఇది సాద్యమా. చిన్న చిన్న కమతాలుగా కొనసాగుతున్న మన వ్యవసాయం నేడు ఎదుర్కొంటున్న ప్రధాన సంక్షోభం పెరిగిపోయిన పెట్టుబడి, గిట్టుబాటు ధర లేకపోవడం, మార్కెట్ సదుపాయాలు కొరవడడం, ఎగుమతి అవకాశాలు మృగ్యమైపోవడం వలన రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి వ్య్వవసాయం ప్రాణాపాయ౦గా మారిన పరిస్థితుల్లో రైతాంగం దాని నుండి దూరమై కూలి బతుకులవైపు నేట్టివేయబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఉపాధి హామీ పధకం వలన గ్రామీణ ప్రాంతంలో పెరిగిన కూలి రేట్లు సామాన్య రైతు నడ్డివిరిచాయి. ఈ పధకం అమలు వెనుక వున్న కుట్ర ఇప్పుడు ఈ రకంగా బయటపడుతోంది. అపరిమితంగా పెరిగిపోయిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాల ధరలను అదుపుచేయలేని ప్రభుత్వం (బడా విదేశి కంపెనీలకు బాసటగా వుంటూ) నేడు వుత్పత్తి తగ్గిందన్న సాకుతో రైతాంగాన్ని తమ రంగం నుండి దూరం చేసి వారి వద్దనున్న ఆస్తిని లాక్కుని బడా కంపెనీలకు ఇప్పటికే కొన్ని లక్షల ఎకరాల భూమిని ప్రాజెక్టుల పేరుతొ సెజ్ ల పేరుతొ కట్టబెట్టి౦దికాక ఈ రూపంలో కూడా వారినుండి వున్న ఆ కొద్ది మొత్తం భూమిని కూడా లాక్కునే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. భారత రైతాంగం యొక్క మనఃస్థితిని సరిగా గుర్తించని పాలక వర్గం చేస్తున్న రాక్షస కృత్యం ఇది. ఎందుకంటే భూమిని తన సొంత ఆస్తిలా భావించే రైతు దాని నుండి వేరు చేయబడితే దాని పర్యవసానం ఎంత తీవ్రంగావుంటుందో? ఇప్పటికే నలుగురికీ కూడుపెట్టే రైతన్న అప్పుల వూబిలో కూరుకుపోయి ఆత్మహత్యల పాలయ్యాడు. చెంచాడు ఇచ్చి గంగాళం దొ౦గిలి౦చుకుపోయే పాలక వర్గం ఎన్నికల ముందు బ్యాంకు అప్పులు మాఫీ పధకంతో అధికారంలోకి వచ్చి వారి కాలికింద నేలనే హరించే హిరణ్యాక్షుడి రూపాన్ని నిస్సిగ్గుగా బయట పెట్టుకుంటోంది. నేడు రైతాంగం ఎదుర్కొంటున్న మరో సమస్య తమ వైపు మాటాడె వారు లేకపోవడం. వున్న రాజకీయ పక్షాలన్ని గతంలో ప్రపంచ బ్యాంకు పాలెగాల్ల దగ్గర వూడిగం చేసినవే. గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్తగా ముసుగేసుకున్న స్వామినాధన్ తన సామ్రాజ్య వాద ముసుగును ఇలా తొలగించాడు. తెగించి రోడ్డెక్కలేని రైతాంగానికి అత్మహత్యలే శరణ్యం. ఖచ్చితంగా మరో స్వతంత్ర పోరాటం భూమి, భుక్తి కొరకు సాగించాల్సిన అవసరం ప్రజలందరికీ వుంది. లేకపోతే మన వునికిని కోల్పేయే ప్రమాదం మరెంతో దూరంలో లేదు. హిరణ్యాక్షుల వధ మరల జరగక పోతే భూమాతను చాపలా చుట్టిన వైనం నేడు మరలా మన తరంలోనే చూసే దుస్థితి పునరావృతమవుతోంది.

15, జూన్ 2009, సోమవారం

మృగాళ్ళ రాజ్యం

మృగాళ్ళాంటి మగాళ్ళు సంచరించే లోకమిది! నదివీధిలోనైనా, నట్టింట్లోనైనా ... మగువకు రక్షణ లేదని మరోమారు రుజువైంది. రాష్ట్రంలో అబలలపై జరుగుతున్న దారుణాలకు అంతులేకుండా పోతోంది. నిన్నను అనంతపురం, నెల్లూరులలో జరిగిన సంఘటనలు మరీ భయనకంగా వున్నయి. స్త్రీలపై దాడులు మరింతగా మహిళా గృహమంత్రి పాలనలోనే అధికంవడం వారి దురద్రుష్టం. అనంతపురంలొ బహిరంగ మార్కెట్లొ భర్త చూస్తుండగానె ఆటోలొ ఎత్తుకుపోయి అత్యాచారం చేసారు. ఈవిషయాన్ని అటుగా వస్తున్న పోలీసు వారికి చెప్తే అది తమ పరిధిలోని ఏరియా కాదని నిష్కర్షగా, నిర్లజ్జగా వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం. రాష్ట్రాలు దాటి అరెస్టులు, ఎదురుకాల్పులు జరిపుతున్నప్పుడు తమ పరిధి గుర్తుకురాదు వీల్లకి. నెల్లూరులొ తన వాంచ తీర్చలేదని 15 యేల్ల బాలికను కెరోసిన్ పోసి ఒకడు చంపాడు. రోజు రోజుకు మహిలలపై దాడులు పెరిగిన తీరు బట్టి సమాజంలో పెరిగిపోతున్న నేరప్రవృత్తి, మనుషుల మనసులపై సినిమాల, సీరియల్ల ప్రభావం, దబ్బు, అధికారంలతో అమైనా చేయగలమనే ధైర్యం కలుగుతుండడం సమాజానికి మంచిది కాదు. దీనిని అందరూ గుర్తించి జాగరూకత వహించాలి.

13, జూన్ 2009, శనివారం

ద్వంద్వ ప్రమాణాలు

నేడు సమాజంలో ప్రతి విషయంలో ద్వంద్వ ప్రమాణాలు రాజ్యమేలుతున్నాయి. ఉన్నతస్థాయి పదవులు మహిళలకు కట్టబెట్టామని చెపుతున్న రాజకీయ పార్టీలు రోజువారీ జరుగుతున్నా దారుణాల పట్ల చూసీ చూడని ధోరణి అవలంబిస్తున్నాయి. ఒక దళిత మహిళను పార్లమెంటు అధ్యక్ష స్థానంలో కూచోబెట్టిన రోజే అనేకమంది మహిళలపై దారుణాలు జరిగిపోయాయి. అవికూడా రక్షక భటుల సాయంతో జరిగినాయని వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో ఒక మహిళా హోం మంత్రిగా వెలగబెడుతున్నప్పుడు వరుసగా ఇలాంటి దారుణాలు వెలుగులోకి వచ్చినా సరైన న్యాయం జరిగిన దాఖలాలు లేవు. చాల మామూలుగా శాఖా పరమైన దర్యాప్తులతో సరిపెడుతున్నారు.
అలాగే ఒకవైపు అవినీతి నిరోధక శాఖ వారిని వుసిగోలుపుతున్నట్లు ప్రకటనలు ఇస్తూ మరోవైపు ఎన్నాళ్ళుగానో అవినీతి ఆరోపనలేడుర్కున్న వారిని ప్రమాణ స్వీకార కార్యక్రమాల దగ్గరనుంచి రోజువారి పనులలో కూడా వెంటపెట్టుకు తిరిగుతున్న నాయకమ్మన్యులు మన ఏలికలు. ప్రజలవైపు మాటాడేవారిని తీవ్రమైన హెచ్చరికలతో భయపెడుతూ, మట్టుపెడుతూ తమ గోముఖ వ్యాఘ్రముఖాన్ని రోజూ చూపడం ప్రజల నిస్సహాయతను బయటపెడుతోంది. ప్రజలు తమకు మరో ఐదేళ్లు వరకు బానిసలుగా పడివు౦టారన్న ధైర్యం, ప్రతిపక్షం వారుకూడా ఎన్నికల వరకూ వాళ్ల వ్యాపారాలు కొనసాగాలన్న తమతో కలిసిరాక తప్పదన్న నాజీ ధోరణి ప్రస్ఫుటంగా కనబడుతోంది. దీనిని తొందరగా బద్దలుకొట్టే౦దుకు అంతా సమాయత్తం కావాల్సిన అవసరం వుంది.